వీడియో కాన్ఫరెన్స్లో సీఎస్ సోమేశ్ కుమార్
మెదక్, జూన్ 5 : జిల్లాలో పెండింగ్ భూ సమస్యల దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. సమీకృత కలెక్టరేట్ నిర్మాణం, ధరణి, మంజూరు వైద్య కళాశాలకు స్థల సేకరణ వంటి పలు అంశాలపై రాష్ట్ర ఉన్నత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో శనివారం సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సకాలంలో సమీకృత కలెక్టరేట్ల భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు. ప్రగతిలో ఉన్న పనుల్లో వేగం పెంచి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో ధరణి ద్వారా జరుగుతున్న వ్యవసాయ భూముల లావాదేవీలపై కలెక్టర్ దృష్టి సారించాలని ఆయన తెలిపారు. జూన్ 10 వరకు కటాఫ్ తేదీ పరిగణిస్తూ జూన్ 15 నుంచి వానకాలం రైతు బంధు నగదు సహాయాన్ని విడుదల చేస్తున్నామని, దీనిని దృష్టిలో ఉంచుకొని ధరణిలో పెండింగ్ మ్యుటేషన్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సీఎస్ సూచించారు. జిల్లాలో పండే పంటల ఆధారంగా క్రాప్ కాలనీలుగా విభజించి పంటకు అనుగుణంగా ఆహార శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని, రైతులకు అధిక లాభం, ప్రజలకు నాణ్యమైన సరుకులు అందుబాటులో వచ్చే విధంగా సదరు ఆహార శుద్ధి కేంద్రాలు ఉపయోగపడుతాయని తెలిపారు. ఈ ఆహార శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు జిల్లాలో కనీసం 100 ఎకరాల భూమిని గుర్తించి ఎంపిక చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఉన్న ప్రభుత్వ భూములకు ప్రాముఖ్యత ఇవ్వాలని, ప్రభుత్వ భూమి అందుబాటులో లేని పక్షంలో జిల్లాలో తక్కువ విలువ గల భూములను గుర్తించి సేకరణ చేయాలని సూచించారు. జిల్లాలో లాక్డౌన్ను సమర్ధవంతంగా నిర్వహించాలని, కరోనా కట్టడి కోసం నివారణ చర్యలు పాటించాలని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించారు. కరోనా చికిత్స కోసం వినియోగించే మందులు, ఇతర పరికరాలు కొరత సృష్టించి అధిక ధరల విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ ధరణిలో వచ్చిన అన్ని ఫిర్యాదులను, మ్యుటేషన్లను పరిష్కరించామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ రమేశ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.