దుబ్బాక, ఆగస్టు 5: దుబ్బాక బాలాజీ దేవాలయ నిర్మాణం సీఎం కేసీఆర్, చినజీయర్ స్వామి, ఆగమ పండితుల పర్యవేక్షణలో జరిగింది. ఆలయ నిర్మాణం పూర్తిగా టీటీడీ ప్లానింగ్ వాస్తుతో రాష్ట్ర దేవాదాయ ముఖ్య స్తపతి వల్లీ నాయగమ్ ఆధ్వర్యంలో నిర్మాణ ప్రణాళిక రూపొందించారు. సీఎం కేసీఆర్ సలహాల మేరకు ఆలయ పనులు ట్రస్టు సభ్యులు పూర్తిచేశారు.
ఆలయ నిర్మాణానికి మొత్తం రూ.12 కోట్లు వెచ్చించారు. ఇందులో సీఎం కేసీఆర్ దేవాదాయ శాఖ ద్వారా రూ.5.50 (ఎస్డీఎఫ్) నిధులు మంజూరు చేశారు. ఇందులో స్పెషల్ డెవలఫ్మెంట్ (దేవాదాయ శాఖ) నుంచి రూ.3 కోట్లు, కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్) నుంచి రూ.2.50 కోట్లు కేటాయించారు. ప్రజాప్రతినిధులతో పాటు స్థానికులు, వ్యాపారులు, భక్తులు దేవాలయానికి తమవంతు సహకారం అందించారు. ఈనెల 6 నుంచి 11 వరకు బాలాజీ దేవాలయ ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు దేవాలయ ట్రస్టు సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.
బాలాజీ దేవాలయ ప్రథమ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల వేడుకలకు సీఎం కేసీఆర్ సతీమణి శోభ, త్రిదండి చినజీయర్స్వామి, మంత్రులు హరీశ్రావు, ఇంద్రకరణ్రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీలు కవిత, ఫారూఖ్ హుస్సేన్, యాదవ్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ తదితర ప్రముఖులు హాజరుకానున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
దుబ్బాక బాలాజీ దేవాలయంలో ప్రతిష్ఠించిన లక్ష్మీసమేత వేంకటేశ్వర్ల్లు విగ్రహాలను తమిళనాడులోని మహాబలిపురంలో తయారు చేశారు. ఉత్సవ విగ్రహాలను కుంభకోణంలో తయారు చేయించారు. ఆలయానికి 60 అడగుల ఎత్తైన రాజగోపురం, మొదటి అంతస్తులో బాలాజీ విగ్రహం, కుడి వైపున పద్మావతి అమ్మవారు, ఎడుమవైపున గోదాదేవి ఆలయాలు నిర్మించారు. ఆలయంలో విష్వక్సేనుడు, పంచముఖ ఆంజనేయ స్వామి, గరుత్మంతుడు, ఉపాలయాలు నిర్మించారు. శ్రీమన్నారాయనుడి దశావతర విగ్రహ రూపాలను కండ్లకు కట్టేలా ఏర్పాటు చేయించారు.
ఆలయం కింది భాగంలో ధ్యాన మండపం, ఆలయం వెనుక ప్రవచనాలకు కళావేదిక, ఎడమ వైపున నక్షత్ర వనం, రాశీవనం, సరస్వతీ వనం, కుడివైపున సేద తీరడానికి ఉద్యానవనం, పిల్లల ఆడుకునేందుకు కృష్ణలీలా వనం పేరుతో ప్రత్యేక పార్కులు ఏర్పాటు చేశారు. స్వామి దర్శనానికి వచ్చే వృద్ధులు, దివ్యాంగుల కోసం లిప్టు సౌకర్యం కల్పించారు.
ఆలయం వద్ద 500 మంది భక్తులకు భోజన వసతి కల్పించే భోజనశాలను నిర్మించారు. ఆలయం ముందు ప్రతిష్ఠించిన ధ్వజస్తంభాన్ని నల్లమల అడవుల నుంచి తెప్పించారు. ఆలయ నిర్మాణం ప్రకృతి రమణీయంగా తీర్చిదిద్దబడింది. ప్రధాన గోపురం, వివిధ దేవతామూర్తుల ఆలయాలు, ప్రధానాలయం చుట్టూ గార్డెన్, చిన్న పిల్లల పార్కు, కార్యాలయ నిర్వహణ గది, అన్నసత్రం, నీటిగుండం, భజన గదులను నిర్మించారు. ఆలయంలో కల్యాణ మండపంతో పాటు విశాలమైన అర్చకుల గదులు, కార్మికుల గదులు నిర్మించారు.
దుబ్బాక బాలాజీ దేవాలయ ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. భక్తులకు అన్ని వసతులు కల్పించాం. బాలాజీ దేవాలయం తెలంగాణ రాష్ర్టానికే తలమానికంగా మారింది. ఆలయ నిర్మాణం పూర్తిగా సీఎం కేసీఆర్ పర్యవేక్షణలో, చినజీయర్ స్వామి సూచనలతో నిర్మించాం. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి సహకారం మరిచిపోలేనిది. ఏడాదికాలంలోనే బాలాజీ దేవాలయం తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందడం సంతోషంగా ఉంది.
– వడ్లకొండ శ్రీధర్, బాలాజీ దేవాలయ ట్రస్టు చైర్మన్
దుబ్బాకలో బాలాజీ దేవాలయ నిర్మించడం ఆనందంగా ఉంది. దేవాలయ నిర్మాణంలో సీఎం కేసీఆర్తో కలిసి పాలు పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. ఆలయ బ్రహ్మోత్సవాలకు మంత్రులు, ప్రముఖులతో పాటు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొననున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. వేడుకలకు సీఎం కేసీఆర్ సతీమణి శోభ, కూతురు కవితతో పాటు త్రిదండి చినజీయర్ స్వామి హాజరు కానుండడం ఆనందదాయకం.
– రొట్టె రాజమౌళి, కేసీఆర్ మిత్రుడు, దేవాలయ ట్రస్టు శాశ్వత సభ్యులు