కోహీర్, ఆగస్టు 22: నిత్యం రోడ్డు ప్రమాదాలకు జరగుతున్న 65 జాతీయ రహదారిని ప్రమాదరహితంగా రూపొందించాలని పదేండ్ల క్రితం నాలుగు లేన్ల విస్తరణ చేపట్టారు. సంగారెడ్డి నుంచి షోలాపూర్ వరకు జాతీయ రహదారి విస్తరించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని దిగ్వాల్లో పనులు ప్రారంభించారు. రహదారికి ఇరువైపులా ఉన్న ఇండ్ల యజమానులు, దుకాణాదారులకు పరిహారం చెల్లించారు.
కానీ, కొంతమందికి పలు కారణాలతో పరిహారం అందలేదు. జాతీయ రహదారుల సంస్థ, ఎల్అండ్టీ ఆధ్వర్యంలో రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించింది. కానీ, వంతెన నిర్మించే సమయంలో కొంతమంది నిరాకరించడంతో పనులు మధ్యలోనే ఆపేశారు. దీంతో వాహనాల వేగం అధికంగా ఉండడం, వేగ నియంత్రణ లేక ఇప్పటికే 40మందికి పైగా ఇక్కడ మృతిచెందారు. మరిన్ని ప్రమాదాలకు ఆస్కారం లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని దిగ్వాల్ గ్రామ జాతీయ రహదారిపై 90ఫీట్ల వంతెన నిర్మించాలని ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు ఇటీవల కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి వినతి పత్రం అందజేశారు. వంతెనతో పాటు రహదారికి ఇరువైపులా సర్వీస్ రోడ్డు, మురుగు నీరు బయటకు పంపించేందుకు డ్రైనేజీ నిర్మించాలని సంబంధిత ప్రతినిధులకు సూచించారు. దీంతో తాము ప్రతిపాదనలు తయారు చేస్తామని బదులిచ్చారు.
దిగ్వాల్లోని జాతీయ రహదారి పక్కన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో పాటు జీఎంఆర్ కళాశాల, పాఠశాల, సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల, కళాశాల, పిరామల్ పరిశ్రమ, నిప్పొన్ గ్యాస్ పరిశ్రమ ఉండడంతో రోజూ వేలాది మంది రాకపోకలు సాగిస్తున్నారు. జాతీయ రహదారిపై వంతెన లేక రోడ్డు దాటాలంటే చెమటలు పట్టాల్సిందే. 90ఫీట్ల వెడల్పుతో కూడిన వంతెన, సర్వీస్ రోడ్డు, డ్రైనేజీ నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. రహదారికి ఇరువైపులా ఉన్న ఇండ్లు, దుకాణాల యజమానులకు పరిహారం చెల్లించి వెంటనే పనులు ప్రారంభించాలని, వెంటనే ప్రమాద నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరారు.