చిన్నకోడూరు, జూలై 1 : ‘రెండు వరుసల రింగు రోడ్డు సిద్దిపేటకు ఒక వరం.. రేపు సిద్దిపేట మెడలో హారంలాగా ఉంటది.. ఒక తల్లి మెడలో హారం ఎట్లుంటదో సిద్దిపేటకు హారం లాంటిది రింగురోడ్డు.. సిద్దిపేటకు అందాన్ని ఇస్తుం ది.. సిద్దిపేట ప్రతిష్ట పెంచుతుంది.. సిద్దిపేట ప్రజలకు నలుమూలల్లో సౌకర్యాన్ని తెస్తుంది.. ఈ రోడ్డుతో ఈ ప్రాంతంలో భూముల ధరలు పెరగడంతో పాటు పరిశ్రమలు రావడానికి ఎంతగానో దోహదపడుతుంది’.. అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. శుక్రవారం చిన్నకోడూరులో రూ.160 కోట్లతో 88 కిలో మీటర్ల ఆర్అండ్బీ రింగు రోడ్డు పనులకు జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచందుతో కలిసి మంత్రి హరీశ్రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు విలేకరులతో మాట్లాడారు. 20ఏండ్ల క్రితం సిద్దిపేట నియోజకవర్గంలోని బుస్సాపూర్ నుంచి తిమ్మాయిపల్లి వరకు సింగిల్ రింగు రోడ్డును ఆనాడే కేసీఆర్ వేయించారని, సీఎం కేసీఆర్ ముందు చూపుతోనే ఇది సాధ్యమైందని మంత్రి హరీశ్రావు వెల్లడించారు.
రెండు వరుసల రింగు రోడ్డు మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు సిద్దిపేట ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. రాజీవ్ రహదారి టూ రాజీవ్ రహదారిని అనుసంధానం చేసుకుంటూ సిద్దిపేట చుట్టూ వలయంగా రింగు రోడ్డు ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఏడు మండలాలైన కొండపాక, తొగుట, దుబ్బాక, సిద్దిపేట రూరల్, నారాయణరావుపేట, చిన్నకోడూరు, నంగునూరు పరిధి మీదుగా 88 కి.మీ విస్తరణ రింగు రోడ్డు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ రింగు రోడ్డులో 12 గ్రామాలు బుస్సాపూర్, పుల్లూరు, మల్యాల, గంగాపూర్, మాచాపూర్, చిన్నకోడూరు, రామునిపట్ల, గోనెపల్లి, ఒబులాపూర్, పాలమాకుల, వెంకటాపూర్, బందారం గ్రామాల మీదుగా ఈ రెండు వరుసల రహదారి నిర్మించనున్నట్లు తెలిపారు.
మెస్సేజ్ చూసి మురుస్తున్న అన్నదాత
ఉదయం లేవగానే రైతుబంధు డబ్బుల ఫోన్లో మెస్సేజ్లు చూసి రైతులు మురిసిపోతున్నారని మంత్రి హరీశ్రావు చెప్పారు. ఎంత కష్టం ఉన్నా.. సీఎం కేసీఆర్ రైతుల కోసం రైతుబంధు డబ్బులు వేస్తున్నారన్నారు.