పారిశ్రామిక రంగంలో సంగారెడ్డి జిల్లా రాష్ర్టానికే ఆదర్శంగా నిలుస్తున్నది. ఇప్పటికే పటాన్చెరు, జిన్నారం మండలాల్లో వందలాది పరిశ్రమలు కొనసాగుతుండగా, రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. ఇదే వరుసలో జిన్నారం మండలం శివనగర్లో మరో పారిశ్రామికవాడ ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నది. జనరల్, ఎల్ఈడీ పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం 120 ఎకరాల స్థలం కేటాయించింది. ఇప్పటికే టీఎస్ఐఐసీ రోడ్లు, వీధిలైట్లు ఇతర మౌలిక వసతులు కల్పించగా, పలు కంపెనీలు నిర్మాణాలు ప్రారంభించాయి. దాదాపు 80 నుంచి 100 వరకు మధ్య, చిన్నతరహా పరిశ్రమలు రావొచ్చని అధికారులు పేర్కొంటున్నారు. అన్ని కంపెనీలు అందుబాటులోకి వస్తే స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. గ్రామ పంచాయతీకి పన్నుల రూపంలో ఆదాయం సమకూరడంతోపాటు సీఎస్ఆర్ నిధులతో మరింత అభివృద్ధి జరుగుతుందని ప్రజాప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.
జిన్నారం, జూన్ 30: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో మరో పారిశ్రామికవాడ ఏర్పాటవుతున్నది. ఇప్పటికే ఐడీఏ బొల్లారం, గడ్డపోతారం, ఖాజీపల్లి గ్రామాలు పారిశ్రామికవాడలుగా పేరుగాంచాయి. అదే వరుసలో శివనగర్ చేరబోతున్నది. సర్వేనంబర్ 114లోని 120 ఎకరాలు జనరల్, ఎల్ఈడీ పార్కుకు కేటాయించారు. పరిశ్రమల నిర్మాణాలకు ప్రభుత్వం స్థలాలు కేటాయిస్తుండంతో ఇప్పటికే పలు పరిశ్రమల నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఉపాధి అవకాశాలు లేక పటాన్చెరు, ఇస్నాపూర్, లింగంపల్లి, ఇతర ప్రాంతాల్లో ఉపాధి పొందుతున్న స్థానికులకు త్వరలోనే సొంత గ్రామంలోనే ఉపాధి లభించనున్నది. పన్నుల మీదనే ఆధారపడిన గ్రామ పంచాయతీకి జనరల్, ఎల్ఈడీ పార్క్లో పరిశ్రమల నిర్మాణం పూర్తయితే అదనపు ఆదాయం చేకూరనున్నది. శివనగర్లో ఏర్పాటవుతున్న జనరల్, ఎల్ఈడీ పార్క్పై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..
మారనున్న శివనగర్ రూపురేఖలు
శివనగర్ గ్రామం చిన్న పంచాయతీ. కేవలం ఇంటి పన్నులు మీదనే ఆధారపడిన గ్రామం. పంచాయతీ సిబ్బందికి జీతాలు చెల్లించడానికి కూడా ఇబ్బందులే. నూతన పారిశ్రామికవాడతో గ్రామ రూపురేఖలు త్వరలోనే మారబోతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం టీఎస్ఐఐసీ కింద శివనగర్ గ్రామంలో జనరల్, ఎల్ఈడీ పార్కుకు సర్వేనంబర్ 114లో 120 ఎకరాల భూమి కేటాయించింది. దాదాపు ఎనిమిదేండ్ల క్రితం భూమి కేటాయించిన ఎల్ఈడీ పార్కులో టీఎస్ఐఐసీ రోడ్లు, వీధి లైట్లు ఇతర మౌలిక వసతులు కల్పించింది. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చిన వారికి స్థలాలు అప్పగించింది. దీంతో ఇప్పటివరకు ఆరు పరిశ్రమలు నిర్మాణ పనులు చేపట్టాయి. మరిన్ని పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.
తరలివస్తున్న పరిశ్రమలు
జీడిమెట్ల పారిశ్రామికవాడకు చెందిన పలు పరిశ్రమలు ఇక్కడికి వస్తున్నాయి. నాలుగు ఎకరాల స్థలంలో ప్రస్తుతం కెపాసిటర్స్ తయారు చేసే ఓ పరిశ్రమ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. సమీపంలోనే మరో పరిశ్రమ పనులను మొదలుపెట్టింది. ఎల్ఈడీ పార్కులో ఒక్కొక్కటిగా మొదలై పదుల సంఖ్యకు పరిశ్రమల నిర్మాణం చేరుకుంటోంది. మరో ఆరు నెలల్లో సుమారు ఇరవై నుంచి ముప్పై వరకు పరిశ్రమల నిర్మాణాలు జరిగే అవకాశం ఉన్నదని, మీడియం, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ సుమారు 80 నుంచి 100 వరకు రావచ్చని అధికారులు చెబుతున్నారు. నిర్మాణ పనులతో ఎల్ఈడీ పార్కు వచ్చిపోయే వాహనాలు, లేబర్తో సందడిగా మారింది.
ఉపాధి అవకాశాలు లభిస్తాయి
ఎల్ఈడీ పార్కులో పరిశ్రమల నిర్మాణం పూర్తయి, ఉత్పత్తి మొదలైతే శివనగర్ గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాల వారికీ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. చదువుకున్న స్థానిక యువతకు ఇక్కడి పరిశ్రమల్లో ప్రాధాన్యం ఉంటుంది. ఉపాధి కోసం శివనగర్ నుంచి పటాన్చెరుకు అధికంగా వెళ్తుంటారు. ఎక్కువగా వ్యాపారాలు, పరిశ్రమల్లో కార్మికులుగా పని చేస్తున్నారు. పరిశ్రమలు ప్రారంభమైతే పటాన్చెరులో పని చేసే దినసరి కూలీలు, కార్మికులకు దూరభారం, ఖర్చు లేకుండా ఇక్కడే ఉపాధి పొందవచ్చు. పటాన్చెరుకు సుమారు పది కిలోమీటర్ల దూరంలోనే శివనగర్ ఎల్ఈడీ పార్కు ఏర్పాటవుతుండడంతో ఇతర ప్రాంతాల నుంచి ఉపాధి కోసం వచ్చే వారూ ఉంటారు. పటాన్చెరు నుంచి ఇంద్రేశం, కంజర్ల మీదుగా ఎల్ఈడీ పార్కుకు రావచ్చు. ఇంద్రేశం మీదుగా డెక్కన్ ఆటో పరిశ్రమ నుంచి ఎల్ఈడీ పార్కుకు రోడ్డు సౌకర్యం ఉంది.
పంచాయతీకి ఆదాయం
శివనగర్ పంచాయతీకి ఇంటి పన్నులే ప్రధాన ఆదాయం. అది కూడా గ్రామ పంచాయతీలో పని చేసే కార్మికుల జీతాలు, మెయింటెనెన్స్కు సరిపోతున్నది. ఎల్ఈడీ పార్కులో ఏర్పాటవుతున్న పరిశ్రమలతో గ్రామ పంచాయతీకి పన్నుల రూపంలో ఆదాయం సమకూరనున్నది. గ్రామంలో సీఎస్ఆర్ ద్వారా అభివృద్ధి పనులు చేపట్టవచ్చని ప్రజాప్రతినిధులు అంటున్నారు. పైగా ఇక్కడ కావడంతో గ్రామస్తుల నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేవు. చెరువులు, కుంటలకు ఎలాంటి నష్టం ఉండబోదని, గాలి కూడా కలుషితం కాదని ఇలాంటి పరిశ్రమలకు అండగా ఉంటామని గ్రామస్తులు చెబుతున్నారు.
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు
శివనగర్లో ఎల్ఈడీ పార్కు రావడం సంతోషంగా ఉంది. మా గ్రామస్తులకు సొంత గ్రామంలోనే ఉపాధి దొరుకుతుంది. ఏండ్లుగా ఉపాధి కోసం గ్రామస్తులు దూరప్రాంతాలకు వెళ్లొస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం శివనగర్కు ఎల్ఈడీ పార్కు ఇవ్వడంతో గ్రామస్తుల ఇబ్బందులు ఇక తీరినట్లే. గ్రామస్తులందరూ ఎల్ఈడీ పార్కు ప్రారంభోత్సవం కోసం ఎదురు చూస్తున్నారు. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఎల్ఈడీ పార్కు కోసం ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి చాలా సహకరించారు. గ్రామస్తులంతా రుణపడి ఉంటాం.
– కుంచాల ప్రభాకర్, జడ్పీ వైస్చైర్మన్
గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటాం
శివనగర్ గ్రామంలో ఎల్ఈడీ పార్కు ఏర్పాటవడం సంతోషంగా ఉంది. పరిశ్రమల ఏర్పాటుతో గ్రామాభివృద్ధి జరుగుతుంది. గ్రామస్తులకు ఉపాధి దొరుకుతుంది. గ్రామంలోనే చిన్న చిన్న వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఆర్థికంగా లాభపడుతారు. చదువుకున్న గ్రామ యువతకు వారి అర్హతను బట్టి ఉన్న గ్రామంలోనే ఉద్యోగాలు లభిస్తాయి. మా గ్రామాన్ని అభివృద్ధి చేసే, గ్రామస్తులకు ఉపాధినిచ్చే ఎల్ఈడీ పార్కుకు గ్రామస్తులంతా అండగా ఉంటాం.
– రేఖాకృష్ణ, సర్పంచ్, శివనగర్
వలసలు తప్పుతాయి
ఏండ్లుగా ఉపాధి వేట కొనసాగిస్తున్న గ్రామస్తులకు ఎల్ఈడీ పార్కు ఓ వరం. దీంతో వలసలు తప్పుతాయి. శివనగర్ గ్రామస్తులతోపాటు కొడకంచి, సోలక్పల్లి, రాళ్లకత్వ, ఊట్ల తదితర గ్రామాల ప్రజలకూ ఉపాధి అవకాశాలు, చదువుకున్న వారికి అర్హత బట్టి ఉద్యోగాలు లభించనున్నాయి. ఎల్ఈడీ పార్క్తో గ్రామంలో భూమి ధరలు కూడా పెరిగాయి. అలాంటి పారిశ్రామికవాడకు మేము ఎప్పుడూ అండగా ఉంటాం.
– సంతోషి మహేశ్, ఎంపీటీసీ, కొడకంచి, శివనగర్