సిద్దిపేట రూరల్, సెప్టెంబర్ 22: అధిక వర్షాలతో పంటల్లో తేమశాతం పెరుగుతుంది. దీంతో తెగుళ్లు, పురుగుల బెడద ఉంటుంది. వ్యవసాయ అధికారుల సూచనలు లేకుండా సస్యరక్షణ చర్యలు చేపడితే పంట దిగుబడిపై ప్రభావం పడే అవకాశం లేకపోలేదు. పంటలు దెబ్బతింటాయనే భయంతో కొందరు రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు పాటించకుండానే వ్యాపారులు చెప్పిన విధంగా యూరియా, క్రిమిసంహారక మందులు వాడుతుంటారు. దీంతో రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. అధిక వర్షాలతో పంటలకు సాధారణంగా నత్రజని అందుతుంది.
ఈ సమయంలో యూరియా వాడితే నత్రజని శాతం అధికం కావడంతో పంటలకు తెగుళ్లు సోకి పంట నష్టపోయే ఆస్కారం ఎక్కువగా ఉంటుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. పత్తికి ఆకుపచ్చ తెగులు సోకి ఎండిపోతాయి. ఈ తెగుళ్ల నియంత్రణకు లీటర్ నీటిలో కాపర్ ఆక్సీక్లోరైడ్, రెండు గ్రాములు మ్యాంకోజెట్ రసాయనాలు కలిపి 5-7 రోజుల్లో రెండుసార్లు పత్తి మొక్కల అడుగు భాగం తడిసేలా పిచికారీ చేయాలని సూచిస్తున్నారు. సిద్దిపేట రూరల్ మండలంలో ఆగస్టు నెలలో 141 మి.మీ. వర్షపాతం నమోదుకాగా, సాధారణ వర్షపాతం 38.3 మి.మీటర్ల కంటే అధికం.
సిద్దిపేట రూరల్ మండలంలో 8053 మంది రైతులు 12989 ఎకరాల్లో వరి పండిస్తుండగా, మొక్కజొన్నను 1213 మంది రైతులు 1377 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. 636 మంది రైతులు 715.21 ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు. మిగతా పంటలు అయిన జొన్నలు, కందులు, పెసర్లను 440 మంది రైతులు 416.31 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఇందులో వాణిజ్య పంటలు సాగు చేస్తున్న రైతులు 644 మంది కాగా 719 ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి.
రైతులు సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపడితే పంటలకు మేలు జరుగుతుంది. అధిక వర్షాలతో పత్తి, కంది, మొక్కజొన్న, వరి, పొద్దుతిరుగుడు, జొన్న తదితర పంటల్లో కలుపు నివారణ సమస్యగా మారనుంది. ఇప్పటికే యాంత్రీకరణతో వ్యవసాయం చేస్తున్న రైతులకు కూలీల సమస్య వేధిస్తోంది. ఇటీవల కొందరు రైతులు ముదురు నారుతో నాట్లు పూర్తి చేశారు. తేమతో కందిలో ఎండు తెగులు ఆశిస్తుంది. దీని నివారణకు పంట చేలల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. సమస్య ఉంటే వ్యవసాయ అధికారులను సంప్రదించి వారి సలహాలతో పురుగు మందులు పిచికారీ చేస్తే పంటకు లాభం చేకూరుతుంది.