చేర్యాల, ఫిబ్రవరి 4: సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఆలయవర్గాలు, పోలీసుల ఆంక్షల వల్ల తిప్పలు తప్పడం లేదు. ఆయా ప్రాంతాల నుంచి కొమురవెల్లికి చేరుకున్న భక్తుల వాహనాలను క్షేత్రానికి దూరంగా పోలీసులు నిలిపివేస్తున్నారు. దీంతో వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు తమ సామగ్రి నెత్తిన పెట్టుకొని రాలేకపోతున్నారు. స్వామి వారిని దర్శించుకునేందుకు వేకువజామునే ఆలయ క్యూలోకి వచ్చిన భక్తులు గంటల పాటు వేచి ఉండాల్సి వస్తున్నది. మల్లన్నను దర్శించుకుని వెళ్లిపోయే మార్గంలోని ఎగ్జిట్గేట్ నుంచి భక్తులు ఎదురుగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటుండడంతో దానిని నిరోధించేందుకు గేట్కు తాళం వేశారు.ఆలయానికి ఆనుకుని ఉండే వీఐపీ గెస్ట్హౌస్ నంబర్ వన్ నుంచి భక్తులు ఆలయంలోకి పైరవీలతో ప్రవేశిస్తుండడంతో ఇక సామాన్య భక్తులు మల్లన్న దర్శనం కోసం గంటల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. స్వామి వారి క్షేత్రంలో దాతలు నిర్మించిన గదులు భక్తులతో నిండిపోయాయి. దాతల సహకారంతో నిర్మించిన గదుల్లో కొన్ని ఆలయవర్గాలు, మరికొన్ని ఆలయ కమిటీ ప్రతినిధులు, అధికారులు బుక్చేసుకోవడంతో భక్తులకు సక్రమంగా గదులు దొరకడం లేదు.
ప్రైవేట్లో గది అద్దెకు తీసుకుంటే రూ.3000 చెల్లించుకోవాల్సి వస్తున్నది. భక్తుల సమస్యలు పరిష్కరించి ప్రశాంత వాతావరణంలో దర్శనం చేయించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన ఆలయ పునరుద్ధరణ కమిటీ పెద్దలు మొదలుకొని కమిటీ సభ్యులు కేవలం వీఐపీలు, బంధువులు, స్నేహితులకు దర్శనాలు చేయించే పనిలో నిమగ్నమయ్యారు. దీనికి తోడు కొబ్బరికాయలు అధిక ధరలకు విక్రయిస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. గదులు లేక భక్తులు ఆరుబయట స్నానాలు చేసేందుకు డబ్బానీళ్లు కొనుగోలు చేస్తున్నారు. కల్యాణకట్ట వద్ద నాయీబ్రాహ్మణులు రూ.50 నుంచి రూ.100 చెల్లిస్తే తలనీలాలు తీస్తున్నారు. కొందరు ప్రైవేట్ వ్యక్తులు ఎలాంటి అనుమతి లేకుండా ఆలయం, కార్యాలయాలు తదితర ప్రాంతాల్లో తిరుగుతున్నా ఆలయవర్గాలు పట్టించుకోవడం లేదు.
చేర్యాల, ఫిబ్రవరి 4: కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో స్వామివారి బ్రహ్మోత్సవాల భాగంగా 7 ఆదివారాలపాటు ఏటా 4 వేల మందికి అన్నదానం చేస్తున్న మల్లన్న భక్తుడు శంకర్యాదవ్కు ఆలయ వర్గాలు, పోలీసుల చర్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ప్రతి ఆదివారం భక్తులకు అన్నదానం చేసేందుకు శనివారం రాత్రి వరకు హైదరాబాద్ నుంచి కొమురవెల్లికి అన్నదానం తయారు చేసేందుకు అవసరమైన సిబ్బంది, సామగ్రితో శంకర్యాదవ్ చేరుకుంటారు. కానీ ఈసారి ఆలయ వర్గాలు, పోలీసుల ఆంక్షలతో స్వామివారి క్షేత్రానికి దూరంగా వాహనాలు నిలిపి వేయడంతో అక్కడి నుంచి వంట సామగ్రి, వస్తువులను కార్మికులు నెత్తిన పెట్టుకొని రాలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దాత శంకర్యాదవ్ తమ వాహనాలకు అనుమతి ఇవ్వాలని పోలీసులు, ఆలయవర్గాలను కోరినా వారు పట్టించుకోలేదు. దీంతో శంకర్యాదవ్ మానసిక ఆందోళనకు గురై అక్కడి నుంచి సామగ్రి, సిబ్బందిని తీసుకొచ్చి ఆదివారం భక్తులకు అన్నదానం చేశారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు, ఆలయ వర్గాల ఆంక్షలతో ఇబ్బందులు పడుతున్నామని, ఇదే పద్దతి కొనసాగితే ఇక అన్నదానం నిర్వహించడం నిలిపివేస్తానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ వర్గాలు శ్రద్ధ వహించి వేలాది భక్తులకు ఉపయోగపడే అన్నదాన కార్యక్రమం కొనసాగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.