దుబ్బాక, జనవరి 21: మాఘ అమావాస్య సందర్భంగా కూడవెల్లి రామలింగేశ్వరాలయం భక్తసంద్రంగా మారింది. శనివారం వేకువజాము నుంచే భక్తుల రాక మొదలైంది. మొదటి రోజు లక్షకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ చంద్రం, ఈవో విశ్వనాథశర్మ తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచే కాకుండా కామారెడ్డి, రంగారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలు, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చారు. ఆలయం వద్ద దుబ్బాక సీఐ కృష్ణ నేతృత్వంలో దుబ్బాక, భూంపల్లి ఎస్సైలు, సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు.
మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్రెడ్డి శనివారం కూడవెల్లి రామలింగేశ్వరున్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీకి ఆలయ ఈవో విశ్వనాథశర్మ, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఎంపీ రామలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత ఆలయ కమిటీ సభ్యులు ఎంపీని సన్మానించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ హయాంలోనే ఆలయాలకు పూర్వ వైభవం సంతరించుకుందన్నారు. సబ్బండా వర్ణాల అభ్యన్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు మరింత శక్తిని ప్రసాదించాలని రామలింగేశ్వరున్ని వేడుకున్నట్లు తెలిపారు. దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్, సీఎం కేసీఆర్ ఎదురులేని శక్తిగా అవతరించాలని ప్రార్థించినట్లు తెలిపారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని మొక్కుకున్నానని చెప్పారు. కూడవెల్లి ఆలయ అభివృద్ధి విషయమై త్వరలో ఆలయ పాలకవర్గం, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి తాను ముఖ్యమంత్రి కేసీఆర్ను కలుస్తామని తెలిపారు. కార్యక్రమంలో కూడవెల్లి ఆలయ కమిటీ చైర్మన్ చంద్రం, జడ్పీటీసీ కడతల రవీందర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ శేర్ల కైలాస్, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.