దుబ్బాక, ఫిబ్రవరి 27 : పచ్చదనం, అభివృద్ధిలో దుబ్బాక మున్సిపాలిటీని అగ్రగామిగా నిలిపేందుకు రాజకీయాలకు అతీతంగా మున్సిపల్ పాలక వర్గంతో పాటు అధికారులు కృషి చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం దుబ్బాక మున్సిపల్ కార్యాలయంలో 2024-25 బడ్జెట్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వనితాభూంరెడ్డి అధ్యక్షతనలో నిర్వహించిన సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రమేశ్ 2024-25 అంచనా బడ్జెట్ ఎజెండా వివరాలను వివరించి రూ.19.40 కోట్లతో అంచనా బడ్జెట్ను కమిషనర్ సమావేశంలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ… కొత్తగా ఏర్పడిన దుబ్బాక మున్సిపాలిటీని మరింతగా అభివృద్ధి చేసుకోవాల్సి ఉందని, టీయూఎఫ్ఐడీసీ నిధులతో ముందుగా ఆడిటోరియం, వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ భవనాలను నిర్మాణం చేపట్టాలని సూచించారు. పట్టణంలో అండర్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలన్నారు. పట్టణానికి రింగ్ రోడ్డు నిర్మాణం చాలా అవసరమని, వాటికి సంబంధించిన సర్వే పనులు జరిగాయని, జంగిల్ కటింగ్ పనులకు బడ్జెట్లో నిధులు కేటాయించాలని సూచించారు. సీసీ, మురుగు కాల్వలు కాకుండా పట్టణంలో ప్రధాన అభివృద్ధి పనులపై దృష్టి పెట్టాలన్నారు. మున్సిపల్లో అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవన్నారు. తాను ప్రతి సమావేశానికి హాజరవుతానని, ప్రతి వోచర్ను పరిశీలిస్తామని తెలిపారు. లచ్చపేటలో డంప్యార్డు త్వరగా వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. చెల్లాపూర్లో స్టేడియం కోసం ప్రభుత్వానికి అప్పగించిన 5 ఎకరాల స్థలాన్ని మున్సిపల్ ఆధీనంలోకి తీసుకోవాలని, మరో 5 ఎకరాల అసైన్డ్ భూమిని రైతులకు ధాన్యం ఆరబోసేందుకు వసతి కల్పించేందుకు తీసుకోవాలన్నారు. దుబ్బాకలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లు అర్హులకు కేటాయించి, ధ్రువపత్రాలు అందించాలన్నారు. పారిశుధ్య కార్మికులకు పెండింగ్లో ఉన్న రూ.18 లక్షలు వేతనాలను మూడు రోజుల్లో అందించాలని మున్సిపల్ కమినర్ను ఎమ్మెల్యే ఆదేశించారు. దుబ్బాక మున్సిపల్ అభివృద్ధికి తనవంతుగా మరిన్ని నిధులు తెచ్చేందుకు కృషిచేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
దుబ్బాకలో అద్భుతంగా నిర్మించిన కేసీఆర్ బడిలో ప్రాథమిక పాఠశాల నుంచి డిగ్రీ కళాశాల వరకు కొనసాగించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి స్పష్టం చేశారు. దుబ్బాక పట్టణంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల వివరాలు, జూనియర్ , డిగ్రీ కళాశాలలో విద్యార్థుల సంఖ్య , తదితర వాటిపై ఎంఈవో ప్రభుదాస్, ప్రిన్సిపాళ్లతో ఎమ్మెల్యే ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దుబ్బాకలో కేసీఆర్ బడిలో 56 తరగతి గదులు ఉండగా, ఇందులో ప్రస్తుతం ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల మాత్రమే కొనసాగుతున్నాయని తెలిపారు. దీనిని పూర్తిగా వినియోగించేందుకు ప్రాథమిక పాఠశాల నుంచి డిగ్రీ వరకు ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేందుకు దృష్టి సారించినట్లు తెలిపారు.
దుబ్బాకలో గాజుల నరేశ్కు చెందిన ఇల్లు విద్యుదాఘాతంతో దగ్ధమైంది. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. నరేశ్ను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఆయన వెంట మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వనితాభూంరెడ్డి, వైస చైర్పర్సన్ అధికం సుగుణాబాలకిషన్గౌడ్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ మెంబర్లు ఉన్నారు.