సిద్దిపేట అర్బన్, జనవరి 24 : ప్రమాదాలు జరిగినప్పుడు, విపత్తు ఆపద వచ్చినప్పుడు, ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు, రేడియేషన్ విడుదలైన సందర్భంలో బాధిత వ్యక్తులను రక్షించడం, సిబ్బంది సురక్షితంగా విధులు నిర్వహించడం వంటి అంశాలపై బుధవారం సిద్దిపేట కలెక్టరేట్లో 10వ బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ బృందం మాక్ డ్రిల్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, అడిషనల్ డీసీపీ మల్లారెడ్డి మాట్లాడారు. దేశంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, పరిశ్రమలు, కర్మాగారాలు, భూగర్భ గనుల్లో ప్రమాదాలు జరిగినప్పుడు, ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు ప్రజలను రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందం తక్షణమే స్పందించి విశేష సేవలు అందిస్తుందన్నారు.
నాలుగు దశాబ్దాల క్రితం భోపాల్లోని ఓ ఫ్యాక్టరీలో రేడియేషన్ విడుదలై మనుషులు, జంతువులు, పక్షులు, గాలి, వాతావరణంపై అది ఎలా ప్రభావం చూపిందో.. అలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజలు ఎలా రక్షించుకోవాలో ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు అర్థమవుతుందన్నారు. కార్యక్రమంలో 10వ బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ అడిషనల్ ఎస్పీ దామోదర్సింగ్, ఇన్స్పెక్టర్ గౌతమ్కుమార్, సబ్ ఇన్స్పెక్టర్ సుధీర్, సిబ్బంది పాల్గొన్నారు.