మర్కూక్, జూన్ 26 : పచ్చని ప్రకృతి ఒడిలో భాగ్యనగరానికి అతి సమీపంలో సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ సాగర్ పక్కన తెలంగాణ పండరీపురంగా వాసికెక్కిన మర్కూక్ పాండురంగ ఆశ్రమం 9 దశాబ్దాలుగా అశేష భక్తుల ఆపన్నక్షేత్రంగా విరాజిల్లుతున్నది. చుట్టూ పచ్చని చెట్లు, పక్షుల కిలకిల రాగాలు, కొండల మధ్య కొలువుదీరిన సాక్షాత్తు శ్రీమన్నారాయణ ప్రతిరూపమే మర్కూక్ పాండురంగాశ్రమం. రుక్మిణీ పాండురంగస్వామి, సీతారామచంద్రస్వామి, భవానీచంద్రమౌళీశ్వరస్వామి అనే మూడు నామాలతో 92 ఏండ్లుగా జనావాసాలకు దూరంగా ఆధ్యాత్మిక కేం ద్రంగా పాండురంగాశ్రమం విరాజిల్లుతుంది. మహారాష్ట్రంలోని పండరీపురంలో వెలిసినట్లుగానే దట్టమైన మర్కూక్ అడవుల్లో పాండురంగస్వామి ఆలయం ఉంది. ఆషాఢమాసం శూన్యమాసంగా భావిస్తూ నిత్యపూజలతో ఆశ్రమం భక్తిప్రపత్తులు వెదజల్లుతుంది.
ఆషాఢ ఉత్సవాలకు సర్వం సిద్ధం..
కొండల మధ్య కొలువైన జగన్నాథుడికి ఏటా ఆషాఢ శుద్ధ ఏకాదశి, ద్వాదశితోపాటు వరుసగా మూడు రోజులపాటు ఉత్సవాలు నేత్రపర్వంగా నిర్వహిస్తారు. దశమి రోజున అశేష భక్తసమూహం మధ్య అఖండ నామస్మరణ ప్రారంభించి ద్వాదశి వరకు నామ సంకీర్తనలు కొనసాగుతాయి. ఏకాదశి నాడు భక్తులంతా ఉపవాసం ఉండి జాగారం చేస్తారు.
మహా అన్నదానం..
1992లో శ్రీభావానందస్వామి స్వహస్తములతో ఆషాఢ ఉత్సవాల్లో ప్రధాన ఘట్టం మహా అన్నదానం. దీన్ని ఉద్దేశం కులాలకు అతీతంగా జనులందరికీ భోజన వసతి కల్పించడం. ఆలయ నిర్వాహకులు ముం దురోజు వివిధ రకాల వంటలు వండి అన్నాని పెద్దరాశిగా ఆరబోసి అన్నపూజ చేసి చాటలతో భక్తులకు వడ్డిస్తారు. చాటల ద్వారా వడ్డించడం దేశంలోనే మరెక్కడా లేని సంప్రదాయం మర్కూక్ పాండురంగ ఆశ్రమంలో ఉంది. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ఆలయ నిర్వాహకులు, సిబ్బంది, వలంటీర్లతో అన్న వితరణ చేస్తారు.
సాంబారు, ప్రసాదం భలే పసందు..
ఉత్సవాలకు హైదరాబాద్, సికింద్రాబాద్తోపాటు ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. అయితే, ద్వాదశి రోజున అన్నంతోపాటు సాం బర్, ప్రసాదం స్వీకరించిన భక్తులు తన్మయంతో తిరుగు ప్రయాణం చేస్తారు.
నిత్య కార్యక్రమాలు..
ఈనెల 26న ఉదయం 8 గంటలకు భవనందాపురం గ్రామం నుంచి పాదయాత్ర నిర్వహిస్తారు. 27న భవానాంద భరతీస్వామివారి పాదుకపూజ, 28న సీతారామచంద్రస్వామి క్షీరాభిషేకం, శతరుద్రాభిషేకం, 29న ఆషాఢ ఉత్సవం, తొలి ఏకాదశి విశేష పూజ, సంగీత నృత్య హరికథ కాలక్షేపం, 30న చివరిరోజు అఖండ అన్నప్రసాద వితరణ ఉంటుందని ఆలయ నిర్వాహకులు సత్యనారాయణశర్మ, విఠల్శర్మ, రాజుశర్మ, రఘుపతిశర్మ తెలిపారు.
మంత్రి హరీశ్రావుతోపాటు ప్రముఖుల రాక..
మర్కూక్ పాండురంగాశ్రమంలోని ఆషాఢ ఉత్సవాలకు ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీ, ఎఫ్డీసీ చైర్మన్తోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరుకానున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వాన పత్రికలు అందజేశారు.