మెదక్, (నమస్తే తెలంగాణ)/ సంగారెడ్డి కలెక్టరేట్, అక్టోబర్ 12 : ఈ నెల 16న జరిగే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని టీఎస్పీఎస్సీ చైర్మన్ డాక్టర్ బి.జనార్దన్రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించారు. బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలు, అదనపు కలెక్టర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, లైసన్, అసిస్టెంట్ లైజన్ అధికారులతో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 16 నిర్వహిస్తున్న గ్రూప్-1 పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 3.8 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని ఇప్పటి వరకు 2.43 లక్షల మంది హాల్టికెట్లు డౌన్లౌడ్ చేసుకున్నట్లు తెలిపారు. అభ్యర్థులు హాల్ టికెట్లను https: www.tspsc.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకొని, అందులోని సూచనలను జాగ్రత్తగా పాటించాలన్నారు. పరీక్ష ఈనెల 16న ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1.00 గంటల వరకు ఉంటుందని, అభ్యర్థులు 2 గంటల ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు. గ్రూప్-1లో తొలిసారిగా బయోమెట్రిక్ ఉంటుందని అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు. అభ్యర్థులు హాల్టికెట్తోపాటు ఒక ఐడీని ఒరిజినల్ (ఆధార్, పాన్కార్డు, ఓటర్, ఎంప్లాయ్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్) తీసుకురావాలన్నారు.
హాల్ టికెట్పై ఫొటో/ సంతకం లేనిపక్షంలో వారు గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించిన మూడు పాస్ పోర్ట్ ఫొటోలు తీసుకురావాలని, నిర్ణీత ప్రొఫార్మాలో పరీక్ష కేంద్రంలో అప్పగించాలన్నారు. అభ్యర్థులను పరీక్షహాల్లోకి అనుమతించే ముందు ప్రవేశ ద్వారం వద్ద పరిశీలిస్తారని, ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, అభ్యర్థులు చెప్పులు మాత్రమే ధరించి రావాలని, బూట్లకు అనుమతి లేదన్నారు. పరీక్ష కోసం బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ను మాత్రమే అనుమతించబడుతుందన్నారు. దివ్యాంగులైన అభ్యర్థులకు గ్రౌండ్ ఫ్లోర్లోనే వసతి కల్పించాలని, అభ్యర్థులు హాల్టికెట్ నెంబర్, ఓఎంఆర్ జవాబు పత్రంలో బుక్లెట్ సంఖ్య, వేదిక కోడ్ సరిగ్గా వేయాలన్నారు. సిరీస్ ఏ, బీ, సీ, డీ నుంచి ఆరు అంకెల సంఖ్యకు మార్చబడిందన్నారు. పరీక్ష పూర్తయ్యేవరకూ అభ్యర్థులెవరూ కేంద్రం నుంచి బయటకు వెళ్లకూడదన్నారు. పరీక్ష కేంద్రాలు, చుట్టుపకల ఫొటోస్టాట్ కాపీయింగ్ జిరాక్స్ సెంటర్లను మూసివేయించాలని సూచించారు. పరీక్షా కేంద్రాలు, చుట్టుపకల 144 సెక్షన్ విధించాలన్నారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరేందుకు అదనపు బస్సులు ఏర్పాటు చేయవలసిందిగా ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లో ఎలక్ట్రిసిటీ, టాయిలెట్స్, తాగునీరు ఉండేలా చూడాలన్నారు.
