పుస్తకాల్లోని పాఠాలు చెప్పి, ప్రశ్నలకు సమాధానాలు రాయించి, మార్కులు తెప్పించే విధానంలో ప్రభుత్వం మార్పులు తీసుకువస్తున్నది. ప్రాథమిక పాఠశాలల్లోని 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు పాఠాలు బోధించడంలో వినూత్న పద్ధతిని అమలు చేసేందుకు ఉపాధ్యాయులకు శిక్షణ నిర్వహిస్తున్నారు. బాలల బాల్యానికి పెద్దపీఠ వేస్తూ వారిలోని ఆలోచనలకు పదును పెడుతూ రూపొందించిన కార్యక్రమమే ‘హరివిల్లు’. ఇందులో కథలు, సన్నివేశాలు, అభిప్రాయ వ్యక్తీకరణలు మొదలైన బోధన అభ్యాసనలు పొందుపర్చారు. 2021-22 విద్యాసంవత్సరంలో దీనిని అమలు చేసేందుకు ఉపాధ్యాయులకు శిక్షణనిస్తున్నారు.
ఇష్టం పెంచేందుకే…
విద్యార్థులకు ఆటపాటలతో కూడిన బోధన అందించేందుకు ప్రభుత్వం హరివిల్లు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. జిల్లాలో మంగళవారం నుంచి ఉపాధ్యాయులకు జామ్ యాప్లో శిక్షణ ప్రారంభించాం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు ప్రణాళిక తయారు చేశాం. దీని ద్వారా విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసం పెంపొందుతుంది. చదువుల్లో రాణించేందుకు తోడ్పడుతుంది. పాఠశాలలంటే ఇష్టం పెరుగుతుంది.