సంగారెడ్డి కలెక్టరేట్, ఆగస్టు 11: స్వాతంత్య్ర వజ్రోత్సవాలను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించుకుంటున్నందుకు సంతోషంగా ఉన్నదని సంగారెడ్డి కలెక్టర్ శరత్ పేర్కొన్నారు. వజ్రోత్సవాల స్ఫూర్తి అందరిలో కలుగాలని ఆకాంక్షించారు. గురువారం జిల్లా కేంద్రంలో ఫ్రీడమ్ రన్ కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం జ్యోతి వెలిగించి రన్ను ప్రారంభించారు. కలెక్టర్, అదనపు కలెక్టర్లు రాజర్ష్షి షా, వీరారెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగులు, యువత, విద్యార్థులతో ఫ్రీడమ్ రన్ నిర్వహించారు.
స్థానిక గోకుల్ దవాఖాన నుంచి కొత్త బస్టాండు మీదుగా పాత బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు రన్ కొనసాగింది. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ, కలెక్టర్ శరత్ త్రివర్ణంలోని బెలూన్లను ఆకాశంలోకి వదిలారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లాలో వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. అందుకు రాష్ట్రపతి, ముఖ్యమంత్రికి కలెక్టర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ నెల 13న నిర్వహించే జాతీయ పతాక ర్యాలీకి అందరూ పెద్దఎత్తున తరలి రావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఫ్రీడం రన్లో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొన్నారని, అంతకు రెట్టింపు స్థాయిలో పతాక ర్యాలీలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, యువజన సంఘాల అధ్యక్షుడు డాక్టర్ కూన వేణు, జిల్లా క్రీడలు, యువజన శాఖ అధికారులు, ఆయా శాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగులు, యువత, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 11: వజ్రోత్సవాలను పండు గ వాతావరణంలో జరుపుకొంటున్నామని మెదక్ కలెక్టర్ హరీశ్ అన్నారు. గురువారం ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ప్రారంభమైన ఫ్రీడమ్ రన్ను కలెక్టర్ జెండా ఊపి ప్రా రంభించారు. ఈ ర్యాలీ బస్ డిపో, పోస్టాఫీస్, చిల్డ్రన్ పార్కు మీదుగా రాందాస్ చౌరస్తాకు సాగింది. రాందాస్ చౌరస్తా లో ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ 75వ స్వా తంత్య్ర వజ్రోత్సవాలను తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా జరుపుకొంటున్నమన్నారు. సీఎం కేసీఆర్ సూచన మేరకు ఈ నెల 8నుంచి 22వరకు పదిహేను రోజుల పాటు రోజుకో కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. పాఠశాలల విద్యార్థుల కోసం థియెటర్లలో ప్రదర్శిస్తున్న గాంధీ చిత్రాన్ని తప్పకుండా వీక్షించాలన్నారు. శనివారం నిర్వహించనున్న ఫ్రీడమ్ ర్యాలీలో యువకులు, పట్టణ ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ నెల 16న జిల్లా వ్యాప్తంగా ఏకకాలంలో నిర్వహించే జాతీయ గీతాలాపనకు జిల్లా కేంద్రంలోని ఆయా ప్రాంతాల్లో సైరన్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఉదయం 11:30 గంటలకు సైరన్స్ మోగగానే ప్రతి ఒక్కరూ ఎక్కడికక్కడే నిల్చుని నిశబ్ధం పాటిస్తూ జాతీయ జెండాను గౌరవించేలా జాతీయ గీతాలాపన చేయాలని కలెక్టర్ సూచించారు. ఫ్రీడమ్ రన్ ర్యాలీలో పాఠశాలల విద్యార్థులు 150మీటర్ల జాతీయ జెండాను ప్రదర్శించారు. స్వాతంత్య్ర పోరాట యోధుల చిత్రపటాలను ప్రదర్శించారు.
కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు రమేశ్, ప్రతిమాసింగ్, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్రావు, డీపీవో తరుణ్కుమార్, డీఈవో రమేశ్కుమార్, జిల్లా యువజన క్రీడల అధికారి నాగరాజు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ రజాక్, జిల్లా వ్యవసాయాధికారి పరశురాంనాయక్, మత్స్యశాఖాధికారి సురేఖ, డీఎంహెచ్వో వెంకటేశ్వర్రావు, డీఎస్పీ సైదులు, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గణపతి విద్యార్థులు పాల్గొన్నారు.