సమైక్య రాష్ట్రంలో సమస్యలతో సతమతమైన సదాశివపేట బల్దియాలో స్వరాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతుండడంతో పట్టణం కొత్తరూపును సంతరించుకుంటున్నది. బల్దియాలో ఇంటింటికీ నీరందించడమే లక్ష్యంగా రూ. 45 కోట్లతో మిషన్ భగీరథ పనులు చేపట్టారు. రూ. 3 కోట్లతో ప్రధాన రహదారిపై సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడంతో రాత్రిళ్లు జిగేలుమంటున్నది. రూ. 3.75 కోట్లతో మూడు వైకుంఠధామాల ఏర్పాటుతో అంత్యక్రియలకు వెతలు తీరాయి. రూ. 5.50 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రూ. 110 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. క్రీడాప్రాంగణాలు, పట్టణ ప్రకృతి వనాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, చిల్డ్రన్ పార్కు, వీధి దుకాణాలు, ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేశారు. మౌలిక సదుపాయాలు కల్పిస్తుండడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సదాశివపేట, సెప్టెంబర్ 7 : స్వరాష్ట్రంలో సదాశివపేట మున్సిపాలిటీ అభివృద్ధి బాట పడుతున్నది. గత ప్రభుత్వాల హయాంలో ప్రగతికి నోచుకోని ఈ పట్టణం.. నేడు కొత్తరూపును సంతరించుకుంటున్నది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి హరీశ్రావు, ఎంపీ కొత్త కొత్తప్రభాకర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సహకారంతో సదాశివపేట బల్దియా అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. టీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 45 కోట్లతో పట్టణంలో మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తున్నది. రూ. 3 కోట్లతో పట్టణంలోని ప్రధాన రహదారిపై సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేయడంతో రాత్రిళ్లు వెలుగులు విరజిమ్ముతున్నాయి. రూ. 3.75 కోట్లతో మూడు వైకుంఠధామాలు ఏర్పాటు చేసింది. రూ. 5.50 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్వెజ్ మార్కెట్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. పట్టణంలో రూ. 110 కోట్లతో పట్టణంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.
రూ. 45కోట్లతో ఇంటింటికీ తాగునీరు
ప్రభుత్వం సదాశివపేట బల్దియాలో ఇంటింటికీ తాగునీరు అందించేందుకు మిషన్ భగీరథ పథకం కింద రూ.45 కోట్లు వెచ్చించింది. పట్టణంలోని 26 వార్డుల్లో ఇంటింటికీ పైప్లైన్ పనులు పూర్తి చేసింది. ఇప్పటికే 8 ట్యాంకుల ద్వారా మిషన్ భగీరథ నీటిని వదిలారు. మరో 3 ట్యాంకులను మంత్రి హరీశ్రావు ఇటీవలే ప్రారంభించి తాగునీరును విడుదల చేశారు.
రూ. 3.75 కోట్లతో వైకుంఠధామాలు
ప్రభుత్వం సదాశివపేటలో మూడు వైకుంఠధామాలను ఏర్పాటు చేసింది. తెలంగాణ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద రూ. 3.75 కోట్లతో జాతీయ రహదారి పక్కన హిందు, ముస్ల్లిం, క్రిస్టియన్ల కోసం మూడు వైకుంఠధామాలను ఏర్పాటు చేసింది.
శరవేగంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం
సదాశివపేట పట్టణంలోని మార్కెట్యార్డులో రూ. 5.50 కోట్లతో వెజ్, నాన్వెజ్ సమీకృత మార్కెట్ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. మార్కెట్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. కలెక్టర్ శరత్ నిర్మాణ పనులను పరిశీలించి వేగవంతం చేయాలని ఆదేశించారు. నవంబర్లో ఇది అందుబాటులో రానున్నది. మార్కెట్ అందుబాటులోకి వస్తే ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగనున్నాయి. రోడ్డుపై కూరగాయలు పెట్టి అమ్మే పరిస్థితి ఉండదు.
రూ.2 కోట్లతో చిల్డ్రన్ పార్కు
తెలంగాణ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద మంజూరైన రూ. 2కోట్ల నిధులతో చిల్డ్రన్ పార్కును ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం వేళ చిన్నారులు ఆడుకునేందుకు వీలుగా ఈ పార్కులో అన్ని వసతులు కల్పిస్తున్నారు. క్రీడా సామగ్రి ఏర్పాట్లు చేస్తున్నారు.
26 క్రీడా ప్రాంగణాలు
సదాశివపేట బల్దియాలోని 26 వార్డుల్లో రూ. 38.50 లక్షలతో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే 12 పూర్తయ్యాయి. మిగతా వాటి పనులు కొనసాగుతున్నాయి. అలాగే పట్టణంలో 9 ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేశారు.
