భీమదేవరపల్లి, జనవరి 9 : ‘గండాలు కడతేర్చు వీరభద్రా’ అని భక్తజనం ప్రణమిల్లే సమ యం ఆసన్నమైంది. కోరమీసాల స్వామికి వెండి, బంగారు మీసాలు సమర్పించి మొక్కులు తీర్చుకునే తరుణం రానే వచ్చింది. ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు మకర సంక్రాంతిని పురస్కరించుకొని నేటి నుంచి 18దాకా అంగరంగవైభవంగా కొనసాగనున్నాయి. ఇందుకోసం ఆలయ అధికారయంత్రాంగం సకల ఏర్పాట్లు చేసింది. మంగళవారం సాయంత్రం భద్రకాళీ, వీరభద్రస్వామి కల్యాణంతో వేడుకలు ప్రారంభం కానున్నాయి.
భక్తుల కొంగుబంగారం కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మకరసంక్రాంతిని పురస్కరించుకుని ఈ నెల 10న స్వామివారి కల్యాణంతో ప్రారంభమయ్యే జాతర ఈ నెల 18న స్వామివారి గ్రామపర్యటనతో ముగుస్తుంది. స్వామివారి కల్యాణమహోత్సవ వేదిక సర్వాంగసుందరంగా ముస్తాబైంది. జాతరకు తెలంగాణలోని జిల్లాల నుంచేకాకుండా పక్క రాష్ర్టాల నుంచి సైతం భక్తజనం తండోపతండాలుగా తరలిరానుం ది. కోరిన కోర్కెలు తీర్చాలని స్వామివారికి భక్తులు కోర మీసాలు సమర్పించనున్నారు. ఉత్సవాల్లో భక్తుల కోసం తాగునీరు, వైద్యశిబిరం, ఇతర మౌలిక వసతుల కల్పిస్తున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ మాడిశెట్టి కుమారస్వామి, ఈవో కిషన్రావు తెలిపారు. ఉత్సవాలకు భారీ బందోబస్తు కల్పిస్తున్నట్లు కాజీపేట ఏసీపీ శ్రీనివాస్ వెల్లడించారు.
స్థల పురాణం..
కాకతీయ రుద్రేశ్వరుడి కాలంలో మల్లికార్జున పండితుడి మనుమడు కేదారి పండితుడి ఆధ్వర్యంలో వీరభద్రస్వామి ఆలయం శైవాగమానుసారం నిర్మించినట్లు స్థలపురాణం చెబుతున్నది. క్రీ.శ. 1600లో కొంతమంది కుమ్మరులు కొండపైకి ఎడ్లబండ్లు కట్టుకొని పోయారు. అక్కడ వారికి కావాల్సిన కట్టెలు కొట్టుకొని ఎడ్లబండ్లలో వేసేందుకు చూడగా ఎద్దులు, బండి కనిపించలేదు. కొండచుట్టూ తిరిగి అలసిపోయి ఆ రాత్రి కొండపైనే నిద్రించారు. వీరభద్రస్వామి వారికి కలలో కనిపించి ‘నన్నీ కొండపై నుంచి దింపి కింద ఉన్న ఆలయంలో ప్రతిష్టించండి’ అని ఆజ్ఞాపించారు. దీంతో మల్లికార్జున పండితుడి మనుమడు కేదారి పండితుడు స్వామివారిని కిందకు దింపి ఆలయంలో ప్రతిష్టింపజేశారు.
బ్రహ్మోత్సవాల్లో కార్యక్రమాలు
ఈనెల 10న సాయంత్రం వీరభద్రస్వామివారి కల్యాణం, 14న భోగి, 15న సంక్రాంతి పర్వదినాన బండ్ల ప్రదక్షిణ, 16న నాగవెల్లి, పుష్పయాగం, 17న త్రిశూల స్నానం, 18 తెల్లవారుజామున అగ్నిగుండాలు, అదేరోజున సా యం త్రం స్వామివారి గ్రామపర్యటనతో బ్రహ్మోత్సవాలు సంపూర్ణం కానున్నాయి.
ఆలయ ఆవరణ రుద్రాక్ష వృక్షం
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా స్వామివారి ఆలయంలో దేవతావృక్షాలైన రుద్రాక్ష, జమ్మి, మర్రి, వేప, జుబ్బి, రావి, ఉసిరి ఉన్నాయి. ఫిబ్రవరి, మార్చిలో రాలిపడే రుద్రాక్షల కోసం భక్తులు వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. బ్రహ్మోత్సవాల్లో రుద్రాక్ష చెట్టును భక్తులు దర్శించుకుంటారు.
ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
కొత్తకొండ జాతరకు టీఎస్ ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడుపుతున్నది. వరంగల్-1 డిపో నుం చే కాకుండా హుజూరాబాద్, హుస్నాబాద్ డిపోల నుంచి నేరుగా కొత్తకొండకు స్పెషల్ బస్సులు నిరంతరం నడువనున్నాయి.
అడుగడుగునా నిఘా..
బ్రహ్మోత్సవాల్లో అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. జాతర ప్రాంగణంలో నలువైపులా రూట్మ్యాప్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయనున్నారు. ఎవరైన దారితప్పితే రూట్మ్యాప్ ఆధారంగా గమ్యం చేరుకునేలా సదుపాయం కల్పిస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా కాజీపేట ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 300మంది పోలీస్ సిబ్బంది జాతర విధులు నిర్వర్తిస్తారని ఆయన తెలిపారు.