సిద్దిపేట, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎస్సీలపై దాడి కేసులో పలువురు బీజేపీ నాయకులపై కేసులు నమోదయ్యాయి. దీంతో పలువురు పరారీలో ఉన్నారు. బీజేపీ సిద్దిపేట జిల్లా మాజీ అధ్యక్షుడు దూది శ్రీకాంత్రెడ్డి, పత్రి శ్రీనివాస్తోపాటు మరికొందరిపై 447, 427, 324, 307, 384, 379, 504, 506, 34, 3(1)(ఆర్)(ఎస్)3(2), హత్యాయత్నం, బెదిరింపులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద సిద్దిపేట టూటౌన్ పోలీస్టేషన్లో కేసులు నమోదయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. సిద్దిపేట పట్టణానికి చెందిన గరికమొకుల రాజేశ్ స్థానిక మెదక్ రోడ్డులోని రాఘవేంద్రనగర్లోని సాయికృష్ణ వెంచర్ పకన 8 నెలల క్రితం సర్వే నెం.1999లో 120 గజాల ప్లాట్ను కొనుగోలు చేశాడు. ఆ స్థలంలో భవన నిర్మాణానికి మున్సిపాలిటీ నుంచి అనుమతి పొంది, బ్యాంకు రుణం సైతం తీసుకున్నాడు. 4 నెలల క్రితం గృహ నిర్మాణానికి భూమిపూజ చేసి నిర్మాణ పనులు ప్రారంభించాడు.
ఈ క్రమంలో 19న రాత్రి 11 గంటల ప్రాంతంలో సెంట్రింగ్ పని ముగించుకుని అకడే భోజనం చేసి మిత్రులతో కలిసి విశ్రాంతి తీసుకున్నాడు. ఆ సమయంలో బీజేపీ నాయకులు దూది శ్రీకాంత్రెడ్డి, పత్రి శ్రీనివాస్ మరికొందరితో వచ్చి ఆయనతో గొడవకు దిగారు. ముందుగా సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగింది. ఈ క్రమంలో దూది శ్రీకాంత్రెడ్డి, పత్రి శ్రీనివాస్ తన అనుచరులతో కలసి రాజేశ్, అతడి స్నేహితులపై కర్రలతో దాడికి దిగారు. వారి కార్ల అద్దాలను ధ్వంసం చేశారు. పిల్లర్ల దశలో ఉన్న ఇంటి నిర్మాణం సైతం జేసీబీతో కూల్చివేయించారు. దీంతో బీజేపీ నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేయడంతో వారు పరారీలో ఉన్నారు. దళితులపై బీజేపీ నాయకులు భౌతిక దాడులకు పాల్పడడాన్ని అందరూ ఖండిస్తున్నారు.