పట్టణ ప్రకృతి వనాలు
సదాశివపేట పట్టణంలోని 26 వార్డుల్లో పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. పట్టణ ప్రకృతి వనాల్లో మొక్కలను పెంచుతూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హరితహారంలో భాగంగా ఇంటింటికీ మొక్కలను పంపిణీ చేశారు.
రూ. 25 కోట్లతో మౌలిక సదుపాయాలు
సంగారెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ సదాశివపేట మున్సిపాలిటీకి రూ.25 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో పట్టణంలోని 26 వార్డుల్లో సమస్యలు పరిష్కరిస్తున్నారు. మురుగు కాల్వలు, రోడ్లు, విద్యుత్, తాగునీరు తదితర సౌకర్యాలు కల్పిస్తున్నారు.
బల్దియా అభివృద్ధే లక్ష్యం..
సదాశివపేట మున్సిపాలిటీని అభివృద్ధి చేయడమే లక్ష్యం. గత ప్రభుత్వాలు పట్టణ అభివృద్ధిని పట్టించుకోలేదు. పార్టీలకతీతంగా ఇప్పుడు అభివృద్ధి చేస్తున్నాం. సీఎం కేసీఆర్ హయాంలోనే భారీగా నిధులు రావడంతో పట్టణం అభివృద్ధి చెందుతున్నది. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారుల భాగస్వామ్యంతో అభివృద్ధిలో పట్టణాన్ని ముందు వరుసలో ఉంచుతాం.
– పిల్లోడి జయమ్మ, మున్సిపల్ చైర్ పర్సన్ సదాశివపేట
ఆదర్శంగా తీర్చిదిద్దుతాం..
సదాశివపేట బల్దియాను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. గత ప్రభుత్వాల హయాంలో పట్టణం అభివృద్ధికి నోచుకోలేదు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ హయాంలో అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. పట్టణంలో రూ. 45 కోట్లతో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా ద్వారా తాగునీరు అందిస్తాం. రానున్న రోజుల్లో పట్టణంలోని అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, మురుగు కాల్వలు నిర్మిస్తాం. పట్టణ అభివృద్ధికి సహకరిస్తున్న మంత్రి హరీశ్రావు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్కు కృతజతలు.
-చింతా గోపాల్, మున్సిపల్ వైస్ చైర్మన్ సదాశివపేట
రూ. 5కోట్లతో రోడ్లు, డ్రైనేజీలు
సదాశివపేట బల్దియాలో 26 వార్డులు ఉన్నాయి. పట్టణ ప్రగతి నిధులు, మున్సిపల్ జనరల్ ఫండ్ కింద రూ. 5 కోట్లతో వార్డుల్లో రోడ్లు, మురుగు కాల్వలు నిర్మిస్తున్నారు. వార్డుల అవసరాల దృష్ట్యా రోడ్లను వేస్తున్నారు. అలాగే బస్తీల్లో మురుగు కాల్వలు నిర్మిస్తున్నారు. త్వరలోనే 26 వార్డుల్లో ఈ నిర్మాణం జరుగనున్నది.
రూ. 3కోట్లతో సెంట్రల్ లైటింగ్
స్థానిక శంభులింగేశ్వర మందిరం నుంచి అయ్యప్ప మందిరం వరకు జాతీయ రహదారిపై రూ.3 కోట్లతో రోడ్డు డివైడింగ్, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు. తెలంగాణ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద ఈ నిధులు మంజూరయ్యాయి. గతంలోనే పనులు పూర్తయ్యాయి. అలాగే పోలీస్ స్టేషన్ నుంచి సాయిబాబా మందిరం వరకు వికారాబాద్ రోడ్డులో రూ. 50లక్షలతో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు.
రూ. 9.50 లక్షతో వీధి దుకాణాలు
స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఎదుట రూ. 9.50 లక్షలతో వీధి వ్యాపారుల కోసం వీధి వ్యాపారుల దుకాణ సముదాయాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం 25 వీధి దుకాణ సముదాయాలను నిర్మించారు. త్వరలోనే వీటిని కేటాయించనుండడంతో వీధి వ్యాపారుల ఇబ్బందులు తొలగనున్నాయి.
రూ. 6.50 కోట్లతో సిద్ధ్దాపూర్ రోడ్డు
తెలంగాణ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద మంజూరైన రూ. 6.5 కోట్లతో సిద్ధాపూర్ రోడ్డు నిర్మించనున్నారు. మంత్రి హరీశ్రావు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఇటీవల ఈ రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు.