హుస్నాబాద్, సెప్టెంబర్ 13 : మెట్ట ప్రాంత వరప్రదాయిని గౌరవెల్లి రిజర్వాయర్తో హుస్నాబాద్ నియోజకవర్గం మరో కోనసీమగా మారబోతున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. గౌరవెల్లి రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచి పూర్తి చేస్తున్న తరుణంలో కాంగ్రెస్, బీజేపీలు కేసులు వేసి, పనులను అడ్డుకొని రిజర్వాయర్ పూర్తి కాకుండా ఎన్నో కుట్రలు చేశాయని, వారి కుట్రలన్నీ తిప్పికొట్టి సీఎం కేసీఆర్ను ఒప్పించడం ద్వారా రిజర్వాయర్ను పూర్తి చేసిన ఘనత ఎమ్మెల్యే సతీశ్కుమార్దేనని స్పష్టం చేశారు. త్వరలోనే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా గౌరవెల్లి రిజర్వాయర్ను ప్రారంభించుకొని లక్ష మందితో భారీ బహిరంగసభను ఏర్పాటు చేసుకుందామన్నారు. బుధవారం హుస్నాబాద్ పట్టణంలో సమీకృత ప్రభుత్వ కార్యాలయాల భవన సముదాయానికి ప్రారంభోత్సవం, ఏసీపీ కార్యాలయ భవనం, టీఎన్జీవో భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం పోతారం(ఎస్) శివారులో జరిగిన బీఆర్ఎస్ ఎన్నికల సన్నాహక సభలో మాట్లాడారు. అంతకుముందు ఐవోసీ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోనూ మంత్రి మాట్లాడారు.
2014కు ముందు హుస్నాబాద్లో ఒక్క డివిజన్ స్థాయి కార్యాలయం, రోడ్లు సరిగ్గా ఉండేవి కాదన్నారు. కరువు పీడిత కల్లోల ప్రాంతంగా ఉన్న హుస్నాబాద్ సీఎం కేసీఆర్ అయ్యాక ఎమ్మెల్యే సతీశ్కుమార్ ఆధ్వర్యంలో ఆర్డీవో కేంద్రంగా చేసి అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ప్రజల చెంతకు తెచ్చామన్నారు. దేవాదుల ద్వారా నియోజకవర్గంలోని ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాలు, మిడ్మానేరు ద్వారా చిగురుమామిడి, సైదాపూర్ మండలాలకు సాగునీరందుతున్నదని చెప్పారు. గౌరవెల్లి ద్వారా హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాలకు గౌరవెల్లి రిజర్వాయర్ నీళ్లు రాబోతున్నట్లు తెలిపారు. మహాసముద్రం గండి, గాడుదులొద్దితో చుట్టూ పదిఊర్లకు నీళ్లు పెరిగాయన్నారు. దీంతో మెట్టగా ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గం మరో కోనసీమగా మారడం ఖాయమన్నారు. గౌరవెల్లి రిజర్వాయర్ కాల్వల నిర్మాణం పూర్తయి ప్రతి ఎకరానికి సాగునీరందాలంటే ఎమ్మెల్యేగా వొడితెల సతీశ్కుమార్ను మూడోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని పార్టీ క్యాడర్కు ప్రజలకు పిలుపునిచ్చారు. పదేండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ హుస్నాబాద్ లాంటి మెట్ట ప్రాంతాలకు చేసిందేమీ లేదన్నారు. వారు పరిపాలిస్తున్న రాష్ర్టాల్లో అమలు చేయని దొంగ డిక్లరేషన్లు, అక్కరకు రాని గ్యారెంటీలతో కాంగ్రెస్ మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నదని, ప్రజలు వారిని నమ్మితే మళ్లీ వారి జేబులు నింపుకుంటారు తప్ప ప్రజల బాగోగులను పట్టించుకోరన్నారు.
