బోసిపోయిన రోడ్లు
వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు
రామాయంపేట, తూప్రాన్, చేగుంట, నార్సింగి మండలాల్లో ప్రశాంతంగా లాక్డౌన్
రామాయంపేట, మే 15 : లాక్డౌన్ నాల్గో రోజూ రామాయంపేటలో ప్రశాంతంగా కొనసాగింది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు దుకాణా సముదాయాలన్నీ తెరువగా ప్రజలు తమకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేసి తమ ఇండ్లకు చేరుకున్నారు. దీంతో పది తర్వాత దుకాణా సముదాయాలన్నీ మూసివేయడంతో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. మండలంలోని డి.ధర్మారం, లక్ష్మాపూర్, తొనిగండ్ల, ఝాన్సీలింగాపూర్, కాట్రియాల గ్రామాల్లో సైతం లాక్డౌన్ స్వచ్ఛందంగా పాటించారు. పట్టణంలోని మెదక్, సిద్దిపేట రోడ్డుతో పాటు పాతజాతీయ రహదారి వద్ద పోలీసులు వాహనాలు తనిఖీలు చేశారు.
తూప్రాన్లో
తూప్రాన్ రూరల్, మే 15 : తూప్రాన్ పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో శనివారం లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగింది. కూరగాయలు, కిరాణాషాపులు కిటకటలాడాయి. పట్టణంలోని వర్తక, వ్యాపార, వాణిజ్య సంస్థలు, కూరగాయల మార్కెట్లు ఉదయం 10 గంటల తర్వాత మూసివేశారు. దీంతో పట్టణ ప్రధాన రహదారితో పాటు పలు కాలనీలు నిర్మానుష్యంగా మారాయి.
నర్సాపూర్లో…
నర్సాపూర్,మే15: నర్సాపూర్ పట్టణంలో లాక్డౌన్ కట్టుదిట్టంగా కొనసాగింది. ఉదయం 10 గంటల దుకాణాలను మూసివేసి లాక్డౌన్ పాటించారు.
చేగుంట, నార్సింగి మండలాల్లో…
చేగుంట, మే 15 : చేగుంటలో లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగింది. ఉదయం 10 గంటల అనంతరం చేగుంట, నార్సింగి మండలాల్లో రహదారులన్నీ జనాలు లేక వెలవెల బోయాయి. పోలీసులు ఏర్పాటు చేసిన చెక్పోస్టుల వద్ద రోడ్డు పై వచ్చే వాహనాలను ఆపి విచారిస్తున్నారు.
చిలిపిచెడ్ మండలంలో
చిలిపిచెడ్, మే15 : లాక్డౌన్ నేపథ్యంలో మండలంలో రోడ్లు నిర్మానుష్యంగా ఉన్నాయి. చండూర్ చౌరస్తా మెదక్-సంగారెడ్డి రోడ్డుపై ఎస్సై మల్లారెడ్డి తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఏఎస్సై దయానంద్, సిబ్బంది పాల్గొన్నారు.