మెదక్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కృషిచేయాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. హవేళీఘనపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డీఈవో రాధాకిషన్, పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులను టీవీ, ఫోన్లు, సోషల్మీడియాకు దూరంగా ఉంచాలని, చదువుతున్నారో లేదో గమనించాలన్నారు.
ప్రత్యేక తరగతులు, గ్రాండ్ టెస్ట్లను సద్వినియోగ పరుచుకోవాలని, పిల్లలు పాఠశాలకు గైర్హాజరు కాకుండా చూడాలని, చదువు తప్ప ఇతర పనులు చెప్పొద్దని తల్లిదండ్రులకు సూచించారు. అనంతరం హవేళీఘనపూర్లోని ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. కార్యక్రమంలో హవేళీఘనపూర్ తహసీల్దార్ నారాయణ, కరుణాకర్, నీలకంఠం, సుదర్శన మూర్తి అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లదండ్రులు పాల్గొన్నారు.
ఈ నెల 28 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియేట్ వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో ఇంటర్ పరీక్షల నిర్వహణపై అదనపు కలెక్టర్ రమేశ్, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ పరీక్షలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా అనుబంధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరుగనున్న పరీక్షలకు జిల్లాలో 13,173 మంది విద్యార్థులు హాజరవుతున్నారని, మొదటి సంవత్సరంలో 6,507 మంది, రెండో సంవత్సరంలో 6666 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. 30 కేంద్రాలు ఎంపిక చేసి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని, 30 మంది చీఫ్ సూపరింటెండెంట్లు. 30 శాఖాధికారులతో పాటు ఒక ఫ్లయింగ్ స్వాడ్ టీమ్, 4 సిట్టింగ్ స్వాడ్, 5 కస్టడియ్సన్ టీమ్లు, ప్రశ్నాపత్రాల స్టోరేజీకి 14 పాయింట్లు ఏర్పాటు చేశామని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించాలని, పరిసరాల్లో జిరాక్స్ సెంటర్లు మూసివేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఆర్టీసీ అధికారులు తగినన్ని బస్సులు నడపాలని, ఫస్ట్ ఎయిడ్ కిట్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులతో మెడికల్ పాయింట్ ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, ఫాన్స్, టాయిలెట్స్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని డీఈవో, ఇంటర్మీడియేట్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా ఇంటర్మీడియేట్ అధికారి సత్యనారాయణ, డీఈవో రాధాకిషన్, శశిధర్, అశోక్, పోలీసు, పోస్టల్, ఆర్టీసీ, విద్యుత్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.