హుస్నాబాద్ టౌన్, మే 4: మామిడి పండ్ల సీజన్ ప్రారంభం కావడంతో మామిడి తోటలకు నెలవైన హుస్నాబాద్ నుంచి నిత్యం వివిధ రాష్ర్టాలకు టన్నులకొద్దీ మామిడికాయల ఎగుమతి సాగుతున్నది. స్థానికంగానే మార్కెట్ ప్రారంభం కావడంతో రైతులకు సైతం ఉపయోగకరంగా మారింది. హుస్నాబాద్ అనగానే పండ్ల తోటల సాగుకు పెట్టింది పేరు. హుస్నాబాద్తోపాటు చుట్టుపక్కల మండలాల్లో వందలాది ఎకరాల్లో మామిడి తోటలు సాగు చేస్తున్నారు.
మామిడితోటలకు నిలయం…
హుస్నాబాద్తోపాటు చుట్టుపక్కల మండలాల్లో వందలాది ఎకరాల్లో రైతులు మామిడి తోటల పెంపకం చేపట్టారు. మామిడి తోటల్లో బంగినపల్లి, దసిరి, ఇమాయిత్ తదితర రకాల సాగుచేస్తున్నారు. హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మామిడికాయల కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. గతంలో వరంగల్, కరీంనగర్ తదితర ప్రాంతాలకు తీసుకెళ్లి మామిడి కాయలు విక్రయించుకునే పరిస్థితి ఉండేది. నాలుగేండ్లుగా స్థానికంగానే మార్కె ట్ ప్రారంభం కావడంతో రైతులు ఇక్కడే విక్రయిస్తున్నారు. టన్ను మామిడికాయలకు రూ. 30 నుంచి రూ.40వేల వరకు ధర పలుకుతున్నది. రైతుల నుంచి కొనుగోలు చేసిన మామిడికాయలను ఎప్పటికప్పుడు కూలీలతో బుట్టల్లో ప్యాకింగ్ చేయిస్తున్నారు. ప్యా కింగ్ చేసిన మామిడి కాయలను మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ రాష్ర్టాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు వివిధ రాష్ర్టాలకు 50 టన్నులకు పైగా ఎగుమతి చేశారు.
రైతులు కోరిన ధర పెడుతున్నం..
మామిడి కాయలకు రైతులు కోరుకున్న ధరను పెడుతున్నం. ఇక్కడి రైతులకు లాభం చేకూర్చేందుకే మార్కెట్ ప్రారంభించాం. కరీంనగర్, వరంగల్ మాదిరిగా ధరలు ఉండడంతో దూరప్రాంతాల నుంచి రైతులు హుస్నాబాద్కు వచ్చి అమ్ముకుంటున్నారు. ఎంత సరుకు వచ్చినా కొనేందుకు సిద్ధంగా ఉన్నం.
– సందీప్, వ్యాపారి, హుస్నాబాద్
రైతులకు ఉపయోగం..
హుస్నాబాద్లో మామిడి మార్కెట్ ఏర్పాటు చేయడం రైతులకు ఎంతో ఉపయోగంగా ఉంది. గతంలో స్థానికంగా మార్కెట్ లేక రైతులు దళారులకు తోటలు అప్పగించే వారు. వాళ్లు పూర్తిస్థాయిలో రైతులకు డబ్బులు ఇవ్వక ఇబ్బందులు పెట్టేవారు. ఇప్పుడు మార్కెట్ హుస్నాబాద్లోనే ఉండడంతో రైతులు మామిడికాయలను తెచ్చి అమ్ముకుంటున్నారు. రవాణా డబ్బులు మిగులుతున్నాయి. దళారుల బాధ తప్పింది. నాలుగు డబ్బులు కండ్ల చూస్తున్నారు. – శంకర్రెడ్డి, రైతు, హుస్నాబాద్