చేర్యాల, జూలై 19: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రంలో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయడానికి మూడు రోజులుగా ఎస్ఎస్ ఇన్ఫాస్ట్రక్చర్ ప్రైవేట్ ఎజెన్సీ సంస్థ ప్రతినిధులు డిజిటల్ సర్వే ప్రారంభించారు. క్షేత్రంలో ప్రస్తుతం ఉన్న నిర్మాణాలు, స్థ్ధలాలు, రోడ్లు, భూములు తదితర వాటిని మొదటగా డిజిటల్ సర్వే చేస్తున్నారు. సర్వే సంస్ధ ప్రతినిధులు ప్రాథమిక సర్వే పూర్తి చేసిన అనంతరం మాస్టర్ ప్లాన్ అమలు కోసం ప్రత్యేకంగా నమూన చిత్రాలను తయారు చేసి దేవాదాయశాఖకు అప్పగించనున్నారు.
మాస్టర్ ప్లాన్ సర్వే పూర్తి అనంతరం, వారు అందించిన నమూనా చిత్రాల ఆధారంగా దేవాదాయ శాఖ ఆమోదం తెలిపిన అనంతరం సర్కారు అభివృద్ధి పనులకు నిధులు మంజూ రు చేసే అవకాశం ఉంది. ఈ విషయమై ఆలయ ఈవో మాట్లాడుతూ… ఇటీవలే డిజిటల్ సర్వే ప్రారంభమైందని, త్వరగా దానిని పూర్తి చేస్తామని తెలిపారు. సమైక్య రాష్ట్రంలో ఓసారి మల్లన్న క్షేత్రంలో లక్షలాది రూపాయలు వెచ్చించి మాస్టర్ ప్లాన్ అమలు కోసం ఓ ప్రైవేటు సంస్థ సర్వే నిర్వహించింది. దేవాదాయ శాఖకు నివేదిక చేరినా దానికి మోక్షం కలుగలేదు.