జహీరాబాద్, జూన్3: ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని ఇండ్లు నిర్మించుకున్న పేదలకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నది. పేదలు కట్టుకున్న ఇండ్లను క్రమబద్ధీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 58, 59 జీవోలు జారీచేసింది. దీంతో ఇండ్లను రెగ్యులరైజేషన్ చేసేందుకు అధికారులు సర్వే చేస్తున్నారు. లబ్ధిదారుల దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు జహీరాబాద్ డివిజన్లో 7 టీంలు ఏర్పాటుచేశారు. ప్రభుత్వ జీవో 58 ప్రకారం 125 గజాల స్థలంలో ఇండ్లు నిర్మించుకున్న వారిని గుర్తించేందుకు సర్వే చేస్తున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. డివిజన్లో ఇండ్ల క్రమబద్ధీకరణ కోసం 2200 దరఖాస్తులు వచ్చాయి.
జహీరాబాద్, మొగుడంపల్లి, రాయికోడ్, న్యాల్కల్, ఝరాసంగం, కోహీర్ మండలాల్లో ఇండ్ల క్రమబద్ధీకరణ కోసం 2200 మంది పేదలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. ఇండ్లను క్రమబద్ధీకరించేందుకు కలెక్టర్ 7 టీంలు ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో ఒక జిల్లాస్థాయి అధికారి, రెవెన్యూ అధికారి, సర్వేయర్తో పాటు పలువురిని నియమించారు. ప్రభుత్వ జీవోల ప్రకారం ఇండ్లు క్రమబద్ధీకరించి యాజమాన్య హక్కులు కల్పించే ఆవకాశం ఉన్నదని రెవెన్యూ అధికారులు తెలిపారు.
డివిజన్లో అవినీతికి ఆస్కారం లేకుండా ఆర్డీవో రమేశ్బాబు పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వ స్థలాల్లో ని ర్మించుకున్న ఇండ్లను రెగ్యులర్ చేసే క్రమంలో అధికారులు ఇండ్ల వద్దకెళ్లి విచారించి, యాప్లో వివరాలు నమోదు చేస్తున్నారు. జిల్లాస్థాయి అధికారితో పాటు డిప్యూటీ తహసీల్దార్ పర్యవేక్షణలో సర్వేయర్లు, ఆర్ఐ లు, వీఆర్ఏలు పని చేస్తున్నారు. జిల్లా స్థాయి అధికారులకు మొబైల్ యాప్ లాగిన్, పాస్వర్డ్ ఇచ్చారు. దరఖాస్తు నంబర్ను యాప్లో నమోదు చేసిన వెంటనే వివరాలు ప్రత్యక్షమవుతున్నాయి. ఇంటి యజమాని వద్ద ఉన్న పత్రాలు పరిశీలించి, జియో కో ఆర్డినేటర్ల సహకారంతో ప్లాట్ విస్తీర్ణం కొలిచి పక్కగా యాప్లో నమోదు చేస్తున్నారు. ప్రభుత్వ వివరాలు పరిశీలించి యాజమాన్య హక్కులు కల్పిస్తారని అధికారులు తెలిపారు.
ప్రభుత్వ స్థలంలో ఇండ్లు నిర్మించుకున్న వారికి హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం జీవోలు జారీచేసింది. ఇండ్లు నిర్మించుకున్న వా రి పత్రాలు పరిశీలించి, కొలతలు సేకరించి యాప్లో నమోదు చేస్తున్నారు. ఎలాంటి అక్రమాలు లేకుండా జిల్లాస్థాయి అధికారులను కలెక్టర్ నియమించి, క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. డివిజన్లో 2200 దరఖాస్తులు రావడంతో 7 బృందాలు పర్యవేక్షిస్తున్నాయి. ప్రతి దరఖాస్తుదారుడి ఇంటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు.
– రమేశ్బాబు, ఆర్డీవో, జహీరాబాద్