వచ్చే ఎన్నికలు కాంగ్రెస్ అబద్ధాలు…సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ ఫలాల మధ్యే పోటీ ఉంటుందన్నారు. తెలంగాణలో బీజేపీ దాదాపు బిషాణా ఎత్తేసిందని, జమిలి ఎన్నికల పేరుతో మరో నాటకానికి తెరలేపుతున్నదని ఆరోపించారు. నూకలు తినమన్న బీజేపీకే నూకలు చెల్లే రోజులొచ్చాయని ఎద్దేవా చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా అభివృద్ధే ఎజెండాగా ముందుకుపోతున్న కేసీఆర్ను హ్యాట్రిక్ సీఎంగా తెలంగాణ సమాజం సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకుందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఉన్నప్పటికీ ప్రతిపక్షాల అబద్ధాలు నిజమయ్యే ప్రమాదం ఉన్నదని, ప్రతి కార్యకర్త సైనికుడిలా ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని మంత్రి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్రెడ్డి, సిద్దిపేట, హనుమకొండ జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, డాక్టర్ సుధీర్కుమార్, సిద్దిపేట జడ్పీ వైస్చైర్మన్ రాజిరెడ్డి, హుస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకన్న, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కర్ర శ్రీహరి, పన్యాల భూపతిరెడ్డి, పేర్యాల రవీందర్రావు, దేవేందర్రావు, ఎంపీపీలు మానస, మాలోత్ లక్ష్మి, కొత్త వినీత, కొక్కుల కీర్తి, అనిత, జడ్పీటీసీ భూక్యా మంగ, నాగరాజు శ్యామల, వంగ రవీందర్, గీకురు రవీందర్, మార్కెట్ చైర్పర్సన్ రజనీతిరుపతిరెడ్డి, నాయకులు వెంకట్రామఖరెడ్డి, అన్వర్, పెసరు సాంబరాజు, ఆవుల మహేందర్, మామిడి అంజయ్య, రాజయ్య, అశోక్బాబు, నియోజకవర్గంలోని అన్ని గ్రామాల సర్పంచ్, ఎంపీటీసీలు, సుమారు 18వేల మంది నాయకులు, కార్యకర్తలు, అనుంబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
2001లో అప్పటి ప్రభుత్వాన్ని ఎదిరించి గులాబీ జెండాను ఎగురవేసి తెలంగాణ పోరాటానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుడితే ఎవ్వరికీ భయపడకుండా కెప్టెన్ లక్ష్మీకాంతారావు తన ఇల్లును గులాబీ జెండాకు అడ్డాగా మార్చారని మంత్రి హరీశ్రావు అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులకు నీడనిచ్చి, అన్నం పెట్టి ఆదుకున్న ఘనత కెప్టెన్కే చెందుతుందన్నారు. మచ్చ లేని నాయకుడు, ఆపదలో అండగా ఉంటూ బాధల్లో ఉన్నవారిని ఓదారుస్తూ, నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యంగా ముందుకు పోతున్న సతీశ్ కుమార్ను మూడోసారి లక్ష మెజార్టీతో గెలిపించాలని ప్రజలు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
హుస్నాబాద్ నియోజకవర్గంలో తొమ్మిదిన్నరేండ్లలో రూ.7,752 కోట్లతో అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో గల 162 గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సౌకర్యం, ఉచిత కరెంట్, అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేశామన్నారు. మారుమూల గ్రామాలతోపాటు గిరిజనతండాలకు సైతం పీఆర్, ఆర్అండ్బీ రోడ్ల నిర్మాణం చేశామన్నారు. గౌరవెల్లి రిజర్వాయర్ను పూర్తి చేయడం, ఇతర జలాశయాలకు నిధులు తెచ్చి అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో ఇంత అభివృద్ధి జరిగినా కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఏమీ జరగలేదంటే అబద్ధాల ప్రచారం చేస్తున్నారని, వీటిని తిప్పికొట్టాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలపై ఉందన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉంటూ నిత్యం ప్రజలతో ఉండి కాంగ్రెస్, బీజేపీల అబద్ధాల హామీలను వివరించాలని సూచించారు. ఒక్క పిలుపుతోనే వేలాదిగా తరలివచ్చిన పార్టీ క్యాడర్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
– వొడితెల సతీశ్కుమార్, హుస్నాబాద్ ఎమ్మెల్యే
