పేదలకు నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. వెల్దుర్తి మండల కేంద్రంతో పాటు కుకునూర్ గ్రామంలో కొనసాగుతున్న ‘మనఊరు- మనబడి’ పనులను ఆయన పరిశీలించి వేగంగా, నాణ్యతగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వెల్దుర్తి పంచాయతీకి ఎమ్మెల్యే మదన్రెడ్డి చొరవతో మంత్రి హరీశ్రావు రెండు పల్లె దవాఖానలు మంజూరు చేశారని, ఈ దవాఖానల్లో ఎంబీబీఎస్ డాక్టర్లతో వైద్యసేవలు అందిస్తామన్నారు. రోడ్లకు ఇరువైపులా హరితహారం మొక్కలు నాటకపోవడంపై పంచాయతీ కార్యదర్శిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
– వెల్దుర్తి, జూలై 14
వెల్దుర్తి, జూలై 14: నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శుక్రవారం వెల్దుర్తితో పాటు మండలంలోని కుకునూర్ గ్రామాల్లో మనఊరు- మనబడి పనులను అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, డీఈవో రాధాకిషన్తో కలిసి పరిశీలించారు. కుకునూర్లో మనఊరు- మనబడి నిధుల మంజూరు, ఏయే పనులు చేస్తున్నారు. వాటి పురోగతి గురించి పంచాయతీరాజ్ ఈఈ సత్యనారాయణరెడ్డి, డీఈ రాధికను అడిగి తెలుసుకున్నారు. రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటకపోవడంపై పంచాయతీ కార్యదర్శిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులను వేగంగా, నాణ్యతగా పూర్తి చేయాలని ఆదేశించారు. వెల్దుర్తిలో హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించి, రెండు నెలల్లో నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ ఆదేశించారు. ఎంపీపీఎస్ పాఠశాలలో మనఊరు-మనబడి పనులు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు తెలుపారు. వారం రోజుల్లో ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలన్నారు.
ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణాలు, ఇతర పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఎంపీపీఎస్, ఉన్నత పాఠశాలలకు వెళ్లే ప్రధాన గేట్ల వద్ద ఉన్న శిథిలావస్థ గదులను అధికారుల అనుమతులతో కూల్చివేయాలని ఎంపీడీవో వెంకట లక్ష్మమ్మ, నోడల్ అధికారి సాంబయ్యకు సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వెల్దుర్తి పంచాయతీకి రెండు పల్లె దవాఖానలను ఎమ్మెల్యే చొరవతో మంత్రి హరీశ్రావు మంజూరు చేశారన్నారు. ఈ దవాఖానల్లో ఎంబీబీఎస్ డాక్టర్లు సేవలు అందిస్తారన్నారు. ప్రతి గ్రామంలో పల్లె దవాఖానలు ఏర్పాటు చేసి మెరుగైన వైద్యం, ఉచితంగా మందులు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. వెల్దుర్తిలో మనఊరు-మనబడి పనులు వేగంగా జరుగుతున్నాయని, ఉన్నత పాఠశాలలో 639 మంది విద్యార్థులు ఉండడం హర్షణీయమన్నారు. ఉన్నత పాఠశాల ఆవరణ పెద్దగా ఉన్నదని, పాఠశాలకు ప్రహరీ నిర్మించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట పీఆర్ ఏఈ జుంకీలాల్, మాజీ జడ్పీటీసీ ఆంజనేయులు, నాయకుడు మహేందర్రెడ్డి, టీచర్లు, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.