మెదక్రూరల్ అక్టోబర్ 12 : అభ్యర్థి ఖర్చుపై ఎన్నికల నియమావళి సెక్షన్డీలో స్పష్టంగా పేర్కొన్నామని, ఆమేరకు రోజువారి ఖర్చు వివరాలు రిజిస్టర్లో నమోదు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి రాజర్షిషా రాజకీయ ప్రతినిధులకు సూచించారు. గురువారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్లు రమేశ్, వెంకటేశ్వర్లతో కలిసి చర్చించారు. అభ్యర్థి చేసిన ప్రతి ఖర్చు ను లెక్కలో చూపాలన్నారు. సభలు, ర్యాలీలు, సమావేశాలకు ముందస్తు అనుమతి, ప్రకటనలు, కరపత్రాలు పోస్టర్ల ముద్రణకు సంబంధించి అనుమతి పొందాలని సూచించారు. వాహనాల వినియోగంపై అనుమతి పొందాలని సూచించారు. అభ్యర్థి నామినేషన్ల సందర్భంగా దాఖలు చేసి ఫార్మ్-26 అపిడవిట్లో తప్పనిసరిగా అన్ని అంశాలు పూరించాలని స్పష్టం చేశారు.
వ్యయ నియంత్రణకు సంబంధించిన బుక్లెట్లో పాటు షామియానా, కుర్చీలు, బల్లలు, మైకు,వాహనాల అద్దె తదతర వాటికి సంబంధించి నిర్థారించిన రేట్ కార్డు ప్రతులను అందజేస్తూ, ఆ ధరలపై రాజకీయపార్టీల ప్రతినిధుల అభిప్రాయాలను తీసుకున్నారు. అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియో ప్రకటనలకు సంబంధించి సమాచారశాఖ నిర్ధారించిన రేట్ కార్డులను వారికి అందజేశారు. అనుమానాస్పద బ్యాంకు లావాదేవీలను తనిఖీ చేస్తామని, క్షేత్రస్థాయిలో స్కాడ్ బృందా లు పనిచేస్తాయన్నారు. వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.