హుస్నాబాద్, డిసెంబర్ 5: కుటుంబ కలహాలతో కన్నతల్లి, భార్య, అత్తలపై ఓ లారీ డ్రైవర్ కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన ఘటన హుస్నాబాద్ పట్టణంలోని సిక్కువాడలో సోమవారం తెల్లవారు జామున జరిగింది. తీవ్ర గాయాలైన భార్య, తల్లిని సిద్దిపేట దవాఖానకు తరలించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితులు బదనాపురం రమేశ్ పరారీలో ఉన్నాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్కన్నపేట మండలం గౌరవెల్లి గ్రామానికి చెందిన బదనాపురం రమేశ్ లారీ డ్రైవర్. భార్య , ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. కుటుంబంతో సహా హుస్నాబాద్లోని సిక్కువాడలో ఓ ఇంటిలో అద్దెకు ఉంటున్నాడు. కొన్ని నెలలుగా భార్య ఇద్దరు పిల్లలతో కలిసి తల్లిగారి ఊరైన కోహెడ మండలం నారాయణపూర్కు వెళ్లి తిరిగి రాలేదు. పలుమార్లు బతిమిలాడినా కాపురానికి రాలేదు.
ఆదివారం ఇద్దరు పిల్లలను ఇంటికి పిలిపించుకున్నాడు రమేశ్. సోమవారం ఉదయం రమేశ్ వెళ్లిన వెంటనే రమేశ్ భార్య శ్వేత, తల్లి పోశవ్వ, అత్త పోశవ్వ హుస్నాబాద్లోని రమేశ్ ఇంటికి వచ్చి ఇద్దరు పిల్లలతో ఉన్నారు. లారీ అన్లోడ్ చేసుకొని రాత్రి సుమారు రెండు గంటల సమయంలో ఇంటికి వచ్చిన రమేశ్కు ఇంట్లో పిల్లతో పాటు భార్య, అత్త, తల్లి ఉండటాన్ని చూసి కోపోద్రిక్తుడై కత్తితో అకస్మాత్తుగా దాడికి పాల్పడ్డాడు. తల్లి, భార్య కాళ్లు చేతులను కోసాడు. ఇది చూసిన పెద్దకూతురు పక్కనే ఉన్న పోలీస్స్టేషన్కు వెళ్లి చెప్పడంతో పోలీసులు వచ్చే వరకు రమేశ్ పారిపోయాడు. రక్తపు మడుగులో పడి ఉన్న శ్వేత, పోశవ్వలను సిద్దిపేట దవాఖానకు తరలించారు. అత్త పోశవ్వకు స్వల్పగాయాలు అయ్యాయి. తమకు ఫిర్యాదు అందలేదని, అందిన వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్సై శ్రీధర్ తెలిపారు.