మెదక్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ) : నిజాం రాచరిక పాలన నుంచి విముక్తి కల్పించి, హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసేందుకు జరిగిన ఉద్యమాల్లో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఎందరో యోధులు పాల్గొన్నారని వారి త్యాగాల ఫలితంగానే నేడు తెలంగాణ స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నదని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమాభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం మెదక్ కలెక్టరేట్లో మ్ంరత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టాక తెలంగాణను అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారని అన్నారు. నూతన సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టి చరిత్రను సృష్టించారని, హైదరాబాద్లో ఆదివాసీ, బంజారాభవన్లు ప్రారంభించుకోవడం శుభపరిణామమన్నారు. కార్యక్రమాల్లో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి
ఎందరో యోధుల త్యాగాల ఫలితంగా 1948 సంవత్సరంలో సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం దేశంలో భాగస్వామ్యమైందని, ఆనాటి రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య పరిపాలన సాగిస్తూ.. స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను పురసరించుకొని శనివారం మెదక్ కలెక్టరేట్లో జాతీయ పతాకాన్ని ఆవిషరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి మంత్రి మాట్లాడుతూ భారత దేశానికి 1947 ఆగస్టు 15 న స్వాతంత్య్రం వచ్చినా హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో అంతర్భాగం కానీ అప్పటి పరిస్థితుల్లో ఉధృత స్థాయిలో ఉద్యమాలు జరిగాయని, అందులో మెదక్ జిల్లా నుంచి యోధులు పాల్గొన్నారని అన్నారు.
మెదక్ పట్టణానికి చెందిన చోళ్ల లింగయ్య ఇంజినీర్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొన్నారని, వెల్దుర్తి మాణిక్యరావు తన రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపారని తెలిపారు. తొలి ఆంధ్ర మహాసభలు ఉమ్మడి మెదక్ జిల్లా జోగిపేటలో జరిగాయని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ ఇటీవలే స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలను రాష్ట్రంలో 15 రోజుల పాటు ఘనంగా నిర్వహించారని, అదేవిధంగా తెలంగాణ సమైక్యతా స్ఫూర్తిని అందరికీ చాటిచెప్పాలని ఈ నెల 16 నుంచి 18తేదీ వరకు మూడు రోజుల పాటు తెలంగాణా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నారన్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన జూన్ 2, 2014 నుంచి సీఎం కేసీఆర్ వినూత్నంగా పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు రచించి అమలు పరుస్తూ రాష్ట్రాన్ని దేశంలో అన్ని రంగాల్లో ముందుచుతున్నారని అన్నారు. రైతుల సంక్షేమాన్ని కాంక్షించి రైతు బంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్ వంటి పథకాలను అమలు చేయడమే గాక రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటలకు ఆకర్షణీయమైన మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తూ ఆదుకుంటున్నారని, అదేవిధంగా సామాజిక భద్రతలో భాగంగా ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్, గొర్రెల పంపిణీ, మత్స్యకారుల సంక్షేమానికి వివిధ కార్యక్రమాలు అమలు పరుస్తూ ఆర్థికంగా బలోపేతం చేస్తున్నారని తెలిపారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలల్లో భాగంగా శనివారం మెదక్ కలెక్టరేట్లో నిర్వహించిన సాసృ్కతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. మెదక్ పట్టణంలోని ఆయా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారికి మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, జడ్పీ చైర్పర్సన్ ర్యాకల హేమలతా శేఖర్గౌడ్, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, కలెక్టర్ హరీశ్, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, రమేశ్, అదనపు ఎస్పీ బాలస్వామి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బాలస్వామి, అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, రమేశ్, జడ్పీ వైస్ చైర్ పర్సన్ లావణ్యరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, డీఆర్డీవో శ్రీనివాస్, డీపీవో తరుణ్ కుమార్, ఆర్డీవో సాయిరాం, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి జెమ్లా నాయక్, డీఈవో రమేశ్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.