మెదక్ జిల్లాకు చేరిన రంజాన్ కానుకలు
4వేల మందిని గుర్తించిన అధికారులు
మెదక్ నియోజకవర్గానికి 2500, నర్సాపూర్ నియోజకవర్గానికి 1500 గిఫ్టులు
మసీదు కమిటీలకు పంపిణీ బాధ్యతలు
మెదక్, ఏప్రిల్ 28: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా పేద ముస్లిం కుటుంబాలకు గిఫ్ట్ ప్యాక్ల (రంజాన్ తోఫా) పంపిణీకి టీఆర్ఎస్ సర్కారు చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం సర్వమతాల పండుగలను ఘనంగా నిర్వహించుకునేందకు ఏటా నిధులు కేటాయిస్తున్నది. బతుకమ్మ పండుగకు చీరలు, క్రిస్మస్, రంజాన్ పర్వదినాల్లో పేదలు కొత్త దుస్తులు అందజేస్తున్నది. ఇదిలావుండగా, మెదక్ జిల్లాకు ప్రభుత్వం అందజేసే రంజాన్ కానుకలు చేరుకున్నాయి. వీటి పంపిణీకి జిల్లా మైనార్టీశాఖ ఆధ్వర్యంలో అధికారులు అర్హులను గుర్తించి, ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 4000 గిఫ్ట్ ప్యాక్లను అందజేయనుండగా, మెదక్ నియోజకవర్గంలో 2500 మందికి, నర్సాపూర్ నియోజకవర్గంలో 1500 మందికి రంజాన్ కానుకలు పంపిణీ చేయనున్నారు. త్వరలోనే స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులు జిల్లా వ్యాప్తంగా పంపిణీ కార్యక్రమం ప్రారంభించనున్నారు.
మెదక్ జిల్లాలో ఇలా…
మెదక్ జిల్లాలో రెండు నియోజవకర్గాలు ఉండగా, నాలుగు మున్సిపాలిటీలున్నాయి. అర్హులైన నిరుపేదలను గుర్తించి ప్రభుత్వ కానుకలను అందజేస్తున్నారు. ఇందులో భాగంగానే మెదక్ నియోజకవర్గంలో 2500 మందికి, నర్సాపూర్ నియోజకవర్గంలో 1500 మందికి రంజాన్ కానుకలు అందజేయనున్నారు. రంజాన్ సందర్భంగా ప్రభుత్వం నిరుపేద ముస్లింలకు అందించి ప్రత్యేక గిఫ్ట్ ప్యాక్లో ఖరీదైన దుస్తులతో కూడిన కానుకను తయారు చేయించి అందిస్తుంది.