మెదక్ మున్సిపాలిటీ, ఫిబ్రవరి 24: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మనఊరు-మనబడి’ కార్యక్రమంలో భాగంగా ఆయా పనులు యుద్ధ ప్రతిపాదికన చేపట్టి, మార్చి నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఎగ్జిక్యూటీవ్ ఏజెన్సీలు, మండల నోడల్ అధికారులు, మండల విద్యాధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రూ.30 లక్షల లోపు ఉన్న 256 కాంపోనేట్ పనులు 80శాతం వచ్చే మార్చి నాటికి పూర్తి చేయాలన్నారు. రూ.30 లక్షల నుంచి రూ.కోటి లోపు పనులకు సంబంధించి టెండర్ కానిపక్షంలో ఎస్ఎంసీ తీర్మానంతో నామినేషన్ పద్ధతిన పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిధుల కొరత లేదని, ప్రభుత్వం వద్ద ఈ కార్యక్రమానికి రూ.300 కోట్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. చేసిన పనులకు వెంటనే ఎంబీ రికార్డు చేసి ఎఫ్టీవో పోర్టల్లో నమోదు చేసి కలెక్టర్ లాగిన్కు పంపిన వెంటనే నిధులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. అధికారులు సాకులు చెప్పకుండా నిబద్ధతతో పనిచేస్తూ పనులు వేగవంతం చేయాలన్నారు.
మొదటి విడత చేపట్టిన 313 పాఠశాలల్లో 273 కాంపోనేట్ పనులు వివిధ దశల్లో ఉన్నాయని, నిర్మాణాలు పూర్తైన వాటికి ప్రభుత్వం నిర్దేశించిన స్పెసిఫికేషన్ మేరకు పెయిటింగ్ వేయాలని సూచించారు. క్వాలిటీ కంట్రోల్ ఇంజినీరింగ్ అధికారులు ప్రతిరోజు పనుల నాణ్యతను పరిశీలించి నివేదిక అందజేయాలన్నారు. ఉపాధి హామీ పథకం కింద మంజూరు చేసిన ప్రహరీ, వంట గది, మరుగుదొడ్లు వంటి నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని, వారంలోగా చేసిన పనులకు డబ్బులు చెల్లించనున్నట్లు చెప్పారు. సర్పంచులు ముందుకురాని పక్షంలో కాంట్రాక్టర్ల ద్వారా పనులు ప్రారంభించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. కొన్ని చోట్ల పనులు నత్తనడకన సాగుతుండటంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్దేశిత కాలంలో పనులు పూర్తి కాకపోతే డిప్యూటీ ఈఈలు, ఏఈలు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. పాఠశాలలకు కావాల్సి డ్యూయల్ డెస్క్, గ్రీన్ చాక్ బోర్డుల ఏర్పాట్లకు ప్రతిపాదనలు ఇవ్వాలని డీఈవోకు సూచించారు.
పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించి జిల్లాను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిపేందుకు ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలన్నారు. విద్యార్థుల ప్రతిభను బట్టి కేటగిరీలుగా విభజించి ప్రత్యేక తరగతుల ద్వారా ఆయా సబ్జెక్టుల్లో మంచి బోధన అందించాలని, విద్యార్థుల సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తూ ప్రోత్సహించాలన్నారు. సమావేశంలో డీఈవో రమేశ్కుమార్, ఎగ్జిక్యూటీవ్ ఇంజినీరింగ్ అధికారులతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.