మెదక్, జూలై 12 : సీజనల్ వ్యాధులపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ మార్పుల ద్వారా వచ్చే ఫైలేరియా, మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, డయేరియా, టైపాయిడ్, జాండీస్, అతిసార వ్యాధులతోపాటు కొత్తగా వస్తున్న జీకా వ్యాధుల నుంచి ప్రజలను రక్షించేందుకు వైద్యాధికారులు కార్యాచరణ రూపొందించుకొని ముందుకు సాగాలని కలెక్టర్ ఎస్.హరీశ్ సూచించారు. సోమవారం జిల్లా వైద్యాధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్యూలెక్స్ దోమ వల్ల పలు వ్యాధులు ప్రబలుతాయని, దోమల నివారణకు ఫాగింగ్ చేయాలన్నారు. సీజనల్ వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించాలని చెప్పారు. జూన్ నుంచి డిసెంబర్ వరకు దోమలు విస్తరిస్తాయని, ఇది చాలా క్లిష్ట సమయమని, దోమ కాటుకు జిల్లాలో ఒక్కరూ కూడా బలి కాకుండా చూడాలన్నారు. అందులో భాగంగా ఈనెల 15న మాస్ డ్రాగ్ అడ్మినిస్ట్రేషన్ పాటిస్తూ 16,17 తేదీల్లో ఇంటింటికీ ఫైలేరియా (బోధ వ్యాధి) నివారణకు రెండు రకాల మాత్రలు పంపిణీ చేయాలని ఆదేశించారు.
జిల్లాలో పాపన్నపేట తదితర ప్రాంతాల్లో కేసులు ఉన్నందున పకడ్బందీగా చర్యలు చేపట్టి పైలేరియాను నిర్మూలించుటకు వైద్య సిబ్బంది కృషి చేయాలన్నారు. ఇందుకు అంగన్వాడీలు, ఆశ వర్కర్లు, పంచాయతీ కార్యదర్శులు సహకరించాలన్నారు. అదేవిధంగా విస్ఫోటనంగా పెరిగి పోతున్న జనాభా వల్ల వనరులు తరిగిపోతున్నాయని, మన దేశ జనాభా 134 కోట్లకు చేరిందన్నారు. అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ మాట్లాడుతూ వైద్యసిబ్బంది ఒక ఛాలెంచ్గా తీసుకొని ఫైలేరియా నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం కుటుంబ నియంత్రణ విఫలమైన ముగ్గురు లబ్ధిదారులకు రూ.30 వేల చొప్పున నగదు అందజేశారు. అదేవిధంగా కుటుంబ నియంత్రణలో ఇతర వైద్య సేవలు అందించడంలో విశేష కృషి చేసిన వైద్య సిబ్బందికి ప్రశంసాపత్రాలు, నగదును కలెక్టర్ అందజేశారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటేశ్వర్రావు, జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ చంద్రశేఖర్, జిల్లా విద్యాశాఖాధికారి రమేశ్కుమార్, డీపీవో తరుణ్కుమార్, మున్సిపల్ కమిషనర్లు, అధికారులు, సూపర్వేజర్లు పాల్గొన్నారు.
పల్లె ప్రగతి నిరంతర ప్రక్రియ: కలెక్టర్ హరీశ్
పల్లె ప్రగతి కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని, పది రోజులపాటు నిర్వహించిన పల్లె ప్రగతిలో ప్రజల సహకారం, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో అధికారులపై బాధ్యత మరింత పెరిగిందని కలెక్టర్ హరీశ్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అధికారులు క్షేత్ర స్థాయిలో మరింత కష్టపడి పని చేసి ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాల సాధనకు కృషి చేయాలన్నారు. పల్లె ప్రగతితో నేడు పల్లెల్లో గుణాత్మక మార్పులు వస్తున్నాయన్నారు. పల్లె ప్రగతి విధి విధానాలు అమలు పర్చడంలో అలసత్వం వహించిన 47 మంది సర్పంచ్లు, 16 మంది గ్రామ కార్యదర్శులు, ఇద్దరు పంచాయతీ అధికారులకు షోకాజ్ నోటీసులు ఇచ్చామని తెలిపారు. జిల్లాలోని 469 గ్రామ పంచాయతీల్లో చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో 13,695 రోడ్లు, 10,583 మురుగు కాల్వలను శుభ్రం చేశామన్నారు. అదేవిధంగా ప్రభుత్వ భవనాలైన అంగన్వాడీ కేంద్రాలు, ఆరోగ్య కేంద్రా లు, ఉపకేంద్రాలు, పాఠశాలలు, మార్కెట్ స్థలాలు 3,370 శుభ్రం చేశామన్నారు.
గుంతలున్న 1,644 ప్రాంతాలను చదును చేశామని, ప్రతి ఇంటికీ ఆరు మొక్కల చొప్పున 1,18,846 గృహాలకు 7,41,010 మొక్కలు పంపిణీ చేశామని తెలిపారు. 7,12,016 మీటర్ల మేర రోడ్డు ఇరువైపులా మొక్కలు నాటామని, చనిపోయిన మొక్కల స్థానంలో 2, 62,263 మొక్కలు నాటామని కలెక్టర్ వివరించారు. వివిధ ప్రాంతాల్లో 2,198 తుప్పు పట్టిన, వంగిపోయిన విద్యుత్ స్తంభాలను గుర్తించి 907 స్థానాల్లో మరమ్మతులు చేశామన్నారు. 653 ప్రాంతాల్లో మూడో విద్యుత్ తీగ ఏర్పాటు చేయడం, 536 విద్యుత్ మీటర్లు బిగించామని తెలిపారు. పల్లెప్రగతికి సహకరించిన ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులకు ఈ సందర్భంగా కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు.