మెదక్ మున్సిపాలిటీ, ఫిబ్రవరి 10 : తెలంగాణ సమగ్రశిక్షా అభియాన్ ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీ నుంచి ‘రీడ్'(చదువు, ఆనందించు, అభివృద్ధి చెందు) కార్యక్రమాన్ని జిల్లాలో విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. ఇందుకోసం జిల్లా విద్యాశాఖ కార్యాచరణ ప్రణాళికను ముందుగానే సిద్ధం చేసింది. వంద రోజుల పాటు ఒకటి నుంచి 9వ తరగతుల వరకు ఈ కార్యక్రమం అమలు చేస్తున్నారు. జిల్లాలో 1060 పాఠశాలల్లో 1,06,902 మంది విద్యార్థుల్లో పఠన సామర్థ్యం మెరుగుపర్చడానికి ప్రణాళికతో చర్యలు చేపడుతున్నారు. విద్యార్థుల్లో స్వతంత్రంగా పుస్తకాలు చదివే అలవాటు పెంపొందించడానికి, వారిలో సృజనాత్మకతను అభివృద్ధి చేయడానికి, విమర్శనాత్మక ఆలోచనలు కలిగించడానికి భాషా నైపుణ్యం పెంచడానికి ఈ ‘రీడ్’ కార్యక్రమం ఎంతో ఉపయోగపడనుంది. రెండేండ్లుగా కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో పాఠశాల విద్యార్థులు పుస్తక పఠనానికి దూరమయ్యారు. ఎంతో మంది చిన్నారులు, చిన్న తరగతుల విద్యార్థులు అక్షరాలను సైతం మర్చిపోయారు. ఈ నేపథ్యంలోనే ప్రభు త్వం ‘రీడ్’ అనే విధానాన్ని ప్రతి పాఠశాలల్లో అమలు తీసుకొచ్చింది. కేంద్రప్రభుత్వ మార్గదర్శకాలతో వంద రోజులు ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయనున్నారు.
అమలు ఇలా..
‘రీడ్’ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు పుస్తకాలు చదవడానికి ప్రత్యేకంగా ఓ పీరియడ్ను కేటాయిస్తారు. పాఠశాలల్లోని పుస్తకాలన్నీ వర్గీకరించి తరగతుల వారీగా ప్రదర్శిస్తారు. తరగతుల వారీగా విద్యార్థులతో కమిటీలు ఏర్పాటు చేసి గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకుంటారు. ఈ కార్యక్రమంలో ఈ నెల 14 నుంచి 21 వరకు గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించి అందులో విద్యార్థులు చురుగ్గా పాల్గొనేలా చూస్తారు. వారంలో సోమ, మంగళవారాలు తెలుగు, బుధ, గురువారాల్లో ఆంగ్లం, శుక్ర, శనివారాల్లో ఉర్దూ లేదా మరో పుస్తక పఠనం చేయించనున్నారు. కార్యక్రమ నిర్వహణకు పాఠశాల విద్యాకమిటీ సభ్యులు, పోషకులు, విద్యావేత్తలు, ఎన్జీవోల భాగస్వామ్యం తీసుకొని విద్యార్థులు ఇంటి వద్ద చదవడానికి ప్రోత్సహించాలి. ఒకటో తరగతి నుంచి 2వ తరగతి వరకు గ్రూపు-1 గాను, 3 నుంచి 5వ తరగతి వరకు గ్రూపు-2గాను, 6 నుంచి 9వ తరగతి వరకు గ్రూపు-3గా పరిగణించి ఈ రీడ్ కార్యక్రమాన్ని అమలు చేస్తారు.
జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో..
జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, ఆదర్శ పాఠశాలలు, కేజీబీవీలతో పాటు అన్ని యాజమాన్యాల పాఠశాలలు 1060 వరకు ఉన్నాయి. వీటిల్లో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు మొత్తం 1,06,902 మంది విద్యనభ్యసిస్తున్నారు. విద్యార్థుల్లో రీడ్ కార్యక్రమంలో ద్వారా పఠన సామర్థ్యాన్ని వంద రోజుల్లో పెంపొందించనున్నారు.
జిల్లాలో పకడ్బందీగా అమలు
జిల్లాలో ‘రీడ్’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ఉపాధ్యాయులను సంసిద్ధం చేశాం. ఈ కార్యక్రమం గురించి ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అవగాహన కల్పించాం. వంద రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అన్ని చర్యలు తీసుకుంటు న్నాం. విద్యార్థులు అన్ని సబ్టెక్టుల్లో పఠనాశక్తి పెంచేందురు విశేషంగా కృషి చేస్తాం.
-రమేశ్కుమార్, డీఈవో మెదక్