హవేళీఘనపూర్, మార్చి 20: మండలంలోని కూచాద్రి వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 22 నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతీ ఏడాది ఉగాది నాడు ప్రారంభమై నాలుగు రోజుల పాటు ఉత్సవాలు కొనసాగుతాయి. దక్షిణ భారతదేశంలోనే అరుదుగా కనిపించే ఆలయాల్లో కూచాద్రి వేంకటేశ్వరాలయం ఒకటి. కూచాద్రి వెంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు శని, ఆదివారాల్లో స్వామివారికి అభిషేకాలు, పూజలు, సత్యనారాయణ వ్రతాలు, స్వామివారికి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు జిల్లాలోని ఆయా మండలాలతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల నుంచి భక్తులు వస్తుంటారు. ఇక్కడికి వచ్చిన భక్తుల కోసం ఆలయ కమిటీవారు సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఉత్సవాల్లో భాగంగా ఉగాది పర్వదినం రోజు బండ్ల ఊరేగింపు, అనంతరం రథోత్సవం కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ పూజారి నవీన్ తెలిపారు.
ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి…
కూచాద్రి వేంకటేశ్వరాలయం ఉత్సవాలకు ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. కూచన్పల్లి గ్రామ శివారులోని ఎత్తైన గుట్టపై పెద్ద బండరాతిలో మధ్య వెలిసిన కూచాద్రి వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు ఉత్సాహంగా తరలివస్తారు. ఉగాది రోజుల జరిగే ఈ జాతరకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఆరు రోజులపాటు కొనసాగనున్న ఈ ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు మంగళవారం ఉదయం 4 గంటలకు సుప్రభాతసేవ, తిరుమంజనసేవ తదుపరి పచ్చడి, తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది. 22న సుప్రభాత సేవ, స్వామివారికి అభిషేకం, 7 గంటలకు బాలభోగం, కుంకుమార్చన, మహానైవేద్య తీర్థ ప్రసాద వితరణ, బేతాళస్వామికి శకట భ్రమణం నిర్వహిస్తారు. 26న ఉదయం సుప్రభాతం, అభిషేకాలు, స్వామివారికి ఎదుర్కోళ్లు, మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారికి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. అనంతరం నల్లపోచమ్మకు శకట భ్రమణం, రాత్రి 3 గంటలకు రథోత్సవం జరుగుతుంది.
తిరుమల ఆలయం కన్నా పూర్వ చరిత్ర
దక్షిణ భారతదేశంలో అరుదుగా కనిపించే దేవాలయాల్లో కూచాద్రి వెంకటేశ్వరాలయం ఒక్కటిగా పురాణాలు చెబుతున్నాయి. రెండు శిలల మధ్యలో స్వామివారు వెలియడం అరుదు. అందులో శ్రీ కూచాద్రి వేంకటేశ్వరాలయం ఒక గొప్ప ఆలయంగా ఇక్కడి భక్తులు నమ్ముతుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి తిరుమలలో ఏడు కొండల వేంకటేశ్వరుడి కన్నా ముందే ఇక్కడ స్వామివారు వెలిసిననట్లు చరిత్ర చెబుతోంది. రాతి గుహల్లో వేంకటేశ్వరుడు వెలియడం అద్భుతం. రాతిగుహలో ఉన్న స్వామివారిని దర్శించుకోవాలంటే పొర్లుదండాలు పెట్టక తప్పదు. ఈ కొండపై లక్ష్మీసమేతంగా కొలువుదీరాలని వేడుకుంటూ కూచితాహి అనే మహాసాద్వి కఠోర తపస్సు చేయగా ప్రత్యక్షమైన ఆ దేవదేవుడు భక్తురాలి కోరిక మేరకు కొండపై వెలసినట్లు ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది.
శ్రీ వేంకటేశ్వర స్వామి తిరుమలలో వెలియక ముందే కూచాద్రిలో వెలసినట్లు మరో స్థల పురాణం చెబుతోంది. ఏడుకొండల వేంకటేశ్వర స్వామికి వైశాక మాసంలో ఉత్సవాలు జరిగితే కూచాద్రిలో మాత్రం ఉగాది రోజు ఉత్సవాలు జరుగుతాయి. వైష్ణవ ఆలయాల్లో ఎక్కడ కూడా శివ మందిరాలు ఉండవు. కానీ ఇక్కడ మాత్రం శివ కేశవులు దర్శనమిస్తారు. ఈ ఆలయానికి క్షేత్ర పాలకులుగా పంచ బేతాళుడు కాపలాగా ఉన్నారు. ఒకరు ఆలయ ధ్వజస్తంభం ముందు, మరొకరు గుడి మండపంలో ఉన్నారు. గ్రామానికి మూడు వైపులా కాల భైరవుడు, బేతాళస్వామి ఆలయానికి క్షేత్ర పాలకులుగా వెలిశారు.