వర్గల్, మార్చి 27: భక్తజన పాలకుడు..నాచగిరి క్షేత్ర లక్ష్మీనారసింహస్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం ముస్తాబైంది. పవిత్ర హరిద్రా నదీతీరమున శ్వేతగిరి కొండపై లక్ష్మీసమేతంగా కొలువై కోరివచ్చిన భక్తుల కోరికలు తీర్చుతూ అశేష భక్తజన హితుడిగా, సర్వకాలమున సర్వావస్థలో సంరక్షించే నారసింహస్వామిగా పేర్గాంచింది నాచగిరి నృసింహ క్షేత్రం. భాగ్యనగరానికి 55కి.మీ దూరంలోని సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారం సమీపంలో కొండగుహల్లో సుమారు 5వేల ఏండ్ల నుంచి దేదిప్యమానంగా పూజింపబడుతున్న మృగ నారసింహుడిని దర్శించుకునేందుకు రాష్ట్రం నుంచే కాకుండా పక్క రాష్ర్టాల నుంచి కూడా భక్తులు బ్రహ్మోత్సవాల సందర్భంగా భారీగా తరలివస్తుంటారు. శుక్రవారం నుంచి వారం రోజులపాటు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
బ్రహ్మోత్సవాల్లో లక్ష్మీ సమేత నరసింహస్వామిని దర్శించుకుంటే శత్రుబాధ, భూత, ప్రేత పిశాచర బాధితుల నుంచి విముక్తి కలుగుతుందని ఆర్యోక్తి. భక్తులు నిత్య మంగళధాయకుడైన లక్ష్మీనరసింహస్వామికి అర్చనలు, అభిషేకాలు, కల్యాణాలు నిర్వహిస్తుంచారు. దేవతామూర్తుల లగ్నం తర్వాత రోజుకో వాహన సేవపై ప్రతిరోజూ శ్వేతగిరి పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తాడు.
స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ముఖ్యంగా తాగునీరు, కరెంట్, వాహనాల పార్కింగ్ల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాం. స్వామివారి రోజువారీ సేవలతో పాటు చండీ హోమం, నిత్య కల్యాణాలు, హోమాధి పూజల్లో పాల్గొనే భక్తులకు ప్రత్యేక రసీదులు ఇచ్చేందుకు కౌంటర్లు ఏర్పాటు చేశాం. నూటొక్క సత్రాల్లో, దాతలు నిర్మించిన సత్రాల్లో ఇబ్బందులు తలెత్తకుండా నిరంతర పర్యవేక్షణ చేస్తున్నాం.