మెదక్ మున్సిపాలిటీ, మార్చి 17: జిల్లా సమగ్రాభివృద్ధిలో బాధ్యతగా ప్రతి పారిశ్రామిక సంస్థ తమ వార్షిక లాభాల్లో 2 శాతం సీఎస్ఆర్ నిధులు అందజేయాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా కోరారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, రమేశ్లతో కలిసి పారిశ్రామిక వేత్తలతో మాట్లాడారు. పరిశ్రమల చట్టం ప్రకారం ప్రతి పారిశ్రామిక సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సామాజిక సేవా కార్యక్రమాలకు తమ లాభాల్లో 2 శాతం ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. జిల్లాలోని పులువురు చిన్న పారిశ్రామిక వేత్తలు సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం శుభసూచికమన్నారు.
చాలా మంది జిల్లా యంత్రాంగానికి సరైన సమాచారం అందించకుండా ప్రాధాన్యత లేని పనులకు సీఎస్ఆర్ నిధులు ఖర్చు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, తద్వారా అత్యవసర ప్రజావసర పనులు చేపట్టలేక పోతున్నామని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న మనఊరు- మనబడి, హరితహారం వంటి ప్లాగ్షిఫ్ కార్యక్రమాలకు నిధుల కొరత లేదని, అటువంటి కార్యక్రమాలకు కొందరు పారిశ్రామికవేత్తలు ఖర్చు చేస్తున్నారన్నారు. పారిశ్రామికవేత్తలు తమ సీఎస్ఆర్ నిధుల్లో 30 నుంచి 40 శాతం మేరకు స్థానిక అవసరాల నిమిత్తం ప్రజాప్రతినిధుల కోరిక మేరకు ఖర్చు చేసినా, మిగతా 60 శాతం సీఎస్ఆర్ ఫండ్కు బదలాయిస్తూ జిల్లాలో ఏ ప్రాంతంలో అత్యవసర పనులు చేపట్టాలో గుర్తించి, జిల్లా యంత్రాంగం ద్వారా చేపట్టేందుకు వీలుంటుందన్నారు.
సీఎస్ఆర్ ఫండ్స్ మానిటరింగ్ చేసేందుకు జిల్లాలో ముఖ్య ప్రణాళికాధికారిని నోడల్ అధికారిగా నియమించినట్లు కలెక్టర్ తెలిపారు. పేద వర్గాల సంక్షేమానికి ఏ పనులు అవసరమో గుర్తించడంతో పాటు ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో మరమ్మతులు, మురుగు కాల్వల నిర్మాణం, కళాశాలల్లో ఫర్నిచర్, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద మంచినీటి సౌకర్యం, విద్యుత్తు వంటి కనీస మౌలిక వసతులు, మాతా శిశు సంరక్షణ కేంద్రంలో అటెండెంట్స్కు షెడ్ల ఏర్పాటు వంటి పనులు చేపట్టాలని సూచించారు. జిలాల్లో వివిధ అవసరాల నిమిత్తం ఎన్నో వినతులు వస్తుంటాయని వాటి క్రోడీకరిస్తూ ఏ ప్రాంతంలో అత్యంత ప్రాధాన్యతగా పనులు చేపట్టాలో గుర్తించి సూచిస్తామన్నారు. జిల్లా యంత్రాంగం ద్వారా ఏ పనులు చేపడుతున్నామో వివరిస్తామని కలెక్టర్ వెల్లడించారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల అధికారి కృష్ణామూర్తి, సీపీవో మహమ్మద్ ఖాసీం, ఫారెస్ట్ ప్లస్ ప్రాంతీయ అధికారి సాయిలు, జిల్లాలోని పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.