నర్సాపూర్, జూలై 5 : ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలనే సదుద్ధేశంతో తెలంగాణ సర్కార్ ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేసి అన్ని రకాల వైద్య సేవలు అందేలా తీర్చుదిద్దుతుంది. ప్రథమ చికిత్సను మొదలుకొని శస్త్ర చికిత్స వరకు ప్రతి సేవను అందిస్తూ ప్రజల మన్ననలను పొందుతున్నది. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం లో 100పడకల ప్రభుత్వ ఏరియా దవాఖాన రోగులకు మెరుగైన చికిత్సలు అందిస్తూ శభాష్ అనిపిస్తున్నది. ఒకప్పుడు సర్కార్ దవాఖాన అంటేనే జంకే జనాలు నేడు వైద్యం కోసం అక్కడికి కడుతున్నారు. ప్రైవేట్కు దీటుగా అత్యాధునిక పరికరాలతో అన్ని రోగాలకు వైద్యం అందిస్తున్నారు. నర్సాపూర్ ఏరియా దవాఖానలో రోజుకి సుమారు 600 మంది ఔట్ పెషేంట్స్, 90మంది ఇన్పెషేంట్స్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. నెలకు 140 డెలివరీలు చేస్తున్నా రు. నెలకు 90నుంచి 100 మందికి సర్జరీలు చేస్తున్నారు. వీటితో పాటు నెలకు సుమారు 300మందికి ఎక్స్రేలు, 200 మందికి ఈసీజీలు, 3000 ల్యాబ్ టెస్ట్లు చేస్తున్నారు. దవాఖానలో 15మంది డాక్టర్లు, 20మంది నర్సులు, ఇద్దరు ల్యాబ్ టెక్నీషయన్స్ విధులు నిర్వర్తిస్తున్నారు.
ఆహ్లాదకరమైన వాతావరణం
మెరుగైన వైద్య సేవలతో పాటు దవాఖానకు వచ్చే రోగుల బంధువులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేలా దవాఖాన సిబ్బంది ఆవరణలో హెర్బల్ పార్కును ఏర్పాటు చేశారు. ఈ పార్కులో మామూలు మొక్కలతో పాటు హెర్బల్ మొక్కలు నాటడం విశేషం. వాటిలో తులసి, కలబంద, నిమ్మ, మందార, తమలపాకు, రావిచెట్టు, మర్రిచెట్టు, ఉసిరి తదితర మొక్కలను నాటారు. అలాగే రోగుల బంధువులు సేద తీరడానికి పార్కులో బెంచీలను ఏర్పాటు చేశారు.
అత్యాధునిక పరికరాలు
దవాఖానలో అత్యాధునిక పరికరాలతో రోగులకు మెరుగైన చికిత్సను అందిస్తున్నారు. ఈ దవాఖానలో ఎక్స్రే, ఈసీజీ, ఆపరేషన్ థియేటర్, ఆక్సిజన్ సిలిండర్లు, ఫొటోథెరపీ, బేబీ వార్మర్ తదితర సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేటు దవాఖానలు, ల్యాబ్లను ప్రజలు ఆశ్రయించకుండా సకల వసతు లు ఇందులోనే ఉన్నాయి.
ప్రభుత్వ దవాఖానలోనే మెరుగైన వైద్యం
ప్రభుత్వ దవాఖానల్లోనే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నా యి. ప్రభుత్వ దవాఖానల్లోనే ప్రసవాలు ఎక్కువగా జరుగుతున్నాయి. తల్లీబిడ్డల క్షేమం కోసం వైద్య సిబ్బంది నిరంతరం పాటుపడుతారు. ప్రభుత్వ దవాఖానలో ప్రసవిస్తే ప్రభుత్వం నగదు రూపంలో డబ్బులను కూడా అందిస్తుంది. అన్ని రకాల వ్యాక్సిన్లు ఈ దవాఖానలో ఇస్తారు.
– మిర్జా నజీమ్ బేగ్, సూపరింటెండెంట్
మంచిగా చూస్తుర్రు
ఇక్కడ మంచిగా చూస్తుర్రు. డాక్టర్లు మంచిగా చెకప్ చేసి మందులు, సూదు లు ఇస్తున్నరు. ఒకప్పుడు సర్కార్ దవాఖానకు రావాలంటే భయమేసేది. ఇప్పుడు ప్రైవేట్ల కంటే మంచిగా అనిపిస్తున్నది. డాక్టర్లు ఎప్పటికప్పుడు వచ్చి అర్సుకపోతున్నారు. టైమ్కు గోలీలు అందిస్తున్నారు.
– నర్సింహులు, స్థానికుడు