పటాన్చెరు, సెప్టెంబర్ 28: లంపీస్కిన్ వ్యాధిపై ఉత్తరాదిలో భయాందోళనలు కనిపిస్తున్నాయి. పాల ఉత్పత్తికి కేంద్రాలైన రాజస్థాన్, గుజరాత్తో పాటు పలు రాష్ర్టాల్లో లంపీస్కిన్ వ్యాధి స్వైరవిహారం చేస్తున్నది. చర్మరోగానికి కారణమైన ఈ వైరస్ మ్యూటేషన్ చెంది ఇప్పుడు ఆవులు, గేదెలు, దూడల శరీరభాగాలను కబలించి మృత్యుఒడికి చేరుస్తున్నది. కండ్ల ముందే వందలాది పశువులకు పుండ్లు పడి రక్తాలు కారుతూ నరకయాతన తో చనిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో పశువుల సంరక్షణకు ఆయా రాష్ర్టాలు కష్టపడుతున్నాయి. ఈ వైరస్ ప్రభావం తెలంగాణలో పడకుండా మన ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటున్నది. ఇతర రాష్ర్టాల నుంచి పశువులు మన మార్కెట్లకు రాకుండా చూస్తున్నారు. తెలంగాణ బయోలాజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(వీబీఆర్ఐ) సంస్థ తయారు చేస్తున్న వ్యాక్సిన్ సంజీవనిలా కనిపిస్తున్నది. పశువైద్య నిపుణుల సిఫార్సు మేరకు అన్ని పశు వైద్యశాలలు, మండలాలకు వాక్సిన్ సరఫరా చేస్తున్నారు. మన వైద్య బృందాలు ముందస్తుగా వాక్సిన్లు ఇచ్చి పశుల ప్రాణాలు కాపాడుతున్నారు. రైతులు పసుపు, వేపనూనె, ముద్ద కర్పూరం ఉపయోగించి వైరస్ వ్యాప్తి చెందకుండా చూసుకోవాలని వైద్య బృందా లు సూచిస్తున్నాయి. తెలంగాణలో తీసుకుంటున్న చర్యలతో వ్యాధి ప్రబలదని, పశుపోషకులు ఆందోళన చెందవద్దని వైద్యులు సూచిస్తున్నారు.
ప్రభుత్వం చర్యలు…
ఉత్తర భారతదేశంలో శరవేగంగా విస్తరిస్తున్న లంపీస్కిన్ వ్యాధితో ఇక్కడి రైతులు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ శివారులోని పటాన్చెరు నియోజకవర్గం లో పాడి రైతులు అధికం. పాల ఉత్పత్తులకు నగరంలో భారీ డిమాండ్ ఉండడంతో నగర శివారులో భారీగా పశుపోషణ కొనసాగుతున్నది. లంపీస్కిన్ వైరస్తో ఆవులు, బర్రెలు, దూడలు,ఎద్దులు చనిపోతున్నాయి. ఈ వైరస్ తెలంగాణకు రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. కొత్తగా డెయిరీలు పెట్టుకోవద్దని పశువైద్య నిపుణులు రైతులకు సూచిస్తున్నారు. అధిక పాల ఉత్పత్తుల కోసం ఉత్తర భారత దేశంలోని పశువులను తేవడం మనవద్ద ఎక్కువగా ఉంది. ఇప్పుడు వైరస్ కారణంగా ఉత్తరాది నుంచి పశువులను తేవద్దని అధికారులు సలహా ఇస్తున్నారు. డాక్టర్ల బృందాలు విసృ్తతంగా పర్యటించి ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తే వాక్సిన్ వేస్తున్నాయి. యాంటీబయాటిక్స్ వాడుతున్నారు.