నీళ్లు, కరెంటు సమస్యలు అధిగమించాం
-బోయినపల్లి వినోద్కుమార్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు
తెలంగాణ రాకముందు రాష్ట్రంలోని ప్రజలు ఎదుర్కొన్న ప్రధాన సమస్యలు నీళ్లు, కరెంట్ అని, ఈ రెండింటినీ సీఎం కేసీఆర్ సారథ్యంలో సాధించుకున్నామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంతో తెచ్చుకున్న తెలంగాణ ప్రజల కలలను నిజం చేసిన ఘనత సీఎం కేసీఆర్కే చెందుతుందన్నారు. తొలి నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ రాష్ట్రంలోని అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయించారన్నారు. కాళేశ్వరం, మల్లన్నసాగర్, కొండపోచమ్మ తదితర భారీ ప్రాజెక్టులు మంత్రి హరీశ్రావు హయాంలోనే రూపుదిద్దుకున్నాయని తెలిపారు. తెలంగాణ రాకముందు రాష్ట్రంలో 7,778మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయితే ప్రస్తుతం 25వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసుకొని రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నామన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా రాష్ట్రంలో 60మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేశామన్నారు. ఏటా 10వేల మంది వైద్యవిద్యను అభ్యసిస్తున్నారన్నారు. కొట్లాడి సిద్దిపేటకు రైల్వేలైన్, ఎల్కతుర్తి-నాందేడ్ వరకు హైవే రోడ్డును తెచ్చుకున్నట్లు తెలిపారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్న సీఎం కేసీఆర్ కావాలో హామీలు ఇచ్చి విస్మరించే కాంగ్రెస్, బీజేపీలు కావాలో ప్రజలు తేల్చుకోవాలన్నారు. రాష్ట్రం, కేంద్రంలో బలమైన శక్తిగా రాష్ట్రం ఉండాలంటే అన్ని ఎమ్మెల్యేస్థానాలు, ఎంపీ స్థానాలకు గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
-కెప్టెన్ లక్ష్మీకాంతారావు, రాజ్యసభ మాజీ సభ్యుడు
పల్లెలు బాగుండాలంటే చిన్న నీటి వనరులు పటిష్టంగా ఉండాలని అప్పట్లో కాకతీయులు భావించి అనేక చెరువులు, కుంటలను నిర్మిస్తే, ఇప్పటి మన సీఎం కేసీఆర్ మిషన్ కాకతీయ పేరుతో చెరువులు, కుంటలను అభివృద్ధి చేసి వాటికి ప్రాణం పోశారని రాజ్యసభ మాజీ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు అన్నారు. సమైక్య పాలకులు తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మించడం సాధ్యం కాదన్నారని, కానీ భారీ ప్రాజెక్టులను నిర్మించి చూపించిన ఘనత సీఎం కేసీఆర్కే చెందుతుందన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలు నమ్మి మోసపోయి గోసపడొద్దని ప్రజలకు సూచించారు. కార్యకర్తలు పార్టీ బలోపేతానికి గ్రామ స్థాయినుంచి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
– వి ప్రకాశ్, తెలంగాణ నీటి వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్
57 ఏండ్ల కాంగ్రెస్ పాలనతో తెలంగాణ భారీ విధ్వంసానికి గురైందని, సాగు తాగునీరు, కరెంటు లేక ప్రజలు ఎన్నో అవస్థలు పడ్డారని, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఆ విధ్వంసానికి తెరపడి బంగారు తెలంగాణ సాకారం అవుతున్నదని తెలంగాణ నీటి వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాశ్ అన్నారు. 2014నుంచి ఇప్పటి వరకు భారీప్రాజెక్టుల నిర్మాణం, పుష్కలంగా కరెంట్ ఉత్పత్తి, పల్లెలు, పట్టణాల సమగ్రాభివృద్ధి రికార్డు స్థాయిలో జరిగిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం మళ్లీ కరువుకాటకాల్లోకి వెళ్లడం ఖాయమన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల అబద్ధపు ప్రచారాన్ని తిప్పి కొడుతూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రజలను చైతన్యం చేయాలన్నారు. బూత్ లెవల్ కమిటీలను బలోపేతం చేసి ఇంటింటికీ తిరిగి తెలంగాణ అభివృద్ధిని వివరించాలని సూచించారు.