చేర్యాల, మార్చి 10: సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తుతున్నారు. ఉత్సవాల 8 వారాన్ని పురస్కరించుకుని ఆదివారం 25వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి బాలాజీ, ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు సౌకర్యాలు కల్పించారు. శనివారం నుంచే ఆలయానికి చేరుకున్న భక్తులు ఆదివారం వేకువజామున నిద్రలేచి స్నానాలు ఆచరించి క్యూలో గంటల పాటు వేచి ఉండి స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం పట్నాలు వేయించి మొక్కులు చెల్లించుకున్నారు.
గంగరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. అడిషనల్ డీసీపీ మల్లారెడ్డి, హుస్నాబాద్ ఏసీపీ సతీశ్, చేర్యాల సీఐ శ్రీను, కొమురవెల్లి, చేర్యాల ఎస్సైలు నాగరాజు, దామోదర్, పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. అడిషనల్ డీసీపీ మల్లారెడ్డి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆయన వెంట ఆలయ ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, ఆలయ కమిటీ సభ్యులు ముస్త్యాల దామోదర్, భిక్షపతి ఉన్నారు.