సమృద్ధిగా వ్యాక్సిన్లు…
రాష్ట్రంలో ఉన్న పశు సంపత్తి లెక్కలను బట్టి వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచుతున్నారు. మాసాబ్ట్యాంక్లోని వెటర్నరీ బయాలాజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్లో రాష్ర్టానికి కావాల్సిన స్థాయిలో వ్యాక్సిన్లు తయారు చేస్తున్నా రు. ఇప్పటికే సంగారెడ్డి జిల్లాకు అవసరమైన స్టాక్ అందుబాటులోకి వచ్చిందని అధికారులు తెలుపుతున్నారు. పటాన్చెరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పశువైద్యశాలలకు వ్యాక్సిన్లు, యాంటీబయాటిక్స్, బలం మందులు వచ్చాయి. వీటితో పాటు వైద్యుల బృందం పశువులకు చికిత్స చేస్తున్నారు. ఒక పశువుకు మరో పశువు తగలకుండా చర్యలు తీసుకుంటున్నారు. అంటువ్యాధిగా వ్యాపించే ఈ వైరస్తో ఆవులు, బర్రెల చర్మపై పుండ్లు ఏర్పడతాయి. ఆ పుండ్లపై ఈగలు, దోమలు, ఇతర కీటకాలు కూర్చుని మరో పశువుపై వాలితే వాటికి వైరస్ వ్యాప్తి చెందుతుంది. వైరస్ను వ్యాప్తి చెందకుండా వైద్యులు రైతులు, పాడిపెంపకందారులకు పలు సూచనలు చేస్తున్నారు.
నివారణకు భరోసా…
ముద్ద కర్పూరం పొడి 100 గ్రాములు, పసుపుపొడి 150 గ్రాములు, వేపనూనె ఒక లీటర్ కలిపి ఆ ద్రవాణాన్ని పశువుల శరీరాలపై పూయాలని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో వారంలోపు పుండ్లు, దుద్దుర్లు ఉంటే ఎండిపోతాయని పేర్కొంటున్నారు. మ్యూటేషన్ చెందిన లంపీస్కిన్ వైరస్ను తాము ఇప్పటికైతే చూడలేదని సంగారెడ్డి జిల్లా పశువైద్య బృందం పేర్కొన్నది. రైతులు, డెయిరీ ఫామ్లు నిర్వహిస్తున్నవారు పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు. ఏ పశువుకైనా మచ్చలు వచ్చినా, దుద్దుర్లు, పుండ్ల ఏర్పడితే తక్షణమే పశువైద్యాధికారులకు తెలుపాలని కోరుతున్నారు. అనుమానం వచ్చిన పశువులను మందకు దూరంగా పెట్టాలని సూచిస్తున్నారు. మేకల్లో వచ్చే గోట్ప్యాక్స్ వ్యాధికి వాడే వ్యాక్సిన్ లంపీస్కిన్ వ్యాధిలోనూ పాడి పశువులకు ఉపయోగపడుతున్నదని వైద్యులు తెలిపారు. తెలంగాణలో తయారవుతున్న ఈ వ్యాక్సిన్ను ఇతర రాష్ర్టాలు కావాలని కోరుతున్నాయి.
పాడిరైతులు భయపడవద్దు
పాడి రైతుల భయపడొద్దు. ప్రభు త్వం ఇస్తున్న వాక్సిన్లు లంపీస్కిన్ వ్యాధికి పనిచేస్తున్నవి. ఈ వైరస్ ఆవులు, బర్రెలపైనా వస్తున్నదని సమాచారం. వైరస్ మ్యూటేషన్ చెంది నష్టం చేయడంపై వైద్య నిపుణులు నిశితంగా గమనిస్తున్నారు. ఇప్పటివర కు కొన్ని చోట్ల ఈ వైరస్ లక్షణాలు చూసి చికిత్స చేశాం. పశువులు కోలుకున్నా యి. ఇతర రాష్ర్టాలనుంచి తెచ్చే పశువుల్లో వ్యాధి ఉం డేందుకు ఆస్కారం ఉంది. చర్మం పై మచ్చలు, దుద్దు ర్లు కనిపిస్తే వెంటనే సమాచారమివ్వాలి. వేపనూనె, పసు పు, ముద్దకర్పూరంతో చేసిన ద్రవణం పూస్తే వైరస్ వ్యాప్తి తగ్గుతుంది. – డాక్టర్ విశ్వచైతన్య,
వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, జిన్నారం