‘ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం. ప్రజలకు ఎక్కడా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సాయమందించేందుకు సిద్ధంగా ఉన్నాం.’ అని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను శుక్రవారం కలెక్టర్ ‘నమస్తే తెలంగాణ’కు ఇంటర్వ్యూ ద్వారా వివరించారు. ఘనపూర్, పోచారం, హల్దీవాగు ప్రాజెక్టులు పొంగి పొర్లుతుండడంతో పరీవాహక ప్రాంతాలను అలర్ట్ చేశామన్నారు. కూలిపోయే దశలో ఉన్న పాత ఇండ్లను ఖాళీ చేయిస్తున్నామని, వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య నిర్వహణ చేపడుతున్నామని తెలిపారు. జిల్లా దవాఖానతో పాటు పీహెచ్సీల్లో డాక్టర్లు, సిబ్బంది, మందులు అందుబాటులో ఉంచామన్నారు. అవసరమైతే మరికొన్ని అదనపు గంటలు వైద్య సిబ్బంది విధుల్లో ఉండాలని మంత్రి హరీశ్రావు ఆదేశాలు జారీ చేశారని వివరించారు. జిల్లావాసులకు ఇప్పటి వరకు ఒక్కరికి కూడా డెంగీ నిర్ధారణ కాలేదన్నారు. రాకపోకలకు ఇబ్బందులు రాకుండా రహదారులపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు రాకుండా చూస్తున్నట్లు పేర్కొన్నారు.
నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నదని మెదక్ కలెక్టర్ రాజర్షి షా వివరించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అధికారుల అప్రమత్తపై కలెక్టర్ ‘నమస్తే తెలంగాణ’తో ముచ్చటించారు.
కలెక్టర్ : మెదక్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్ష సూచన నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. మరో రెండు రోజుల పాటు భారీ వర్ష సూచన ఉంది. దీంతో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం. ఘనపూర్, పోచారం, హల్దీవాగు ప్రాజెక్టులు పొంగిపొర్లుతున్నాయి. పరీవాహక ప్రాంతాల్లో అప్రమత్తం చేశాం. ముఖ్యంగా పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్, పీఆర్, ఆర్అండ్బీ శాఖల అధికారులందరినీ అలర్ట్ చేశాం. గ్రామాలు, మున్సిపాలిటీల్లో కూలిపోయే దశలో ఉన్న ఇండ్లలో ఉంటున్న వారిని ఖాళీ చేయిస్తున్నాం. ప్రధానంగా ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా చూస్తున్నాం. గ్రామాల్లో శిథిలావస్థలో ఉన్న ఇండ్లను సర్పంచ్తో పాటు పంచాయతీ కార్యదర్శులు పరిశీలించి నివేదికలు అందజేయాలని ఆదేశించాం.
కలెక్టర్ : మెదక్ జిల్లాలో ఈ సీజన్లో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. ఈ సీజన్లో 3.10 లక్షల ఎకరాల్లో వరి సాగయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే 63,525 ఎకరాల్లో వరి వేశారు. ఈనెల 6వ తేదీ వరకు కేవలం 1500 ఎకరాలు మాత్రమే వేశారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో వ్యవసాయ, ఉద్యానవన శాఖలను అప్రమత్తం చేశాం. రైతులు వరి నాట్లు వేగంగా వేస్తున్నారు. ఘనపూర్ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 0.134 టీఎంసీలు కాగా ఇప్పటికే 12,500 క్యూసెక్కుల నీటితో పొంగుతున్నది. ఆయకట్టు కింద 21,625 ఎకరాల్లో పంటలు పండుతాయి. ప్రాజెక్టు కింద రెండు కెనాళ్లు ఉన్నాయి. ఇందులో మహబూబ్సాగర్ కెనాల్ కింద కొల్చారం, మెదక్, హవేళీఘనపూర్ మండలాల్లోని 18 గ్రామాల్లో 11,425 ఎకరాలు, ఎఫ్ఎన్ కెనాల్ పరిధి పాపన్నపేట మండలంలోని 11 గ్రామాల్లో 10,200 ఎకరాలకు సాగు నీరందుతున్నది. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్పాం సాగుకు జిల్లాలో 5వేల ఎకరాలు టార్గెట్గా ఉంది.
కలెక్టర్ : వానకాలంలో వ్యాధులు ప్రబలకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా ప్రజలు ఇంటిలోని చెత్తాచెదారాన్ని వెంటవెంటనే తొలిగించుకోవాలి. టైర్లు, కొబ్బరిబోండాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. డ్రై డేను తప్పకుండా పాటించాలి. వానకాలంలో వ్యాధులపై వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉంది. జిల్లాలోని అన్ని దవాఖానల్లో మందులు అందుబాటులో ఉంచాం. డాక్టర్లు కూడా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటాం. డెంగీ కేసులు నమోదు కాకుండా చూడాలని వైద్యా ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించాం. గ్రామాలు, మున్సిపాలిటీల్లో డెంగీ కేసులకు సంబంధించి శానిటేషన్, ఫాగింగ్, ఆయిల్బాల్స్ వేయడం లాంటి చర్యలు చేపట్టాం. మంత్రి హరీశ్రావు ఆదేశాల మేరకు పీహెచ్సీల్లో పని చేస్తున్న సిబ్బంది మరికొన్ని గంటలు పనిచేసేలా చూడాలని ఆదేశించాం. గర్భిణులను అమ్మఒడి వాహనంలో దవాఖానలకు తీసుకురావాలని ఆశ, ఏఎన్ఎంలకు సూచించాం.
కలెక్టర్ : జిల్లాలో రవాణా ఇబ్బందులు ఏమీ లేవు. ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించిన రోడ్లపై ఎప్పటికప్పుడు ఆయా శాఖల అధికారులతో రివ్యూ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం. చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో ఎక్కడైనా రహదారులు తెగిపోతే వాటిపై ప్రత్యేకంగా దృష్టి పెడుతాం.
హవేళీఘనపూర్ మండలం వాడి పంచాయతీ దూప్సింగ్ తండాకు వెళ్లే రోడ్డు తెగిపోవడంతో అక్కడ చర్యలు చేపట్టాలని తహసీల్దార్ను ఆదేశించాం.
నమస్తే తెలంగాణ: విద్యుత్ సరఫరా నిర్వహణ..
కలెక్టర్ : జిల్లాలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవు. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు విద్యుత్ పోల్స్, ట్రాన్స్ఫార్మర్లు డ్యామేజ్ కాలేదు. వర్షాల నేపథ్యంలో విద్యుత్ స్తంభాలను ముట్టుకోవద్దు. విద్యుత్ సరఫరాలో ఇబ్బందులుంటే ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉన్నది. విద్యుత్ నియంత్రణలో లోపాలుంటే ఆ శాఖ అధికారులను సంప్రదించాలి.
నమస్తే తెలంగాణ: ఈ వర్షాల నేపథ్యంలో ప్రజలకు మీరిచ్చే సందేశం?
కలెక్టర్ : భారీ వర్ష సూచన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దు. వానలు కురుస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. నీళ్లు వేడి చేసుకుని తాగాలి. పసుపు వేసి నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిది. డ్రై డేను పాటించాలి. మెదక్ కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశాం. 9391942254లో సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఫోన్ చేసి వానల ద్వారా ఇబ్బందులు ఎదురైతే సమాచారం ఇవ్వొచ్చు.