మెదక్ జిల్లాలో 3,312 మంది అభ్యర్థులు
మెదక్ కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ జిల్లాలో 3,312 అభ్యర్థులు పరీక్ష రాసేందుకు వీలుగా మెదక్, నర్సాపూర్, తూప్రాన్లో 7 కేంద్రాలను ఏర్పాటు చేసి అన్ని కేంద్రాల్లోని ప్రతి గదిలో సీసీ కెమెరాలు బిగించామని, ఫర్నిచర్, మౌలిక సదుపాయాలు కల్పించామని తెలుపగా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నందుకు చైర్మన్ కలెక్టర్ హరీశ్ను ప్రశంసించారు. సమావేశంలో మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, రమేశ్, సంబంధిత అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డిలో 8,654 మంది అభ్యర్థులు
సంగారెడ్డి జిల్లా నుంచి కలెక్టర్ శరత్ మాట్లాడుతూ గ్రూప్-1 పరీక్ష నిర్వహణకు జిల్లాలో 26 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. పరీక్షకు మొత్తం 8,654 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్టు వెల్లడించారు. జిల్లాలో సంగారెడ్డిలో 12, సదాశివపేటలో 2, పటాన్చెరులో 7, రామచంద్రపురంలో 5 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాల్లో 24 మంది అభ్యర్థులు, 48 మంది అభ్యర్థుల చొ ప్పున పరీక్ష రాసేందుకు వీలుగా పరీక్షా హాల్లను గుర్తించి అవసరమైన ఏర్పాట్లు చేశామని చైర్మన్కు వివరించారు. సమావేశంలో సంగారెడ్డి ఎస్పీ రమణ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి రాధికారమణి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
సిద్దిపేట అర్బన్, అక్టోబర్ 12 : ఈ నెల 16న నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం టీఎస్పీఎస్సీ బోర్డు మెంబర్లతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశస్థాయిలో యూపీఎస్సీ, సివిల్స్ పరీక్షల తర్వాత అంతేస్థాయిలో రాష్ట్రంలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే అత్యున్నత ఉద్యోగ నియామక పరీక్ష గ్రూప్-1 అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారిగా గ్రూప్-1 పరీక్షను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పరీక్షా పత్రాలను జిల్లాలోని స్ట్రాంగ్ రూంల్లో భద్రపరిచి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా 144 సెక్షన్ అమలు చేయాలని సీపీ శ్వేతకు సూచించారు.
ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష ఉంటుందన్నారు. అభ్యర్థులు గంటముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నా రు. ఒక్క నిమిషం ఆలస్యమైనా లోనికి అనుమతించకూడదన్నారు. ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులను లోపలికి అనుమతించకూడదని, ఇన్విజిలేటర్లకు సెల్ఫోన్లు అనుమతించొద్దని చెప్పారు. పరీక్షా కేంద్రాల్లో ప్రిన్సిపాల్ గదితోపాటు పరీక్ష నిర్వహించే అన్ని గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్ సౌకర్యం సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను అదేశించారు. పరీక్ష రోజు 24 గంటలు విద్యుత్ సరఫరా అయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద వైద్య శిబిరం ఏర్పా టు చేయాలన్నారు. అభ్యర్థులకు అదనంగా ఆర్టీసీ బస్సులు నడిపించాలన్నారు. రవాణాశాఖ సహకారంతో పరీక్షా కేంద్రాలు నేరుగా తెలిసేలా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం కలెక్టర్ ప్రశాంత్ జీవన్ మాట్లాడుతూ జిల్లాలో 20 పరీక్షా కేంద్రాల్లో 7,786 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారని, టీఎస్పీఎస్సీ అధికారులకు తెలిపారు. పరీక్ష సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను అదేశించారు. వీడియో కాన్ఫరెన్స్లో అడిషనల్ కలెక్టర్లు ముజామ్మిల్ఖాన్, శ్రీనివాస్రెడ్డి, డీఆర్డీవో చెన్నయ్య, అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్, ఆర్డీవో అనంతరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్న టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్రెడ్డి
పరీక్ష సాఫీగా జరిగేలా చూడాలి..
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా ప్రభుత్వం ఈ నెల 16న నిర్వహించే గ్రూప్-1 పరీక్షలను చీఫ్ సూపరింటెండెంట్లు పకడ్బందీగా నిర్వహించాలని మెదక్ కలెక్టర్ హరీశ్ సూచించారు. బుధవారం గ్రూప్-1 పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ అధికారులు, చీఫ్ సూపెరింటెండెట్లకు పలు సూచనలు చేశారు. మెదక్ జిల్లాలో పరీక్షకు 3,312 అభ్యర్థులు హాజరు కానున్నారని, అందుకనుగుణంగా మెదక్లో 4, నర్సాపూర్లో 1, తూఫ్రాన్లో 2 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు చీఫ్ సూపరిండెంట్లదేనని లయజన్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. నర్సాపూర్లోని బీవీఆర్ఐటీలో సుమారు 1200 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నందున బస్టాండు నుంచి పరీక్ష కేంద్రానికి బస్సులు నడపాలని ఆ కళాశాల యాజమాన్యానికి, ఆర్టీసీ అధికారులకు కలెక్టర్ సూచించారు.