గజ్జెల లాగులు.. ఢమరుక నాదాలు.. డోలు చప్పుళ్లు.. అర్చకుల పూజలు.. ఒగ్గు పూజారుల పట్నాలు.. పోతరాజుల విన్యాసాలు.. మహిళల బోనాల సమర్పణతో సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న క్షేత్రం పులకించిపోయింది. ఆదివారం పట్నం వారంతో క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. మల్లన్న నామస్మరణతో క్షేత్రం
పరవశించింది.
చేర్యాల, జనవరి 21: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న ఉత్సవాలు పట్నం వారంతో ఆదివారం వైభవంగా ప్రారంభం కాగా.. 75 వేల మంది భక్తులు తరలివచ్చారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అనుగుణంగా ఉత్సవాలు కొనసాగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో మొదటి వారం పట్నం వారంగా పిలవడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ క్రమంలో ఆదివారం పట్నం వారానికి హైదరాబాద్కు చెందిన భక్తులు భారీగా తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. సోమవారం పెద్దపట్నం వేసి అగ్నిగుండం దాటుతారు.
కొమురవెల్లి క్షేత్రానికి శనివారం సాయంత్రం నుంచే భక్తులు చేరుకున్నారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్, ద్విచక్ర వాహనాలపై వచ్చిన భక్తులు గదులను అద్దెకు తీసుకున్నారు. ఆదివారం వేకువజామునే నిద్రలేచి కోనేరు, కాటేజీల్లో స్నానాలు ఆచరించి క్యూలో గంటల పాటు వేచి ఉండి స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. అనంతరం స్వామివారి ముఖ మండపం, గంగరేగు చెట్టు ప్రాంగణంతో పాటు వారు అద్దెకు తీసుకున్న గదుల వద్ద చిలుక పట్నం,గంగరేగు చెట్టు వద్ద నజరు పట్నం, మహామండపంలో ముఖమండ పట్నాలు వేసి మొక్కులు తీర్చుకున్నారు. కొందరు భక్తులు స్వామి వారికి కల్యాణం నిర్వహించడంతో పాటు అమ్మవార్లకు ఒడిబియ్యం పోశారు. అభిషేకాలు, అర్చనలు తదితర పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో ఎ.బాలాజీ, పునరుద్ధరణ కమిటీ చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి, ఏఈవో శ్రీనివాస్, కమిటీ సభ్యులు, అర్చకులు, ఒగ్గు పూజారులు భక్తులకు సేవలందించారు.
చేర్యాల, సిద్దిపేట, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, జనగామ తదితర జిల్లాల నుంచి భక్తులు ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో భారీగా కొమురవెల్లి క్షేత్రానికి తరలివచ్చారు. పట్నం వారం సందర్భంగా ప్రధాన రహదారులన్నీ కొమురవెల్లి వైపే కొనసాగాయి. హైదరాబాద్, సిద్దిపేట, చేర్యాల కొమురవెల్లి రహదారుల్లో రెండు కిలోమీటర్ల మేరకు వాహనాల్లో భక్తులు నిండిపోయారు.
మల్లన్న ఆలయవర్గాల సహకారంతో హైదరాబాద్ ఒగ్గు పూజారుల సంఘం ఆధ్వర్యంలో భక్తులు మల్లన్న క్షేత్రంలోని కల్యాణ వేదిక వద్ద సోమవారం పెద్దపట్నం వేసి అగ్నిగుండం తయారు చేయనున్నారు. స్వామివారి పట్నం వారానికి వచ్చిన భక్తులు పెద్దపట్నం, అగ్నిగుండం దాటి స్వామివారిని మరోసారి దర్శించుకుంటారు. అనంతరం నల్లపోచమ్మ, కొండపోచమ్మ ఆలయాలకు వెళ్లి అక్కడ అమ్మవార్లకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు.