చేర్యాల, ఫిబ్రవరి 4: సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి.స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు మల్లన్నక్షేత్రానికి భారీగా తరలివస్తున్నారు. మల్లన్న దర్శనంతో భక్తులు మంత్ర ముగ్ధులవుతున్నారు. మూడో ఆదివారం స్వామివారి నామస్మరణతో మల్లన్న క్షేత్రం మార్మోగింది. ఆదివారం సందర్భంగా 50వేల మంది భక్తులు మొక్కులు చెల్లించుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. మల్లన్నను ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్యాదవ్, పద్మారావు కుటుంబ సభ్యులతో దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.స్వామి వారి క్షేత్రానికి వచ్చిన భక్తులు ఆలయ నిర్వహణలో ఉన్న గదులు, ప్రైవేట్ గదులు అద్దెకు తీసుకుని అందులో బసచేస్తున్నారు. శనివారం రాత్రి క్షేత్రానికి చేరుకున్న భక్తులు ఆదివారం వేకువజామున నిద్రలేచి పవిత్ర స్నానం ఆచరించి స్వామివారి దర్శనం కోసం క్యూలో గంటల పాటు వేచి ఉన్నారు.
స్వామి వారి దర్శనం అనంతరం గంగరేగుచెట్టు వద్ద ముడుపులు, పట్నం, మరికొందరు తాము బసచేసిన గదుల వద్ద, మహామండపంలో పట్నాలు వేసి మొక్కులు తీర్చుకున్నారు. మరికొందరు గంగరేగుచెట్టు వద్ద ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకోవడంతో పాటు కోరిన కోరికలు తీర్చాలని వేడుకున్నారు. కొందరు భక్తులు అమ్మవార్లకు ఒడి బియ్యం, మల్లన్నకు అభిషేకం,అర్చన తదితర పూజలు నిర్వహించారు. గుట్టపై ఉన్న ఎల్లమ్మకు మహిళలు ఒడి బియ్యం, బోనం సమర్పించుకున్నారు.ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈవో ఎ.బాలాజీ, ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి, ఏఈవో గంగా శ్రీనివాస్, పర్యవేక్షకుడు నీల శేఖర్, ఆలయ ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, కమిటీ సభ్యులు, సిబ్బంది, అర్చకులు, ఒగ్గు పూజారులు భక్తులకు సేవలందించారు. అడిషనల్ డీసీసీ మల్లారెడ్డి ఆధ్వర్యంలో హుస్నాబాద్ ఏసీపీ సతీశ్, చేర్యాల సీఐ శ్రీను, కొమురవెల్లి ఎస్సై నాగరాజు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.