మెదక్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): జిల్లాలోని 76 రైతు వేదికల వద్ద రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అధికారులకు ఆదేశించారు. శుక్రవారం రాష్ట్రావతరణ వేడుకల అనంతరం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఈ నెల 3 నుంచి 5 వరకు నిర్వహించే కార్యక్రమాలపై అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్తో కలిసి అధికారులు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి రైతు వేదిక వద్ద 1000 మంది రైతులు పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు, ఇతర వాహనాల ద్వారా జాగ్రత్తగా తరలించాలన్నారు. సమావేశంలో రైతులకు పంటలపై సంబంధిత అధికారులు అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వం అందించిన రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్తు తదితర అంశాలపై లబ్ధి పొందిన రైతులతో మాట్లాడించాలన్నారు. వ్యవసాయ, ఉద్యాన శాఖలు ప్రచురించిన కరపత్రాలు, గోడ పత్రికలు ఆవిషరించి పంపిణీ చేయాలన్నారు.
జిల్లాలోని పరిశ్రమలు, పెట్రోల్ బంకులు, చౌక ధరల దుకాణాలు, రైస్ మిల్లులు, గోదాములు, మత్స్య సహకార సంఘ భవనాలు ఇలా అన్ని కేంద్రాల్లో దశాబ్ది ఉత్సవాల లోగో, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ నెల 22 వరకు చేపట్టే కార్యక్రామాలకు సంబంధించి ఎమ్మెల్యే ముందస్తు అనుమతితో ఫంక్షన్ హాళ్లు బుక్ చేసి తగిన ఏర్పాట్లకు సిద్ధం చేసుకోవాల్సిందిగా సూచించారు. సమావేశంలో జిల్లా అధికారులు యేసయ్య, వెంకటి శైలేశ్, శ్రీనివాస్, కృష్ణమూర్తి, విజయశేఖర్ రెడ్డి, ఆశాకుమారి, బ్రహ్మాజీ, రజిని, సాయిబాబా, విజయలక్ష్మి, జెంలా నాయక్, ఖాసిం, కరుణ తదితర అధికారులు పాల్గొన్నారు.