సంగారెడ్డి, మే 29 (సంగారెడ్డి): కరోనా కట్టడే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్డౌన్ ప్రభావం చూపుతున్నది. జిల్లా అధికార, పోలీసు యంత్రాంగాలు లాక్డౌన్ పకడ్బందీగా అమలు చేస్తుండడంతో సంగారెడ్డి జిల్లాలో కరోనా ఉధృతి తగ్గుతున్నది. క్రమంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతున్నది. సంగారెడ్డి జిల్లాలో గతనెల నుంచి మే మొదటి వారం వరకు కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదయ్యాయి. లాక్డౌన్కు ముందు, తర్వాత సంగారెడ్డి జిల్లాలో కరోనా రోగుల సంఖ్య విషయంలో చాలా వ్యత్యాసం వచ్చింది. వీటిని అధికారులు కూడా ధ్రువీకరిస్తున్నారు. ఈనెలాఖరు వరకు లాక్డౌన్ అమలు కానుండగా, కొవిడ్ కేసుల సంఖ్య మరింత తగ్గనున్నదని అధికారులు చెబుతున్నారు.
లాక్డౌన్తో కరోనా కట్టడి
కరోనా సెకండ్ వేవ్లో సంగారెడ్డి జిల్లాలో కరోనా కేసులు అధికంగానే నమోదయ్యాయి. లక్షణాలు ఉన్నవారు సైతం బయట సంచరించటంతో కరోనా వ్యాప్తి పెరిగి పాజిటివ్ కేసులు పెరుగుతూ వచ్చాయి. అధికారుల లెక్కల ప్రకారం ఏప్రిల్ నెల నుంచి మే మొదటి వారం వరకు పాజిటివ్ కేసులు పెరుగుతూ వచ్చాయి. కరోనా ఉధృతిని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మే 12 నుంచి లాక్డౌన్ అమలు చేస్తున్నది. ఉదయం 6 నుంచి 10గంటల వరకు సడలింపునిచ్చింది. 10 గంటల తర్వాత సంగారెడ్డి జిల్లా అంతటా పకడ్బందీగా లాక్డౌన్ అమలు చేస్తున్నారు. నిబంధనలను ఉల్లఘించి ఎవరైనా రోడ్లపై సంచరిస్తే పోలీసులు కేసులు నమోదు చేస్తూ కఠిన చర్యలు తీసుకుంటుండడంతో జనం బయట సంకరించటం లేదు. దీంతో కరోనా ప్రభావం తగ్గుతూ వచ్చింది. లక్షణాలు ఉన్నవారు ఐసొలేషన్ కావటం, ప్రభుత్వం నిర్వహించిన ఆరోగ్య సర్వేలోనూ లక్షణాలు కనిపించిన వారికి ప్రభుత్వం కిట్లు పంపిణీ చేయటంతో కొవిడ్-19 కట్టడి అవుతున్నది. నెలాఖరు వరకు కరోనా పాజిటివ్ రేటు తగ్గవచ్చని అధికారుల అంచనా.
మెదక్లో వేగంగా రికవరీ
మెదక్, మే 29: జిల్లాలో కరోనా బాధితులు వేగంగా కోలుకుంటున్నారు. ఎక్కువ మంది రోగం నుంచి కోలుకొని ఇంటికి తిరిగి వెళ్లారు. జిల్లాలో ఇప్పటికే వేలాది మంది కరోనాను జయించి సంతోషంగా ఇంటికి వెళ్లారు. ప్రభుత్వం అందిస్తున్న మందుల కిట్ ద్వారా కరోనా నుంచి కోలుకుంటున్నారు. కరోనా విషయంలో అధికారులు, వైద్యుల విశేష కృషిని ప్రజలు అభినందిస్తున్నారు. ఇంటింటి సర్వేలో గుర్తించిన వారు, శ్వాసకోస వ్యాధులున్నవారు, 108 కాల్సెంటర్కు వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. అవసరం మేరకు దవాఖానలకు తరలిస్తున్నారు.