చిన్నకోడూరు మండలం రామునిపట్లలో జిల్లా పరిషత్ పాఠశాలకు ఏండ్ల చరిత్ర ఉంది. నేడు వివిధ రకాల పూలు, పచ్చదనం పరుచుకున్న పాఠశాల ఆవరణ పండ్ల మొక్కలు, కలప చెట్లతో కళకళలాడుతున్నది. పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థుల చొరవతో ఇప్పుడు ఆ పాఠశాల ఆవరణ మొత్తం పచ్చదనాన్ని సంతరించుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించిన మొదటి విడతలో సీఎం కేసీఆర్ పిలుపు మేరకు పాఠశాల ఆవరణలో మొక్కల పెంపకాన్ని ప్రారంభించారు. ఇలా ప్రతి ఏడాది మొక్కలు నాటతుండడమే కాకుండా వాటిని కంటికి రెప్పలా కాపాడుతున్నారు.
విద్యార్థులు వాటి సంరక్షణ భాద్యతలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఈ పాఠశాలలో రాష్ట్ర మంత్రి హరీశ్రావు, జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, ఎంపీపీ మాణిక్యరెడ్డి, పాలకవర్గ సభ్యులు, పలువురు అధికారులు పలు మొక్కలను నాటారు. వాటి సంరక్షణ కోసం ట్రీ గార్డులను సైతం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆవరణ సందర్శకులను ఆకట్టుకుంటుంది. సిద్దిపేట నుంచి కరీంనగర్ రాజీవ్ రహదారి పక్కనే ఉండడంతో వాహనదారులకు పాఠశాల ముందు నాటిన మొక్కలు పచ్చ తోరణం వలె దర్శనమిస్తున్నాయి. ఆహ్లాదకరమైన వాతారణం ఏర్పాటుపై ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు అభినందిస్తున్నారు.
చిన్నకోడూరు, సెప్టెంబర్ 22: ప్రకృతి ఒడిలో సర్కారు బడి అలరారుతున్నది. చిట్టి చేతులతో వందల మొక్కలు నాటారు. నాటిన మొక్కలు సంరక్షించడానికి గట్టి నిర్ణయం తీసుకొని ఎవరు నాటిన మొక్కకు ఫ్లకార్డు మీద వారి పేరు రాసుకొని చాలా చక్కగా రక్షించగలిగారు. నేడు ఏపుగా పెరిగిన వచ్చని చెట్లు, పూల మొక్కల కింద ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులంతా ఆటలు, పాటలు, విద్యార్థులకు చదువుతో పాటు ఆహ్లాదాన్ని పంచుతున్నది. ప్రభుత్వ బడి, హరితహారంలో నాటి సంరక్షిస్తున్న మొక్కలతో నేడు నందనవనాన్ని తలపిస్తున్నది. సందర్శకుల్లో పర్యావరణ స్పృహ కలిగిస్తూ.. ప్రతి ఒక్కరిలో మొక్కలు పెంచుకోవాలనుకునే కాంక్షకు బీజం వేస్తున్నది.