చేర్యాల, ఫిబ్రవరి 8: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న ఆలయ ఆదాయానికి గండిపడుతున్నది. కొందరు అక్రమంగా పాస్లు విక్రయిస్తూ ఆలయానికి రావాల్సిన ఆదాయాన్ని సొంతజేబుల్లోకి మళ్లించుకుంటున్నారు. భక్తులు వీఐపీ దర్శనానికి రూ.500, శీఘ్రదర్శనానికి రూ.150 చొప్పున కౌంటర్ వద్ద టికెట్ కొనుగోలు చేసి దర్శనం చేసుకుంటారు. దాతలు, ఆలయ అభివృద్ధికి పాటుపడే వారికి మాత్రం ఆలయవర్గాలు దర్శనం పాసులు ఇస్తుంటాయి. ఈ పాస్లు కొందరికి ఆదాయమార్గంగా మారాయి. ఇటీవల బ్రహ్మోత్సవాల మూడో ఆదివారం ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి, ఈవో బాలాజీ, కమిటీ సభ్యులు నిర్వహించిన తనిఖీల్లో కొమురవెల్లికి చెందిన ఐదురుగు వ్యక్తులు అక్రమంగా టికెట్లు విక్రయిస్తూ పట్టుబడ్డారు. ఆలయ ఈవో ఫిర్యాదు మేరకు వారిపై పోలీసులు చీటింగ్ చేసు నమోదు చేశారు.
కాగా, ఈ తతంగంలో ఆలయానికి చెందిన ఓ ద్వితీయశ్రేణి అధికారి హస్తం ఉందనే ఆరోపణలు వచ్చాయి. కాగా, ఆ అధికారి మాత్రం ఈ ఘటనపై తనకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించినట్లు తెలిసింది. ఆలయంలో విధులు నిర్వహించే తృతీయ శ్రేణి సిబ్బంది ఒకరికి కొన్ని పాస్లు ఇచ్చానని, పోలీసులకు పట్డుబడ్డ వారికి ఆయనే ఆ పాసులు ఇచ్చారని, తనపై ఆరోపణలు సరికావని సదరు అధికారి వెల్లడించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పాస్ల జారీ కఠినతరం చేయాలని ఆలయ వర్గాలు నిర్ణయానికి వచ్చాయని, దానికోసం ప్రత్యేక మార్గదర్శకాలు తయారుచేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. గతంలో దర్శనం తదితర టికెట్లను సర్కిలింగ్ చేసి పలువురు వలంటీర్లు, తాత్కాలిక సిబ్బంది అడ్డంగా దొరికిపోయి కేసులు పాలై ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. మళ్లీ ఇటీవల టికెట్ల అక్రమ విక్రయాలు వెలుగుచూశాయి.
కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం వివాదాలకు నిలయంగా మారుతుండడంతో క్షేత్ర ప్రతిష్ట మసకబారుతున్నది. స్వామివారి బ్రహ్మోత్సవాల నిర్వహణపై ఎన్నడూ లేనివిధంగా ఈసారి సిద్దిపేట సమీపంలోని ఓ రెస్టారెంట్లో దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ రోజు ప్రొటోకాల్ పాటించక పోవడంతో స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.ఆలయ ఉత్సవాల నిర్వహణపై ఓ రెస్టారెంట్లో సమీక్ష నిర్వహించడంపై ఎమ్మెల్యేతో పాటు భక్తులు విస్మయం వ్యక్తం చేశారు. స్వామి వారి కల్యాణోత్సవం రోజున మంత్రి కొండా సురేఖ కాన్వాయ్ మిస్ కావడం మరో వివాద మైంది. ఏఈవో వైరాగ్యం అంజయ్యపై ఆలయ పునరుద్ధరణ కమిటీ సభ్యులు కమిషనర్కు ఫిర్యాదు చేయడం, ఆయనపై అధికారులు ఇతర ఆలయానికి పంపించడంతో ఆయన కోర్టును ఆశ్రయించడం వివాదాస్పదం అయ్యింది. ఇటీవల ఆలయ పునరుద్ధరణ కమిటీ సమావేశం అనంతరం మండల కేంద్రంలో దావత్ చేసుకుంటున్న సమయంలో గ్రామానికి చెందిన పలువురు వారిని ఫొటోలు తీసేందుకు యత్నించారు.
ఆ సమయంలో ఆలయంలో విధులు నిర్వహించే తాత్కాలిక సిబ్బంది, ఫొటోలు తీసేందుకు వచ్చి వారు కొట్టుకోవడమే కాకుండా ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. తాజాగా కొందరు వ్యక్తులు పైరవీలతో దర్శనం పాసులు తీసుకువెళ్లి రూ.2500 విలువైన వాటిని రూ.1000కు విక్రయించి పట్టుబడడంతో కేసులు నమోదయ్యాయి. ఇటీవల జరిగిన పట్నం, లష్కర్, మూడో వారం సందర్భంగా తగిన ఏర్పాట్లు లేక, తాగునీటికి, స్నానం చేయడానికి, గదులు లభించక భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వీఐపీల పేరిట ఇష్టారాజ్యంగా దర్శనం కల్పించడంతో సాధారణ భక్తులు క్యూలైన్లలో గంటల కొద్ది వేచి ఉండి దర్శనం చేసుకున్నారు. దీనిపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయ నిర్వహణను గాడిలో పెట్టేందుకు ప్రత్యేక అధికారిని నియమించాలని భక్తులు కోరుతున్నారు. ఇక నుంచి దర్శనాల పాస్ల జారీని కఠినతరం చేస్తామని ఆలయ ఈవో ఎ.బాలాజీ ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు.