దుబ్బాక, డిసెంబర్ 3 : శాసనసభ ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డికే పట్టం కట్టారు. ఆదివారం శాసనసభ ఎన్నికల ఫలితాల్లో దుబ్బాక నియోజకవర్గంలో ప్రభాకర్రెడ్డి ఘన విజయం సాధించారు. తొలిసారిగా శాసనసభ నుంచి పోటీ చేసి అత్యధిక మెజార్టీతో ఘన విజయం సాధించి, మరో రికార్డు సృష్టించారు. దుబ్బాకలో గత ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్పై బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు 1070 ఓట్లతో స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావుపై బీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్రెడ్డి 53,513 ఓట్ల మెజార్టీతో ప్రభంజనం సృష్టించారు. కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్రెడ్డి కనీసం డిపాజిట్ కూడా దక్కకపోవడం గమనార్హం.
మొదటి రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకు కొత్త ప్రభాకర్రెడ్డి భారీ మెజార్టీతో కొనసాగారు. దుబ్బాక నియోజకవర్గంలో 1,98,100 ఓటరులుండగా, ఇందులో 1,01,081 మహిళలు, 97,019 మంది పురుషులు ఉన్నారు. ఇందుకు 253 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 87,815 మహిళలు, 85,555 మంది పురుషులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 1,73,370 ఓట్లు పోలయ్యాయి. ఇందులో బీఆర్ఎస్ అభ్యర్థికి 97,451 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి రఘునందన్రావుకు 43,744 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్రెడ్డికి 24,947 ఓట్లు, బీఎస్పీ అభ్యర్థి సల్కాం మల్లేశానికి 1197ఓట్లు పోలయ్యాయి. కొత్త ప్రభాకర్రెడ్డి 53,513 ఓట్లతో భారీ మెజార్టీ సాధించారు. రెండోస్థానంలో బీజేపీ అభ్యర్థి ఉండగా, మూడో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్రెడ్డి నిలిచారు.
దుబ్బాక నియోజకవర్గంలో మొత్తం 1395 పోస్టల్ బ్యాలె ట్ ఓట్లు పోలయ్యాయి. ఇందులో కొత్త ప్రభాకర్రెడ్డికి 428, రఘునందన్రావుకు 622, చెరుకు శ్రీనివాస్రెడ్డికి 288 ఓట్లు పోలయ్యాయి. మరో 57 ఓట్లు ఇతరులకు పోలయ్యాయి. ఇందులో బీజేపీ రఘునందన్రావుకు బీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్రెడ్డి కంటే 194 ఓట్లు అధికంగా వచ్చాయి. ఇక పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డికి మొత్తం 97,879 ఓట్లు, బీజేపీ అభ్యర్థి రఘునందన్రావుకు 44,366 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్రెడ్డికి 25,235 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి రఘునందన్రావుపై కొత్త ప్రభాకర్రెడ్డి 53,513 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నియోజకవర్గంలో 253 పోలింగ్ కేంద్రాలను 19 రౌండ్లుగా విభజించారు. రౌండ్ల వారీగా ఫలితాలను దుబ్బాక రిటర్నింగ్ అధికారి గరిమా అగర్వాల్ వెల్లడించారు. ఎన్నికల ఫలితాల్లో మొదటి రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకు బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి విజయబావుటా ఎగురవేశారు. ప్రతి రౌండ్లో రెండో స్థానంలో బీజేపీ, మూడో స్థానంలో కాంగ్రెస్ నిలిచాయి. 9,10వ రౌండ్లో మాత్రం కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది. అందులో బీజేపీ మూడో స్థానంలో ఉంది. నోటాకు 2252 ఓట్లు పోలయ్యాయి. ఇతరులకు 2441 ఓట్లు పోలయ్యాయి.
మిరుదొడ్డి, డిసెంబర్ 3 : దుబ్బాక ఎమ్మెల్యేగా కొత్త ప్రభాకర్రెడ్డి 53,707 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందడంతో ఆదివారం మిరుదొడ్డితోపాటు మండలంలోని ఆయా గ్రామాల్లో బీఆర్ఎస్ శ్రేణులు పటాకులు కాల్చి స్వీట్లు పంచుకొని సంబురాలు చేసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గజ్జల సాయిలు, జడ్పీటీసీ సూకురి లక్ష్మీలింగం, దుబ్బాక ఆత్మ కమిటీ చైర్మన్ భాస్కరాచారి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తోట కమలాకర్రెడ్డి, పార్టీ అధ్యక్షుడు అంజిరెడ్డి, నాయకులు గొల్ల రాములు, సల్లూరి మల్లేశం, స్వామి, బైరయ్య, బాబు, రమేశ్ పాల్గొన్నారు.
రాయపోల్, డిసెంబర్ 3 : మండలంలోని ఆయా గ్రామాల్లో పార్టీ శ్రేణులు ఆదివారం సంబురాలు జరుపుకొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. దౌల్తాబాద్, రాయపోల్ మండలాల పరిధిలోని ప్రజలు మెజార్టీ స్థాయిలో కొత్త ప్రభాకర్రెడ్డి వైపు ఉండడంతో పార్టీ శ్రేణులో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
చేగుంట, డిసెంబర్ 3 : దుబ్బాక ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందడంతో చేగుంట, నార్సింగి మండల కేంద్రాలతోపాటు పలు గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పటాకులు కాల్చి, మిఠాయిలు పంచి సంబురాలు జరుపుకొన్నారు. కార్యక్రమంలో చేగుంట, నార్సింగి మండలాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సందర్భంగా ఆదివారం ఉదయం నుంచి ప్రజలు ఫలితాలపై ఆసక్తిగా టీవీలు చుశారు.