తూప్రాన్ రూరల్ మార్చి 25 : నాడు అభివృద్ధి అంటే ఏమిటో తెలియదు. సమైక్యపాలకులు ఏనాడు గ్రామాభివృద్ధిపై దృష్టి పెట్టలేదు. కనీసం ఇక్కడకు వచ్చి మౌలిక వసతులపై అధికారులు, ప్రజాప్రతినిధులు ఆరా తీయలేదు. అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయకపోవడంతోపాటు గ్రామం వైపు కన్నెత్తి చూడలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ పాలనలో మారుమూల గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించడంతో నర్సంపల్లి నేడు అభివృద్ధివైపు పరుగులు తీస్తుంది. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలో కొనసాగిన నర్సంపల్లిని తూప్రాన్ మండలంలో చేర్చారు. పల్లెప్రగతితో నర్సంపల్లి గ్రామ రూపురేఖలు మారాయి. నాడు కుగ్రామంగా మారుమూల గ్రామాలకు చివరలో ఎవరికి కనిపించని నర్సంపల్లి నేడు అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా పరుగులు తీస్తుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతిలో పుష్కలంగా నిధులు మంజూరు చేయడంతో దినదినాభివృద్ధి చెందుతుంది. గ్రామానికి మంజూరైన రూ.55లక్షలతో వివిధ అభివృద్ధి పనులు జరిగాయి. గ్రామంలో ఇంటింటికీ మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరా జరుగుతుంది. ప్రతి వీధిలో విద్యుత్ స్తం భాలు, వీధిలైట్లు, సీసీ, బీటీ రోడ్లతోపాటు మౌలిక వసతులు కల్పించారు.
చైతన్యస్ఫూర్తితో కదిలిన గ్రామస్తులు..
పల్లెప్రగతిలో ముండ్ల పొదలు, పిచ్చిమొక్కలు, పురాతన, పాడుబడిన పెంకుటిండ్లను కూల్చివేయించారు. పెంట కుప్పలు, పాడుబడిన పురాతన బావులను పూడ్చి వేయించారు. గామస్తులంతా సమిష్టిగా పల్లెప్రగతిలో పాల్గొంటూ శ్రమదానం ద్వారా గ్రామంలోని రోడ్లు, వీధులను ఎప్పటికప్పుడూ శుభ్రం చేస్తూ హరితహారంలో నాటిన మొక్కలకు నీటిని అందిస్తూ వాటిని సంరక్షిస్తున్నారు.
ఉద్యమ స్ఫూర్తితో శ్రమదానం వైపు..
పార్టీలు, గ్రూపులకతీతంగా గ్రామంలో చేపట్టిన పల్లెప్రగతిలో యువకులు, మహిళలతోపాటు వృద్ధులు సైతం స్వచ్ఛందంగా భాగస్వాములవుతూ గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారు. గ్రామంలోని 20 మహిళా సంఘాలుండగా 150మంది మహిళలున్నారు. వీరంతా పల్లెప్రగతిలో భాగస్వాములవుతున్నారు.
గ్రామ స్వరూపం…
గ్రామంలో ఆంజనేయస్వామి ఆలయం ఉంది. గ్రామ ప్రధాన కూడలిలో జెండా వద్ద గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ 288 కుటుంబాలు ఉండగా 1300మంది జనాభా ఉన్నారు. వీరిలో 698మంది మహిళలు, 602మంది పురుషులు ఉన్నారు.
40వేల హరితహారం మొక్కల పెంపకం..
గ్రామంలో రోడ్లు, వీధులు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇండ్ల పరిసరాల్లో 40వేల హరితహారం మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తున్నారు. గ్రామస్తులకు తాగునీటిని అందించేందుకు పంచాయతీ పరిధిలో 4 వాటర్ ట్యాంక్లను నిర్మించారు. 60వేల లీటర్ల సామర్ధ్యం తో ఒకటి, 25వేల లీటర్ల సామర్థ్యంతో మరో 3 వాటర్ ట్యాంక్ల ను నిర్మించారు. వీటి ద్వారానే మిషన్ భగీరథ నీటిని నల్లాల ద్వారా అందిస్తున్నారు.
రూ.20 లక్షలతో వైకుంఠధామం…
గ్రామ శివారులో ఈజీఎస్, గడా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి మంజూరు చేసిన రూ.20లక్షలతో వైకుంఠధామం నిర్మాణం పనులను పూర్తి చేశారు.
గ్రామ నర్సరీలో 15 వేల మొక్కలు పెంపకం..
గ్రామ శివారులో గ్రామ నర్సరీని ఏర్పాటు చేశారు. ఇందులో రూ.2లక్షలతో వివిధ రకాల 15వేల మొక్కల పెంపకం చేపడుతున్నారు. ప్రతి రోజు నర్సరీలోని మొక్కలకు నీటిని అందిస్తూ వానకాలం నాటికి సిద్ధం చేయడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సారించారు. గ్రామంలోని ప్రతివీధిలో రూ.10లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం పనులను పూర్తి చేశారు. గ్రామ శివారులో రూ.2.25 లక్షలతో డంపింగ్ యార్డును నిర్మించారు. ప్రజలు తమ ఇండ్లలోని చెత్తను డంపింగ్ యార్డుకు తరలిం చి తడి, పొడి చెత్తను వేరు చేస్తున్నారు. గ్రామంలోని ఇద్దరు సపా యి కార్మికులుండగా మరో ఇద్దరిని తాత్కాలిక పద్ధతిలో నియమించి పనులను చేయిస్తున్నారు.
రూ.6లక్షలతో ఆహ్లాదకరంగా పల్లెప్రకృతి వనం…
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రకృతి వనాన్ని రూ.6లక్షలతో నిర్మించారు. అధికారులు సూచించిన తరహాలోనే ఈ నిర్మాణం పనులు పూర్తవడంతో ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. చిన్నారులు, యువతీ, యువకులు ఇక్కడికి ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో వస్తూ వాకింగ్ చేస్తున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన క్రీడా పరికరాలతో చిన్నారులు ఉల్లాసంగా గడుపుతున్నారు. ఎకరం స్థలంలో 4వేల వివిధ రకాలైన మొక్కలు నాటి దట్టమైన అటవీ ప్రదేశంగా తీర్చిదిద్దారు. మొదటి వరుసలో నీడనిచ్చే మొక్కలు, రెండో వరుస లో పండ్లు, పూల మొక్కలు, మూడో వరుస లో ఆహ్లాదకరంగా కన్పించే వివిధ రకాలైన మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. గ్రామస్తులు నడువడానికి వీలుగా మొక్కల మధ్యలో వాకింగ్ట్రాక్ను నిర్మించారు. చిన్నారులు, యువతీ, యువకులు, వృద్ధులు తమ తీరిక సమయాల్లో పార్క్కు వచ్చి వాకింగ్ చేయడంతో పాటు చిన్నారులు ఆటలు ఆడుకోవడం ద్వారా ఉల్లాసంగా గడుపుతున్నారు.Medak 26032021