కొల్చారం,మే 17: తెలుగు సాహితీరంగానికి జాతీయ స్థాయిలో ఖ్యాతి తెచ్చిన కోలాచాల మల్లినాథ సూరి పేరిట ఆయన స్వస్థలం మెదక్ జిల్లా కొల్చారంలో సంస్కృత వర్సిటీ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి అన్నారు. కొల్చారంలో బుధవారం కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి, అదనపు కలెక్టర్ రమేశ్, కౌన్సిల్ వైస్ చైర్మన్ వెంకటరమణ, మహారాష్ట్రలోని రామెటెక్ సాంస్కృతిక విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ మధుసూదన్, ఉస్మానియా విశ్వవిద్యాలయం సాంస్కృతిక అకాడమీ డైరెక్టర్ ప్రొఫెసర్ నీలకంఠం, కాలేజీ ఎడ్యుకేషన్ ప్రాంతీ య సంయుక్త సంచాలకుడు డాక్టర్ యాదగిరితో కలిసి స్థలాలను పరిశీలించారు. సంస్కృత విశ్వవిద్యాలయానికి అధికారులు గుర్తించిన 30 ఎకరాలు, మరోచోట 27 ఎకరాల స్థలాన్ని పరిశీలించారు.
మల్లినాథసూరి స్వస్థలమైన కొల్చారంలో సంస్కృత విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడం జిల్లాకు గర్వకారణమని ప్రొఫెసర్ లింబాద్రి అన్నారు. విద్యాశాఖ మంత్రి సూచనల మేరకు కొల్చారంలో రెండు ప్రాంతాల్లో స్థలాలను పరిశీలించామని, కలెక్టర్, ఎమ్మెల్యే కూడా స్థలాలపై పూర్తి సమాచారమిచ్చారని చెప్పారు. పూర్తి నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు. వారి వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, జిల్లా కో ఆప్షన్ సభ్యుడు మన్సూర్, నర్సాపూర్ ఆత్మకమిటీ చైర్మన్ వెంకట్రెడ్డి, ఆర్డీవో సాయిరామ్, తహసీల్దార్ చంద్రశేఖర్,ఎంపీడీవో గణేశ్రెడ్డి, జడ్పీటీసీ మేఘమాల సంతోష్, ఎంపీపీ మంజుల కాశీనాథ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గౌరీశంకర్, సర్పంచ్ ఉమాదేవి రాజాగౌడ్, ఎంపీటీసీ పాల్వంచ అరుణా కృష్ణగౌడ్, ఆత్మ కమిటీ వైస్ చైర్మన్ శేఖర్, ఉప సర్పంచ్ నింగుల చెన్నయ్య, తదితరలు ఉన్నారు.