మల్లన్న ఆశీస్సులతో రాష్ట్రమంతా సస్యశ్యామలంగా మారిందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. బుధవారం ఆయన కొమురవెల్లి మల్లన్నను దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం రూ.12 కోట్లతో చేపట్టే క్యూకాంప్లెక్స్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాలంకాకున్నా కాళేశ్వరం ప్రాజెక్టు ఉందనే ధీమాతో రైతులు నార్లు పోసుకున్నట్లు చెప్పారు. ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సీఎం కేసీఆర్ వెనకడుగు వేయకుండా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిచేయించారన్నారు. మల్లన్నసాగర్ నిర్మించి రెండు పంటలకూ నీళ్లు ఇస్తున్నామని, దీంతో సాగునీటి బెంగ తీరిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో భక్తులకు అన్ని వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత కొమురవెల్లి క్షేత్రం దినదినాభివృద్ధి చెందుతున్నదన్నారు. రూ.36 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు.
– చేర్యాల, జూలై 5
చేర్యాల, జూలై 5 : సీఎం కేసీఆర్ పాలనలో కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయం దివ్యక్షేత్రంగా విరాజిల్లుతున్నదని, స్వామివారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా మారిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మంత్రి హరీశ్రావు బుధవారం కొమురవెల్లి మల్లన్నస్వామిని దర్శించుకుని మహామండపంలో పట్నం వేసి పూజలు చేశారు. కొమురవెల్లి ఆలయంలో రూ.12కోట్ల వ్యయంతో క్యూ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారు. క్యూ కాంప్లెక్స్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఆలయ పాలక మండలి చైర్మన్ గీస భిక్షపతి, ఈవో ఆలూరి బాలాజీతో కలిసి మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. కాలం కాకున్నా కాళేశ్వరం ప్రాజెక్టు ఉందని, గోదావరి జలాలు వస్తాయనే ధీమాతో రైతులు వరి నార్లు పోశారని, కొందరు నాట్లు కూడా వేశారన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సీఎం కేసీఆర్ వెనుకడుగు వేయకుండా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిచేసి మల్లన్నసాగర్ జలాశయాన్ని నిర్మించి రెండు పంటలకు నీళ్లు ఇస్తున్నారని తెలిపారు. ప్రతిపక్షాలు కుట్రలు చేసినా సీఎం కేసీఆర్ పట్టుదలతో కాళేశ్వరం పనులు పూర్తి చేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు తెలంగాణకు కల్పతరువుగా మారిందన్నారు.
కొమురవెల్లి మల్లన్న కల్యాణోత్సవానికి ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ హాజరై పట్టువస్ర్తాలు సమర్పించారని గుర్తు చేశారు. 131 ఎకరాల భూమిని సైతం స్వామివారి పేరిట రిజిస్ట్రేషన్ చేయించి, పట్టా పుస్తకాన్ని అందజేసినట్లు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కొమురవెల్లిలో కనీస సౌకర్యాలు లేవని, తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రత్యేక కృషితో భక్తులకు అన్ని వసతులు కల్పిస్తున్నామన్నారు. మల్లన్న ఆలయ అభివృద్ధికి ఇప్పటి వరకు రూ.36కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. క్యూ కాంప్లెక్స్ నిర్మాణంతో భక్తుల ఇబ్బందులు తీరుతాయన్నారు. కాంపార్ట్మెంట్లలో భక్తులకు ఫ్యాన్లు, టాయిలెట్స్, ఏసీలు, క్యాంటీన్ సదుపాయాలు ఉంటాయని వివరించారు.
సీఎం కేసీఆర్ మల్లన్న కల్యాణోత్సవంలో ఇచ్చిన హామీ మేరకు మల్లన్నస్వామికి బంగారు కిరీటం, వెండి సింహాసనం, కోరమీసాలు తయారు చేయించినట్లు తెలిపారు. ఆలయ తలుపులకు వెండి తాపడం చేయించామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మల్లన్నస్వామి పేరుతో మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మించి, గోదావరి జలాలను పంపింగ్ చేసి, మల్లన్నస్వామి పాదాలు కడిగి మొక్కు చెల్లించుకున్నట్లు తెలిపారు. ఆలయ రహదారిని డబుల్ లైన్గా విస్తరించి, రోడ్డు పనులకు రూ.10.30 కోట్లు మంజూరు చేశారన్నారు. ఆలయ సమీపంలోని బస్టాండ్ వద్ద బండగుట్టపై 50 కాటేజీలు నిర్మాణ దశలో ఉన్నాయని, వాటిని సకాలంలో పూర్తి చేస్తామన్నారు. మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, మల్లారెడ్డి, పద్మరావులతోపాటు దాతలు సైతం దాసారం గుట్టపై అధునిక వసతులతో కాటేజీలను నిర్మించడానికి గుట్ట పైకి బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కొమురవెల్లి క్షేత్రాభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని అభినందించారు. కలెక్టర్ ప్రశాంత్ జీవన్పాటిల్ ఆలయాన్ని ప్లాస్టిక్ రహిత దేవాలయంగా మార్చడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. గతంలో మల్లన్న ఆలయం రూ.4కోట్లు అని, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆదాయం రూ.18కోట్లకు చేరుకుందన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ తలారీ కీర్తనాకిషన్, జడ్పీటీసీ సిలువేరు సిద్ధప్ప, వైస్ ఎంపీపీ రాజేందర్రెడ్డి, మల్లన్న ఆలయ డైరెక్టర్లు నర్ర రఘువీరారెడ్డి, సూటిపల్లి బుచ్చిరెడ్డి, కొంగరి గిరిధర్, కాసర్ల కనకరాజు, మర్పపల్లి శ్రీనివాస్, నామిరెడ్డి సౌజన్యారెడ్డి, చెట్కూరి తిరుపతి, జాటోతు స్వప్న, ఏఈవోలు వైరాగ్యం అంజయ్య, గంగాశ్రీనివాస్, ఆలయ ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, పర్యవేక్షుడు నీల శేఖర్, అర్చకులు, ఒగ్గు పూజారులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.