పటాన్చెరు, జనవరి 25: తృణధాన్యాల్లో సంపూర్ణ పోషకాహారం లభిస్తుందని కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ డాక్టర్ బి.నీరజా ప్రభాకర్ అన్నారు. బుధవారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్ క్యాపస్లో గీతం స్కూల్ ఆఫ్ సైన్స్లోని ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ చిరుధాన్యాల ఏడాది -2023 ప్రారంభోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైస్ చాన్స్లర్ మాట్లాడుతూ మన పూర్వీకులు అన్ని రకాల తృణధాన్యాలు తిని, వాటిలో మంచి పోషకాలు లభించడంతో చక్కటి ఆరోగ్యాలతో ఉండేవారన్నారు.
కానీ నేటి యువతరం, చిన్నారులు పిజ్జా, బర్గర్, నూడుల్స్ వంటి ఫాస్ట్ఫుడ్లను తిని అనారోగ్యాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు పాలిష్ చేసిన వరి అన్నానికి అలవాటు కావడంతో ఇప్పుడు సర్వత్రా షుగర్ వ్యాధిని చూస్తున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. చిరుధాన్యాలుగా పిలుస్తున్న వీటిని తినడం వల్ల సంపూర్ణమైన పోషకాలు మన శరీరానికి లభిస్తాయన్నారు. రాగి ఇడ్లీ, రాగి దోశ, కిచిడీ వంటి వాటిని రోజులో ఒకపూటనైన తినాలని సూచించారు. వాటిలో కాల్షియం, ప్రొటీన్, ఫైబర్లు ఎక్కువగా ఉంటాయని వాటితో మలబద్ధకం పోతుందన్నారు. జీర్ణక్రియలు మెరుగుపడుతాయన్నారు. ఈ ఆహారంతో సగం రోగాలు నయమవుతాయన్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు చిరుధాన్యాలను భుజిస్తే అవి నెమ్మదిగా అరగడం వల్ల ఎక్కువసేపు శక్తిని విడుదల చేస్తాయని డాక్టర్ నీరజ చెప్పారు.
అంతర్జాతీయ చిరుధాన్యాల ఏడాది; శాస్త్రవేత్త డాక్టర్ అనంత్
అంతర్జాతీయ చిరుధాన్యాల ఏడాదిపై గీతం అవగాహన కల్పించడం అభినందనీయమని జాతీయ పోషకాహార సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ అనంత్ అన్నారు. మొక్కల ద్వారా వచ్చిన చిరుధాన్యాలను ప్రతిరోజు భుజించాలని, అందులో ప్రొటీన్ ఉంటుందని, అదే మాంసాహారాన్ని రోజూ తీసుకోలేమన్నారు. పలు రకాల ఆహారాలను తినడం వల్ల తగినంత పోషకాలు లభిస్తాయన్నారు. ఆరోగ్యం కూడా బాగుంటుందని వివరించారు. తగినంత ప్రతిఫలం లభించేలా రైతులను ప్రోత్సహిస్తే తృణధాన్యాల సాగుకు ముందుకు వస్తారన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ డి.కోదండరాం మాట్లాడుతూ సంపూర్ణ పోషకాల గని చిరుధాన్యాలు అన్నారు. మన ఆహారపు అలవాట్లు స్థానికంగా ఎక్కువగా లభించే కూరగాయలు, ధాన్యాలను బట్టి ఉండాలన్నారు.
మన మనసుకు నచ్చిన ఆహారం భుజించాలని సూచించారు. ఏది తింటున్నాం, దానిలో పోషకాలు ఎన్ని, ఎంత తినాలన్నది ఎవరికి వారు సొంత అనుభవంతో గ్రహించాలన్నారు. మనం ఏ ఆహారం తింటే జీవితం ఆనందమయంగా ఉంటుందో అదే అత్యుత్తమ ఆహారం అన్నారు. సదస్సులో చిరుధాన్యాలతో చేసిన వంటకాలను విద్యార్థులు ప్రదర్శించారు. యువతను ఆకట్టుకునే కేకులు, స్వీట్స్, ఫాస్ట్ఫుడ్ను చేసి అందరిలో ఆలోచనలు రేకెత్తించారు. కార్యక్రమంలో వికాస డైరెక్టర్ బీ సాలోమి యేసుదాస్, ఇండియన్ ఇన్సిటిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ సీ అరుణారెడ్డి, గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీఎస్రావు, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ దత్తాత్రి కే నగేశ్, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాధిపతి డాక్టర్ ఉమామహేశ్వరీ తదితరులు పాల్గొన్నారు.