చేర్యాల, డిసెంబర్ 19: కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో సోమవారం ఆలయవర్గాలు భక్తిశ్రద్ధలతో స్వామి వారికి లక్ష బిల్వార్చన, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం పూజలు నిర్వహించారు. కల్యాణం మరుసటి రోజు ఆలయ సంప్రదాయం మేరకు లక్ష బిల్వార్చన పూజలను మల్లన్న ఆలయం ఆధ్వర్యంలో నిర్వహించారు.అనువంశిక వీరశైవ ఆగమశాస్త్ర ప్రకారం స్వామి వారి ఆలయంలో స్వస్తిక్ పుణ్య వచనం, గణపతిపూజ, రుద్రాభిషేకం, బిల్వార్చన, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, హారతి, మంత్రపుష్పం, మహానైవేద్యం తదితర పూజలను అర్చకులు నిర్వహించారు.
అంతేకాకుండా లక్ష బిల్వాలను(మారేడు) స్వామి మూలవిరాఠ్ వద్ద సమర్పిస్తూ 1008 మల్లన్న నామస్మరణలను పటిస్తూ బిల్వార్చన పూజలు కొనసాగించారు. పూజల్లో ఆలయ అర్చకుడు మహాదేవుని మనోహర్మమత దంపతులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గీస భిక్షపతి, ఈవో ఎ.బాలాజీ, ఏఈవో వైరాగ్యం అంజయ్య, ఆలయ ప్రధానార్చకుడు మహదేవుడి మల్లికార్జున్, పర్యవేక్షకుడు శ్రీనివాస్శర్మ, ఆలయ డైరెక్టర్లు రఘువీర్రెడ్డి, నామిరెడ్డి సౌజన్య, కందుకూరి సిద్దిలింగం, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
ముగిసిన కల్యాణోత్సవ వేడుకలు
కొమురవెల్లిలో రెండురోజులు స్వామి వారి కల్యాణోత్సవాన్ని ఆలయవర్గాల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించిన ఆలయ అర్చకులు, లక్షబిల్వార్చన, మహాన్యాసపూర్వక పూజలతో కల్యాణ వేడుకలు ముగిసినట్లు ప్రకటించారు.రానున్న సంక్రాంతి పర్వదినం అనంతరం వచ్చే మొదటి ఆదివారం రోజు పట్నం వారంతో తిరిగి జాతర ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. మొదటి ఆదివారం పట్నం వారం సందర్భంగా హైదరాబాద్ భక్తులు పట్నం, అగ్నిగుండాల కార్యక్రమాలు నిర్వహిస్తారని, మొదటి వారానికి సుమారు
లక్ష మంది భక్తులు కొమురవెల్లికి తరలివస్తారని వారు వెల్లడించారు.
స్వామి వారి కల్యాణోత్సవ వేడుకలు విజయవంతంగా ముగియడంతో ఆలయవర్గాలు ఆలయ సంప్రదాయం మేరకు చైర్మన్, కమిటీ సభ్యులు,ఆలయ సిబ్బందిని ఈవో ఆధ్వర్యంలో అర్చకులు సన్మానించారు. అంతకుముందు ఆలయంలో జరుగుతున్న లక్షబిల్వార్చన పూజల్లో కమిటీ సభ్యులు పాల్గొనడంతో పాటు బిల్వాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఆర్జిత సేవల ఆదాయం రూ.13,89,680
కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణోత్సవం సందర్భంగా ఆర్జిత సేవల ద్వారా రూ.13,89,680 ఆదాయం వచ్చినట్లు ఆలయ చైర్మన్ గీస భిక్షపతి తెలిపారు.సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆదివారం బుకింగ్ ద్వారా 1,93,238, పులిహోర, లడ్డూ ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.5,06,580, రూ.150 దర్శనం టికెట్ల ద్వారా రూ.2,56,350, ఎల్లమ్మ ఆలయం వద్ద రూ.12,440, గదుల ద్వారా రూ.14,100, అన్నదానంలో దాతల ద్వారా రూ.2,54,364, తలనీలాల మొక్కుల ద్వారా రూ.37,950, ఇతర ఆదాయం రూ.5700 వచ్చినట్లు తెలిపారు. లక్షబిల్వార్చన పూజల రోజున సోమవారం ఆర్జిత సేవల ద్వారా రూ.1,16,306 ఆదాయం వచ్చిందన్నారు.